H-1B visa : ఎఫ్వై27 హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియపై బిగ్ అప్డేట్..
2027 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ తేదీలను యూఎస్సీఐఎస్ ప్రకటించింది. భారీగా పెంచిన పిటిషన్ ఫీజు, కొత్త ఎంపిక విధానం వంటి నిబంధనలు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు హెచ్-1బి వీసా ప్రక్రియలో సవాలుగా మారనున్నాయి.
హెచ్-1బీ వీసా ప్రక్రియపై కీలక ప్రకటన చేసింది అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్). 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత హెచ్-1బీ క్యాప్ రిజిస్ట్రేషన్లు 2026 మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు (ఈటీ) ప్రారంభమై, మార్చి 19 మధ్యాహ్నం 12 గంటల (ఈటీ) వరకు కొనసాగుతాయని వెల్లడించింది. అయితే, ఈసారి ప్రకటనలో లక్ష డాలర్ల (సుమారు రూ. 84 లక్షలు) భారీ పిటిషన్ ఫీజు, కొత్త 'వెయిటెడ్ సెలక్షన్' విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.

హెచ్-1బీ వీసా: మీరు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలు..
ప్రాథమిక రిజిస్ట్రేషన్ గడువు: మార్చి 4 నుంచి మార్చి 19, 2026 వరకు.
మొత్తం వీసాల సంఖ్య (క్యాప్): 85,000.
రిజిస్ట్రేషన్ ఫీజు: 215 డాలర్లు
ఎంపిక ప్రక్రియ: మార్చి 31, 2026 నాటికి పూర్తవుతుంది
ఎంపికైన తర్వాత చెల్లించాల్సిన ఫీజు: 1,00,000 డాలర్లు (సుమారు రూ. 84 లక్షలు)
ఎంపిక విధానం: ఒకవేళ 85,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే 'వెయిటెడ్ సెలక్షన్' నిర్వహిస్తారు.
హెచ్-1బీ వీసా: ఎంపిక ప్రక్రియ ఎలా సాగుతుంది?
మార్చి 4వ తేదీ మధ్యాహ్నం నుంచి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని జనవరి 30న యూఎస్సీఐఎస్ ఒక అప్డేట్ ఇచ్చింది.
ఈ ప్రక్రియలో పాల్గొనాలనుకునే వారు యూఎస్సీఐఎస్ ఆన్లైన్ అకౌంట్ కలిగి ఉండాలి. మార్చి 4వ తేదీ వరకు కంపెనీ ప్రతినిధులు లేదా ఉద్యోగులు అభ్యర్థుల సమాచారాన్ని నమోదు చేయడానికి వీలుండదు.
ప్రతి రిజిస్ట్రేషన్కు 215 డాలర్ల రుసుమును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది.
మార్చి 19న రిజిస్ట్రేషన్లు ముగిసిన తర్వాత ఎంపిక ప్రక్రియ చేపడతారు.
ఎంపికైన వారికి మార్చి 31, 2026 లోపు సమాచారం అందిస్తారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎంపికైన వారు మాత్రమే హెచ్-1బీ పిటిషన్ను దాఖలు చేయడానికి అర్హులు.
2027 సీజన్లో వచ్చిన కొత్త మార్పులు ఏంటి?
ఈ ఏడాది నుంచి యూఎస్సీఐఎస్ కొత్త ఎంపిక విధానాన్ని అమల్లోకి తెస్తోంది. దీని ప్రకారం, "అత్యంత నైపుణ్యం కలిగిన, ఎక్కువ వేతనం పొందే విదేశీయులకు" మొదటి ప్రాధాన్యత లభిస్తుంది.
వెయిటెడ్ సెలక్షన్: కేటాయించిన 85,000 కోటా కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు, అభ్యర్థుల నైపుణ్యాలు, వేతనాల ఆధారంగా 'వెయిటెడ్ సెలక్షన్' విధానంలో వీసాలను కేటాయిస్తారు.
ఒకవేళ కోటా కంటే తక్కువ దరఖాస్తులు వస్తే: 85,000 కంటే తక్కువ అప్లికేషన్లు వస్తే మాత్రం, సరైన పద్ధతిలో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులందరినీ ఎంపిక చేస్తారు.
భారీ పిటిషన్ ఫీజు: ఎంపికైన అభ్యర్థులకు యూఎస్సీఐఎస్ ఒక భారీ షరతు పెట్టింది. "రిజిస్ట్రేషన్లో ఎంపికై, పిటిషన్ దాఖలు చేయడానికి అర్హత పొందిన అభ్యర్థి, అర్హత నిబంధనల ప్రకారం అదనంగా లక్ష డాలర్ల (సుమారు రూ. 84 లక్షలు) ఫీజును చెల్లించాల్సి రావచ్చు," అని స్పష్టం చేసింది.
బయోమెట్రిక్స్: అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించుకోవడానికి ఫింగర్ ప్రింట్లు, ఫోటో, సంతకాన్ని (బయోమెట్రిక్స్) సేకరిస్తారు. చిరునామా మార్పులు లేదా ఇతర భద్రతా కారణాల దృష్ట్యా 'రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్' (ఆర్ఎఫ్ఈ) ద్వారా అదనపు ఆధారాలను కోరే అవకాశం కూడా ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


