IPL 2026 KKR Playoffs : వరుస విజయాలతో కేకేఆర్ సూపర్ కమ్బ్యాక్...! ప్లేఆఫ్స్ చేరాలంటే ఏం చేయాలి....?
IPL 2026 KKR Playoffs Scenario : ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) అనూహ్యంగా పుంజుకుంది. అజింక్య రహానే సారథ్యంలో వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్పై తాజాగా నమోదైన ఘనవిజయంతో… కేకేఆర్ ఆశలు చిగురించాయి.
IPL 2026 KKR Playoffs Scenario : ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభంలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి చూస్తే, ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉంటుందని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. ఏప్రిల్ మధ్య నాటికి ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేక పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

పంజాబ్ కింగ్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో లభించిన ఆ ఒక్క పాయింట్ మాత్రమే అప్పట్లో కేకేఆర్ ఖాతాలో ఉంది. కానీ…. క్రికెట్లో ఒక విజయం ఇచ్చే ఆత్మవిశ్వాసం జట్టు రూపురేఖలనే మారుస్తుందని కేకేఆర్ నిరూపిస్తోంది. అజింక్య రహానే నాయకత్వంలోని ఈ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయకేతనం ఎగురవేసి…. ఇప్పుడు రేసులోకి వచ్చింది.
ఢిల్లీపై ఘన విజయం….
శుక్రవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో కోల్కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. కేకేఆర్కు ఇది వరుసగా నాలుగో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఒకానొక దశలో 180 పరుగులకు పైగా స్కోరు చేసేలా కనిపించింది. అయితే….. మిడిల్ ఓవర్లలో కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్ తమ స్పిన్ మాయాజాలంతో ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనంతరం 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్కు ఓపెనర్ ఫిన్ అలెన్ ఊహించని మెరుపులు అందించాడు. అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. ఫిన్ అలెన్ తన తొలి ఐపీఎల్ సెంచరీతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేమరూన్ గ్రీన్ (అజేయంగా)తో కలిసి మూడో వికెట్కు ఏకంగా 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, మరో 34 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.
ప్లేఆఫ్స్ లెక్కలు ఇవే..
ప్రస్తుతం కేకేఆర్ 10 మ్యాచ్ల్లో 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఆరో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కంటే కేవలం ఒక పాయింట్ మాత్రమే వెనుకబడి ఉంది. గత సీజన్ల రికార్డులను గమనిస్తే…. ప్లేఆఫ్స్ చేరడానికి ఒక జట్టుకు కనీసం 16 పాయింట్లు అవసరం.
కేకేఆర్ తన మిగిలిన నాలుగు మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తే మొత్తం 17 పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు నెట్ రన్ రేట్ (NRR)తో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్లో ఓడినా… నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది.

మున్ముందు అసలు సవాల్….
కేకేఆర్ ముందున్న మార్గం అంత సులభం కాదు. రాబోయే నాలుగు మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ కేకేఆర్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ముంబై ఇండియన్స్పై కేకేఆర్కు అంతమంచి రికార్డు లేదు. ఈ సీజన్ తొలి అర్ధభాగంలో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కూడా ముంబై చేతిలో కోల్కతా ఓటమి పాలైంది.
మొత్తంగా వరుస విజయాలతో రేసులో నిలబడిన కేకేఆర్ జట్టు…. ఇదే జోరును కొనసాగించి ప్లేఆఫ్స్కు చేరుతుందో లేదా అనేది చూడాలి…! రాబోయే మ్యాచుల్లో ఓడిపోతే మాత్రం సమీకరణాలు పూర్తిగా మారిపోయి…. ఫ్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

