విభజన తరువాత, మొట్టమొదటిసారిగా సంస్కృత భాష పాకిస్థాన్లోని విద్యా సంస్థల్లోకి అడుగుపెట్టింది! లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (ఎల్యూఎంఎస్)లో ఈ శాస్త్రీయ భాషకు సంబంధించి నాలుగు-క్రెడిట్ల కోర్సును ఇటీవలే ప్రారంభించారు. గతంలో మూడు నెలల పాటు నిర్వహించిన వీకెండ్ వర్క్షాప్నకు విద్యార్థులు, పండితుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఈ కోర్సును ప్రవేశపెట్టారు.

ఈ కోర్సులో భాగంగా, విద్యార్థులు దూరదర్శన్లో ప్రసారమైన 'మహాభారత్' టీవీ సీరియల్ ఐకానిక్ థీమ్ సాంగ్ అయిన "హై కథా సంగ్రామ్ కీ" ఉర్దూ అనువాదాన్ని కూడా నేర్చుకుంటారు!
అపురూపమైన సంస్కృత గ్రంథాలయం..
గుర్మానీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అలీ ఉస్మాన్ ఖాస్మీ 'ది ట్రిబ్యూన్' పత్రికతో మాట్లాడుతూ.. పంజాబ్ యూనివర్సిటీ లైబ్రరీలో అత్యంత గొప్పదైన, కానీ బాగా నిర్లక్ష్యానికి గురైన సంస్కృత గ్రంథాలయం ఒకటి ఉందని తెలిపారు.
"సంస్కృత తాళపత్ర గ్రంథాల ముఖ్యమైన సేకరణను పండితుడు జేసీఆర్ వూల్నర్ 1930ల్లో కేటలాగ్ చేశారు. కానీ 1947 తర్వాత ఒక్క పాకిస్థానీ విద్యావేత్త కూడా వీటిని పట్టించుకోలేదు. కేవలం విదేశీ పరిశోధకులు మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. స్థానికంగా పండితులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ పరిస్థితి మారుతుంది," అని ఆయన అన్నారు.
మహాభారతం, భగవద్గీతపై కూడా రాబోయే రోజుల్లో కోర్సులను విస్తరించాలని యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది! "మరో 10-15 సంవత్సరాల్లో, పాకిస్థాన్ నుంచే గీత, మహాభారతంలో నిపుణులైన పండితులను మనం చూడవచ్చు," అని డాక్టర్ ఖాస్మీ ఆశాభావం వ్యక్తం చేశారు.
‘సంస్కృతం కేవలం మతానికే పరిమితం కాదు..’
ఫార్మాన్ క్రిస్టియన్ కాలేజీలో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షాహిద్ రషీద్ కృషి వల్లే ఈ మార్పు సాధ్యమైంది.
{{/usCountry}}ఫార్మాన్ క్రిస్టియన్ కాలేజీలో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షాహిద్ రషీద్ కృషి వల్లే ఈ మార్పు సాధ్యమైంది.
{{/usCountry}}"శాస్త్రీయ భాషల్లో మానవాళికి ఎంతో జ్ఞానం నిక్షిప్తమై ఉంది. నేను అరబిక్, పర్షియన్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించి, ఆ తర్వాత సంస్కృతాన్ని అధ్యయనం చేశాను," అని డాక్టర్ రషీద్ తెలిపారు.
కేంబ్రిడ్జ్ సంస్కృత పండితురాలు ఆంటోనియా రూపెల్. ఆస్ట్రేలియన్ ఇండియాలజిస్ట్ మక్-కోమాస్ టేలర్ పర్యవేక్షణలో ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా తాను నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు.
"శాస్త్రీయ సంస్కృత వ్యాకరణాన్ని పూర్తి చేయడానికి నాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది. ఇప్పటికీ నేను దాన్ని అధ్యయనం చేస్తూనే ఉన్నాను," అని ఆయన వివరించారు.
సంస్కృతాన్ని అధ్యయనం చేయాలనే తన నిర్ణయాన్ని చాలా మంది ప్రశ్నించారని డాక్టర్ రషీద్ అన్నారు. "నేను వారికి, 'మనం ఎందుకు నేర్చుకోకూడదు?' అని ప్రశ్నిస్తాను. ఇది మొత్తం ప్రాంతాన్ని కలుపుగోలు చేసే భాష. సంస్కృత వ్యాకరణ పండితుడు పాణిని గ్రామం ఈ ప్రాంతంలోనే ఉంది. సింధు లోయ నాగరికత సమయంలో ఇక్కడ అనేక రచనలు జరిగాయి. సంస్కృతం ఒక పర్వతం లాంటిది – ఒక సాంస్కృతిక స్మారక చిహ్నం! మనం దానిని సొంతం చేసుకోవాలి. ఇది మనది కూడా; ఇది ఏ ఒక్క మతానికీ చెందినది కాదు," అని ఆయన స్పష్టం చేశారు.
దక్షిణాసియాలోని ప్రజలు ఒకరికొకరు శాస్త్రీయ సంప్రదాయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే, మరింత సామరస్యపూర్వకమైన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
"భారత్లోని ఎక్కువ మంది హిందువులు, సిక్కులు అరబిక్ నేర్చుకోవడం ప్రారంభిస్తే, అలాగే పాకిస్థాన్లోని ఎక్కువ మంది ముస్లింలు సంస్కృతం నేర్చుకుంటే, అది దక్షిణాసియాకు ఒక కొత్త, ఆశాజనకమైన ప్రారంభం అవుతుంది! అక్కడ భాషలు అడ్డంకులకు బదులుగా వారధులుగా మారతాయి," అని ఆయన పేర్కొన్నారు.