Retirement fund : 47ఏళ్లకే రూ. 15కోట్లతో రిటైర్మెంట్! వ్యాపారంతో కాదు.. నెలవారీ జీతంతోనే! ఎలా సాధ్యం?

Early Retirement Tips : ఎటువంటి వారసత్వ ఆస్తి, వ్యాపార నేపథ్యం లేకుండా కేవలం ఉద్యోగ జీతంతోనే రూ. 15 కోట్ల సంపద సృష్టించి, 47 ఏళ్లకే స్వచ్ఛంద రిటైర్మెంట్ తీసుకున్న ఐటీ నిపుణుడు వివేక్ వామన్ సక్సెస్ స్టోరీ ఇది. ఈ టిప్స్​ మీరు కూడా పాటించవచ్చు.

Published on: Jul 3, 2026, 06:44:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి, ఉద్యోగాల్లో చేరిన ప్రతి ఒక్కరికీ జీవితంలో త్వరగా స్థిరపడాలి, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలనే కల ఉంటుంది. కానీ, కేవలం నెల జీతంతోనే కోట్లు సంపాదించడం సాధ్యమేనా? అంటే.. ఖచ్చితంగా సాధ్యమేనని నిరూపించారు ఐటీ రంగ నిపుణుడు వివేక్ వామన్. ఎటువంటి వ్యాపారాలు చేయకుండా, పూర్వీకుల నుంచి రూపాయి ఆస్తి రాకపోయినా.. కేవలం క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులతో ఆయన ఊహించని సంపదను సృష్టించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 24 ఏళ్ల పాటు పనిచేసిన వివేక్, తను అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని ముందే చేరుకోవడంతో 47 ఏళ్ల వయసులోనే ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు.

రూ. 15కోట్లతో రిటైర్ అయిన వివేక్ వామన్ స్టోరీ..
రూ. 15కోట్లతో రిటైర్ అయిన వివేక్ వామన్ స్టోరీ..

రూ. 12 వేల జీతం నుంచి రూ. 20 కోట్ల సామ్రాజ్యం వరకు..

ఇటీవల '1% క్లబ్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న వివేక్ వామన్ తన ఆర్థిక ప్రయాణాన్ని పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఆయన మొదటి జీతం కేవలం రూ. 12,000 మాత్రమే. కానీ, కష్టపడుతూ విప్రో, యాక్సెంచర్, పీడబ్ల్యూసీ వంటి దిగ్గజ కార్పొరేట్ కంపెనీల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. తన కెరీర్ చివరి దశకు వచ్చేసరికి ఆయన నెలవారీ జీతం రూ. 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు చేరింది. 2021 నాటికి ఆయన కుటుంబ నికర ఆస్తి విలువ రూ. 15 కోట్లకు చేరుకుంది. నిజానికి ఆయన రిటైర్మెంట్ కోసం రూ. 10 కోట్లు చాలని భావించినప్పటికీ, అంతకంటే ఎక్కువే సాధించారు.

ప్రస్తుతం మార్కెట్ ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఆయన సంపద రూ. 20 కోట్లు దాటడం విశేషం.

చిన్న మొత్తాలే.. కొండంత నిధి!

ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా సంపాదించారన్న ప్రశ్నకు వివేక్ చాలా సరళంగా సమాధానమిచ్చారు. "చుక్క చుక్క కలిస్తేనే సముద్రం అవుతుంది. సుదీర్ఘ కాలం పాటు సహనం, క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడమే నా విజయ రహస్యం. దీర్ఘకాలిక పెట్టుబడి అనేది గోడకు వేసిన రంగు ఆరడాన్ని చూడటం లేదా గడ్డి పెరగడాన్ని గమనించడం లాంటిది. ఇది చాలా బోర్ కొట్టే ప్రక్రియలా అనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే అలా ఉండాలి," అని ఆయన వివరించారు.

ఉద్యోగులకు వివేక్ ఇచ్చిన 4 బంగారు సూత్రాలు..

9 టు 5 ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వాతంత్ర్యం సాధించవచ్చని వివేక్ బలంగా చెబుతున్నారు. అందుకోసం యువ ఉద్యోగులకు ఆయన నాలుగు కీలక సూత్రాలను సూచించారు.

నిరంతర అభ్యాసం : కెరీర్ ప్రారంభంలోనే కాకుండా, ఉద్యోగంలో ఉన్నంత కాలం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూనే ఉండాలి. ఇది మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుంది.

ఖర్చులపై నియంత్రణ: మీ ఆదాయం పెరిగినప్పుడు, దానికి అనుగుణంగా విలాసాల కోసం ఖర్చులను పెంచకండి. జీతం పెరిగితే పొదుపును పెంచాలి.

గోల్ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లాన్: ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ (ఆర్థిక సలహాదారు) సహాయంతో మీ జీవిత లక్ష్యాలకు తగినట్లుగా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ సిద్ధం చేసుకోండి.

కాంపౌండింగ్‌ను అడ్డుకోవద్దు: మీ పెట్టుబడులు చక్రవడ్డీ ద్వారా పెరిగేలా సుదీర్ఘ కాలం పాటు వాటిని కదపకుండా ఉంచండి. మధ్యలోనే డబ్బును విత్‌డ్రా చేయవద్దు.

డబ్బు ఇచ్చే అతిపెద్ద లగ్జరీ ఏంటి?

చాలామంది సంపద అంటే లగ్జరీ కార్లు, ఖరీదైన ఇళ్లు అనుకుంటారు. కానీ వివేక్ దృష్టిలో డబ్బు ఇచ్చే అతిపెద్ద లగ్జరీ 'మానసిక స్వేచ్ఛ'. "డబ్బు మనకు నచ్చని విషయాలకు, అవసరం లేని పనులకు 'నో' చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది. ప్రపంచంలో డబ్బు అనంతమైనది. మీరు ఎంత సంపాదించినా మీకంటే ఎక్కువ ఉన్నవాడు ఒకడు ఉంటాడు. కానీ, కాలం చాలా పరిమితమైనది. డబ్బుతో సంతోషాన్ని కొనలేం కానీ సమయాన్ని కొనగలం. ఆ సమయమే మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది," అని వివేక్ వామన్ ముగించారు.

ప్రస్తుతం ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి, సొంతంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ నడుపుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More