...
...
Next Story

ఎంసీఎక్స్‌లో పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఆ వివరాలివే

దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో పసిడి, వెండి ధరలు బుధవారం లాభాల్లో నమోదయ్యాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పతనం, డాలర్ సూచీ బలహీనపడటం సహా అమెరికా ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుండటంతో పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.

Published on: Aug 26, 2026, 09:33:39 IST
Advertisement

దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్ (MCX)లో పసిడి, వెండి కొనుగోళ్లు పుంజుకున్నాయి. బుధవారం (ఆగస్టు 26) ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు లాభాల బాట పట్టాయి.

ఎంసీఎక్స్‌లో ప్రస్తుత ధరలు

ఎంసీఎక్స్‌లో పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఆ వివరాలివే
ఎంసీఎక్స్‌లో పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఆ వివరాలివే

ఉదయం 9:10 గంటల సమయంలో ఎంసీఎక్స్ అక్టోబర్ పసిడి ఫ్యూచర్స్ 0.16 శాతం పెరిగి 10 గ్రాములకు 1,63,146 వద్ద నమోదు కాగా, సెప్టెంబర్ వెండి ఫ్యూచర్స్ 0.64 శాతం పుంజుకుని కిలోకు 2,45,700 వద్ద ట్రేడైంది.

చమురు పతనం.. డాలర్ బలహీనత

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ రకం ముడిచమురు ధరలు ఒక్కసారిగా 3 శాతం పతనమై బ్యారెల్‌కు 86 డాలర్ల వద్దకు చేరాయి. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి నిర్వహణపై పొరుగున ఉన్న ఒమన్‌తో ఇరాన్ చర్చలు పునఃప్రారంభించినట్లు ప్రకటించడంతో చమురు సరఫరా పునరుద్ధరణపై ఆశలు చిగురించాయి. మరోవైపు, అమెరికా డాలర్ ఇండెక్స్ 99 మార్కు కిందకు దిగొచ్చింది. ఇవన్నీ పసిడి కొనుగోళ్లకు అనుకూలంగా మారాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. చైనా స్పందన

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోలేదు. టెహ్రాన్‌పై వాషింగ్టన్ విధించిన కొత్త ఆంక్షలు ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురావని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్‌తో ఆర్థిక సంబంధాల విషయంలో ట్రంప్ యంత్రాంగానికి చైనా గట్టి సవాల్ విసిరింది.

"ఇరాన్‌తో మా సంబంధాలను ఎవరూ దెబ్బతీయలేరు. మా ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం" అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ హెచ్చరించారు. చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన కొద్ది గంటల్లోనే బీజింగ్ ఈ విధంగా స్పందించడం గమనార్హం.

అమెరికా ద్రవ్యోల్బణ డేటాపైనే దృష్టి

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక ప్రాధాన్యమిచ్చే జూలై నెల పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ (పీసీఈ) ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల కానున్నాయి. దీంతో పాటు శుక్రవారం జరిగే వార్షిక జాక్సన్ హోల్ సదస్సులో ఫెడ్ ఛైర్మన్ కేవిన్ వార్ష్ చేసే ప్రసంగంపైనే గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ దృష్టిని కేంద్రీకరించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe