Family Electric MPV : హ్యుందాయ్ నుంచి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎంపీవీ- ‘నీరా’ హైలైట్స్ ఇవే..

2026 ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో హుందాయ్ తన తొలి ఎలక్ట్రిక్ ఎంపీవీ మోడల్ 'నీరా' ప్రొటోటైప్‌ను ఆవిష్కరించింది. కియా కేర్న్స్ ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై రానున్న ఈ కారు విశేషాలు ఇవే!

Published on: Jul 30, 2026, 06:45:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీ సంస్థ హుందాయ్ నుంచి బిగ్​ అప్డేట్! 2026 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (జీఐఐఏఎస్) వేదికగా 'నీరా' పేరుతో తన తొలి కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎంపీవీని ప్రపంచానికి పరిచయం చేసింది హ్యుందాయ్. ఆటో షోలో ఐయోనిక్ 3, ఐయోనిక్ 9, స్టారియా ఈవీలతో పాటు ప్రదర్శించినప్పటికీ, కుటుంబ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ నీరా ఈవీ సందర్శకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఏడాది చివర్లోనే దీని ప్రొడక్షన్ వర్షన్ రోడ్లపైకి రానుంది.

హ్యుందాయ్ నీరా ఎలక్ట్రిక్ ఎంపీవీ..
హ్యుందాయ్ నీరా ఎలక్ట్రిక్ ఎంపీవీ..

ఇండోనేషియాలోనే తయారీ!

ఈ కొత్త నీరా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎంపీవీ మోడల్‌ను ఇండోనేషియాలోనే ఉత్పత్తి చేయనున్నట్లు హుందాయ్ స్పష్టం చేసింది. స్థానికంగా లభించే బ్యాటరీలతో పాటు దాదాపు 60 శాతానికి పైగా స్వదేశీ విడిభాగాలతో దీనిని అసెంబుల్ చేయనున్నారు. సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఇది కియా కారెన్స్ క్లావిస్ ఈవీ ప్లాట్‌ఫారమ్‌ను పంచుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్, ఛార్జింగ్ సాంకేతికత రెండింటిలోనూ ఒకేలా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఎస్‌యూవీ తరహా బోల్డ్ డిజైన్..

ప్రదర్శించిన ప్రొటోటైప్ మోడల్ ప్రొడక్షన్ వర్షన్‌కు చాలా దగ్గరగా ఉంది. హ్యుందాయ్ నీరా ఎలక్ట్రిక్ ఎంపీవీ ముందు భాగంలో హుందాయ్ సిగ్నేచర్ ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్, సన్నని డేటైమ్ రన్నింగ్ లైట్లు, నిలువుగా అమర్చిన హెడ్‌లాంప్‌లు ఉన్నాయి. సాధారణ ఎంపీవీల వలే కాకుండా, ఎస్‌యూవీ లుక్ వచ్చేలా మూసి ఉన్న ఫ్రంట్ గ్రిల్, సిల్వర్ బంపర్ ఇన్సర్ట్‌లు, బలిష్టమైన రూపకల్పనను అందించారు.

కారు పక్క వైపు విస్తారమైన గ్లాస్ ఏరియా, పొడవైన రూఫ్‌లైన్ ఉండటం వల్ల కేబిన్ లోపల విశాలమైన స్థలం లభిస్తుంది. బ్లాక్ బాడీ క్లాడింగ్, సిల్వర్ రూఫ్ రైల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ దీనికి మరింత ఆకర్షణీయమైన లుక్‌ను ఇచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన హ్యాంకూక్ ఐఓన్ ఈవో ఏఎస్ టైర్లను దీనికి ఉపయోగించారు.

వెనుక భాగం, ప్రాక్టికాలిటీ..

నీరా ఈవీ కారు వెనుక భాగంలో నిలువుగా ఉండే ఎల్ఈడీ టెయిల్ లాంప్స్‌ను కలుపుతూ సన్నని లైట్ బార్ అమర్చారు. రూఫ్ స్పాయిలర్, పెద్ద వెనుక బంపర్ క్లాడింగ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రియర్ పార్కింగ్ సెన్సార్లు కూడా స్పష్టంగా కనిపిస్తుండటంతో, సేఫ్టీ, సౌకర్యవంతమైన ఫీచర్లతో ఈ కారు రానుందని అర్థమవుతోంది.

బ్యాటరీ, రేంజ్ అంచనాలు..

కియా కారెన్స్ క్లావిస్ ఈవీ ఆధారంగా వస్తుండటంతో, నీరా ఎలక్ట్రిక్ ఎంపీవీలో 42 కేడబ్ల్యూహెచ్, 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించవచ్చు.

పెద్ద బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 490 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. చిన్న బ్యాటరీ ప్యాక్ 404 కిలోమీటర్ల రేంజ్ అందించే అవకాశం ఉంది. ఇది 135 హెచ్‌పీ నుంచి 171 హెచ్‌పీ వరకు పవర్, 255 ఎన్ఎమ్ టాపిక్ ఉత్పత్తి చేయగలదు.

100 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 39 నిమిషాల్లోనే 10% నుండి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయా?

ప్రస్తుతానికి హుందాయ్ నీరా ఎలక్ట్రిక్ ఎంపీవీను కేవలం ఇండోనేషియా మార్కెట్ కోసమే అభివృద్ధి చేస్తున్నారు. ఇండియాలో లాంచ్ చేయడంపై కంపెనీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ, భారత మార్కెట్లో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతుండటం, కియా కారెన్స్ ఈవీ ప్లాట్‌ఫారమ్‌పైనే ఇది తయారవుతుండటంతో రాబోయే సంవత్సరాల్లో భారత్‌కు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేము!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More