Honda cars : హోండా నుంచి ఇండియాలోకి తొలి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఎస్యూవీ- టయోటాకు చెక్?
Honda ZR V price : భారతదేశంలో ఎస్యూవీలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని హోండా కార్స్ ఇండియా తన పోర్ట్ఫోలియోను సమూలంగా మార్చబోతోంది. ఇందులో భాగంగా ఒక హైబ్రిడ్ ఎస్యూవీని, ఒక ఎలక్ట్రిక్ ఎస్యూవీని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
Honda 0 alpha ev India launch : ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా.. భారత ఆటోమొబైల్ మార్కెట్లో మళ్లీ పూర్వవైభవాన్ని అందుకోవడానికి భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. 2030 నాటికి దేశీయ మార్కెట్లోకి ఏకంగా 10 కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా, ఈ జూన్ (2026) లోనే ప్రీమియం హైబ్రిడ్ ఎస్యూవీ ‘హోండా జెడ్ఆర్-వీ’ని లాంచ్ చేయబోతోంది. అంతేకాదు ఇంకొన్ని నెలల్లో ఈ హోండా నుంచి ఇండియాలోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ లాంచ్కాబోతోంది. ఆ వివరాలను ఇక్కడ డీటైల్డ్గా తెలుసుకోండి..
హోండా జెడ్ఆర్-వీ హైబ్రిడ్ ఎస్యూవీ..
భారత్లో హోండా బ్రాండ్ నుంచి రాబోతున్న మొట్టమొదటి హైబ్రిడ్ ఎస్యూవీ ఇదే. ఈ కారును విదేశాల నుంచి నేరుగా సీబీయూ రూపంలో, పరిమిత సంఖ్యలో ఇండియాకు దిగుమతి చేయనున్నారు. ఈ మోడల్ని సంస్థ ఇప్పటికే ప్రదర్శించింది.
ధర, పోటీ: మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది ప్రీమియం విభాగంలో ఉన్న వోక్స్వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్ వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ నెల లాంచ్ ఈవెంట్ జరిగితే, అందులో ఈ మోడల్కి చెందిన ధరలను సంస్థ ప్రకటిస్తుంది.
ఇక గ్లోబల్ మార్కెట్లో ఉన్న మోడల్ తరహాలోనే, ఇండియాకు వచ్చే జెడ్ఆర్-వీ హైబ్రిడ్ ఎస్యూవీలో కూడా 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ను అందించారు. దీనికి డ్యూయల్-మోటార్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ను జత చేశారు. ఈ కాంబినేషన్ ద్వారా ఈ ఎస్యూవీ 184 బీహెచ్పీ గరిష్ట పవర్, 315 ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇందులోని ఈ-సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కారు ఫ్రంట్ వీల్స్కు పవర్ను సరఫరా చేస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 172 కిలోమీటర్లు. ఇంతటి పవర్ఫుల్ ఇంజిన్ ఉన్నప్పటికీ, ఈ కారు లీటరుకు ఏకంగా 22.79 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని హోండా స్పష్టం చేసింది.
ఇక క్యాబిన్ లోపల కస్టమర్లకు లగ్జరీ ఫీలింగ్ ఇచ్చేలా హోండా అన్ని రకాల ఆధునిక ఫీచర్లను జోడించింది.
- 10.25-ఇంచ్ పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే
- వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉన్న 9-ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
- డ్రైవర్ సీటుకు 8-వే పవర్ అడ్జస్ట్మెంట్, పక్క సీటుకు 4-వే పవర్ అడ్జస్ట్మెంట్
- అద్భుతమైన మ్యూజిక్ అనుభూతి కోసం 12-స్పీకర్ల ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్
- భద్రత కోసం 8 ఎయిర్బ్యాగ్లు, టీపీఎమ్ఎస్, లెవల్-2 అడాస్ సేఫ్టీ ఫీచర్లు.
'హోండా 0 ఆల్ఫా' ఎలక్ట్రిక్ ఎస్యూవీ..
హైబ్రిడ్ కార్లతో పాటు వేగంగా ఎదుగుతున్న ఇండియన్ ఈవీ మార్కెట్ను టార్గెట్ చేస్తూ హోండా తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'హోండా 0 ఆల్ఫా'ను 2027 లో లాంచ్ చేయనుంది.
ఈ అప్కమింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రాజెక్ట్ కోసం హోండా కార్స్ ఇండియా సుమారు రూ. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. రాజస్థాన్లోని తమ ‘టపుకరా’ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఈ ఈవీ తయారీ కేంద్రంగా మార్చనున్నారు. ఇక్కడి నుండే దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు కూడా కార్లను ఎగుమతి చేయనున్నారు.
ప్రస్తుతం ఈ 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ కారు వివిధ రకాల రోడ్లపై, విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కఠినమైన టెస్టింగ్ను జరుపుకుంటోంది. దీని బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ (మైలేజ్), ఛార్జింగ్ సమయం వంటి వివరాలను లాంచ్కు సమీపంలో కంపెనీ వెల్లడించనుంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతీ సుజుకీ ఈ-విటారా, టయోటా ఎబెల్లా వంటి రాబోయే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లతో తలపడనుంది.
ఈ మోడల్ లాంచ్, రేంజ్, ధర సహా పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


