IIT Madras Admission 2026 : ఐఐటీ మద్రాస్​లో ఎంటెక్​ అడ్మిషన్లు మొదలు- పూర్తి వివరాలు..

IIT Madras : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ మద్రాస్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంటెక్, ఎంఏ, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 27, 2026 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Mar 31, 2026, 05:22:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశపు అగ్రశ్రేణి విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌లో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశం లభించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ప్రోగ్రాముల్లో ప్రవేశాల ప్రక్రియను ఐఐటీ మద్రాస్ ప్రారంభించింది. ఈ మేరకు ఎంటెక్, ఎంఎస్సీ, ఎంఏ కోర్సుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

ఐఐటీ మద్రాస్​లో అడ్మిషన్లు..
ఐఐటీ మద్రాస్​లో అడ్మిషన్లు..

పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఐఐటీ మద్రాస్​ అడ్మిషన్ 2026- ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం..

ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ మద్రాస్ అధికారిక వెబ్‌సైట్ iitm.ac.in సందర్శించి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఏప్రిల్ 27, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ఐఐటీ మద్రాస్​ అడ్మిషన్ 2026- అందుబాటులో ఉన్న కోర్సులు..

ఐఐటీ మద్రాస్ విభిన్న రంగాల్లో అత్యాధునిక కోర్సులను అందిస్తోంది.

ఎంటెక్: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఏఐ, ఎలక్ట్రిక్ వెహికల్స్, రోబోటిక్స్, సెమీకండక్టర్ మెటీరియల్స్ టెక్నాలజీ, ఓషన్ ఇంజనీరింగ్ వంటి కీలక విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.

ఎంఏ: ఇంగ్లీష్ స్టడీస్, డెవలప్‌మెంట్ స్టడీస్, ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ విభాగాల్లో పీజీ చేసే అవకాశం ఉంది.

ఎంఎస్సీ: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాల్లో ప్రవేశాలు పొందవచ్చు.

ఐఐటీ మద్రాస్​ అడ్మిషన్ 2026- అర్హత ప్రమాణాలు ఏంటి?

ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కింది అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు:

గేట్: 2024, 2025 లేదా 2026 సంవత్సరాల్లో గేట్ పరీక్షలో అర్హత సాధించిన వారు.

ఐఐటీ గ్రాడ్యుయేట్లు: 8.0 లేదా అంతకంటే ఎక్కువ సీజీపీఏ ఉన్న ఐఐటీ పట్టభద్రులు.

ఇతర కేటగిరీలు: గుర్తింపు పొందిన సంస్థల నుంచి స్పాన్సర్డ్ అభ్యర్థులు, డిఫెన్స్ సిబ్బంది, క్యూఐపీ అభ్యర్థులు.

ప్రవేశ పరీక్షలు: ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు జామ్ పరీక్ష ద్వారా, ఎంఏ కోర్సుల్లో ప్రవేశాలు గేట్ స్కోర్ ఆధారంగా జరుగుతాయి.

ఐఐటీ మద్రాస్​ అడ్మిషన్ 2026- సీట్ల సంఖ్య, ప్రత్యేకతలు..

ఈ ప్రవేశాల గురించి ఐఐటీ మద్రాస్ అకడమిక్ కోర్సెస్ డీన్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మాట్లాడుతూ, "ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఇంటర్ డిసిప్లినరీ అంశాలతో కలిపి మొత్తం 34 రకాల ఎంటెక్ ప్రోగ్రాములను ఐఐటీ మద్రాస్ అందిస్తోంది. ఇందులో ఇంటర్న్‌షిప్ సౌకర్యం కూడా ఉంది. ప్రస్తుతం ఎంటెక్‌లో 735 సీట్లు, ఎంఏలో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా గేట్ అర్హత సాధించిన అభ్యర్థులను మా ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్‌లోకి ఆహ్వానిస్తున్నాం," అని పేర్కొన్నారు.

అభ్యర్థులు తమకు నచ్చిన విధంగా కోర్సులను ఎంచుకునేందుకు ఇక్కడ 'ఫ్లెక్సిబుల్ క్రెడిట్ స్ట్రక్చర్' అందుబాటులో ఉంది. పరిశ్రమలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులు, అంతర్జాతీయ పరిశోధనల్లో భాగస్వామ్యం వంటి అద్భుతమైన అవకాశాలను విద్యార్థులు ఇక్కడ పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.

ఐఐటీ మద్రాస్​ అడ్మిషన్ 2026 అప్లికేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​చేయండి.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. ఐఐటీ మద్రాస్‌లో ఎంటెక్ దరఖాస్తుకు కనీస అర్హత మార్కులు ఎంత ఉండాలి?

సాధారణంగా, ఐఐటీ గ్రాడ్యుయేట్లకు 8.0 అంతకంటే ఎక్కువ సీజీపీఏ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన అభ్యర్థులు కచ్చితంగా గేట్ 2024, 2025 లేదా 2026 పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో గేట్ స్కోర్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని విభాగాలకు అదనంగా ఇంటర్వ్యూ లేదా రిటన్ టెస్ట్ కూడా ఉండవచ్చు.

2. ఎంఏ కోర్సులకు కూడా గేట్ స్కోర్ తప్పనిసరినా?

అవును, ఐఐటీ మద్రాస్ అందించే నాలుగు రకాల ఎంఏ ప్రోగ్రాములకు (ఇంగ్లీష్ స్టడీస్, డెవలప్‌మెంట్ స్టడీస్, ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ) అభ్యర్థులను గేట్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. అయితే, ప్రతీ కోర్సుకు సంబంధిత గేట్ పేపర్ కోడ్ వేర్వేరుగా ఉండవచ్చు, కాబట్టి అభ్యర్థులు తమ సబ్జెక్టుకు తగిన గేట్ పేపర్‌ను సరిచూసుకోవాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More