...
...
Next Story

IISc Bangalore : ఐఐఎస్​సీ బెంగళూరులో 3 కొత్త బీటెక్​ కోర్సులు- ప్రవేశాలు ఇలా..

IISc Bangalore BTech Programmes : ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ఐఐటీలతో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్​సీ) బెంగళూరు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తోంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి మూడు సరికొత్త బీటెక్ కోర్సులను ఐఐఎస్‌సీ అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు..

Published on: Jun 28, 2026 05:59 AM IST
Advertisement

దేశంలో ఇంజనీరింగ్ అనగానే ప్రతి ఒక్కరికీ ఐఐటీలే గుర్తుకు వస్తాయి. అయితే, ఐఐటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా, పరిశోధనలకు మారుపేరైన ప్రతిష్టాత్మక 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్' (ఐఐఎస్​సీ) బెంగళూరు సైతం అత్యాధునిక బీటెక్ కోర్సులను అందిస్తోంది. సైంటిఫిక్ రీసెర్చ్, ఇంటర్‌డిసిప్లినరీ లెర్నింగ్ ప్రాతిపదికన ఇక్కడి విద్యావిధానం సాగుతుంది. ఇక ఇప్పుడు, ఈ సంస్థ విద్యార్థులను ఫ్యూచర్​ రెడీగా చేసేందుకు 3 కొత్త బీటెక్​ ప్రోగ్రామ్స్​ని ప్రవేశపెట్టింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐఐఎస్​సీ బెంళూరులో మూడు కొత్త బీటెక్ కోర్సులు ప్రారంభం..

ఐఐఎస్​సీ బెంగళూరు..
ఐఐఎస్​సీ బెంగళూరు..

గతంలో (2022-23 విద్యాసంవత్సరంలో) ఐఐఎస్‌సీ కేవలం 'మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్' కోర్సును మాత్రమే ప్రవేశపెట్టింది. అయితే, ప్రస్తుత 2026-27 విద్యాసంవత్సరం నుంచి మరో మూడు సరికొత్త అడ్వాన్స్‌డ్ బీటెక్ కోర్సులను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ కొత్త కోర్సులు ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నాయి.

అందుబాటులోకి వచ్చిన కొత్త కోర్సుల వివరాలు:

బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్

బీటెక్ ఇన్ మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్

బీటెక్ ఇన్ మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

ఈ కోర్సులన్నీ 4 ఏళ్ల కాలపరిమితి, 8 సెమిస్టర్ల పాటు సాగుతాయి. మొత్తం 128 క్రెడిట్లతో ఈ పాఠ్యప్రణాళికను రూపొందించారు.

కోర్సుల ప్రత్యేకతలు ఏంటి?

ఏరోస్పేస్ ఇంజనీరింగ్: ఇందులో ఏరోడైనమిక్స్, ప్రొపల్షన్, స్ట్రక్చర్స్, ఫ్లైట్ మెకానిక్స్, గైడెన్స్ అండ్ కంట్రోల్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎక్స్ ల్యాబ్', 'డిజైన్-బిల్డ్-ఫ్లై' క్యాప్‌స్టోన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. మూడో ఏడాది నుంచి విద్యార్థులు రీసెర్చ్ ప్రాజెక్టుల్లో పాల్గొనవచ్చు.

మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, హెల్త్‌కేర్, ఎనర్జీ, స్పేస్ రీసెర్చ్ వంటి భవిష్యత్తు రంగాలకు అవసరమైన ఇంజనీర్లను ఇక్కడ తయారు చేస్తారు. మెటల్స్, సిరామిక్స్, పాలిమర్స్, బయోమెటీరియల్స్ వంటి అంశాలపై లోతైన అవగాహన కల్పిస్తారు.

మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్: మెకానికల్ ఇంజనీరింగ్‌ను కంప్యూటేషనల్ మెథడ్స్‌తో మిళితం చేస్తూ దీన్ని డిజైన్ చేశారు. సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, డైనమిక్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఏఐ/ఎంఎల్) వంటి ఫ్యూచరిస్టిక్ సబ్జెక్టులను ఇందులో బోధిస్తారు.

ప్రవేశాల ప్రక్రియ, అర్హతలు..

ఐఐఎస్‌సీ బీటెక్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఐఐటీల్లో ప్రవేశానికి ఉండే జోసా బిజినెస్ రూల్స్ ప్రకారం అర్హత కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, జేఈఈ అడ్వాన్స్‌డ్​లో మంచి ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.

"ఈ కోర్సుల కోసం విద్యార్థులు ఐఐఎస్‌సీ పోర్టల్‌లో విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు," అని సంస్థ స్పష్టం చేసింది. పూర్తి ప్రవేశ ప్రక్రియ కేవలం జోసా కౌన్సెలింగ్ ద్వారానే జరుగుతుంది.

స్టెప్ 1: జోసా 2026 పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

స్టెప్ 2: వెబ్ ఆప్షన్లలో ఐఐఎస్​సీ బీటెక్ కోర్సులను ఎంచుకుని, లాక్ చేయాలి.

స్టెప్ 3: జోసా కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.

దేశంలోనే ప్రముఖ టెక్నాలజీ హబ్‌గా ఉన్న బెంగళూరులో ఈ సంస్థ ఉండటం వల్ల విద్యార్థులకు పరిశ్రమలతో నేరుగా అనుసంధానమయ్యే అవకాశం సైతం దక్కుతుంది. 117 ఏళ్ల సుదీర్ఘ విద్యా చరిత్ర, 40 కి పైగా రీసెర్చ్ డిపార్ట్‌మెంట్లు, 3,000 మందికి పైగా ఫ్యాకల్టీ, పరిశోధకులు ఉన్న ఈ క్యాంపస్‌లో చదవడం విద్యార్థుల కెరీర్‌కు ఎంతో ప్లస్ అవుతుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON