...
...
Next Story

Southwest Monsoon : బ్యాడ్​ న్యూస్ చెప్పిన ఐఎండీ- ఈ రెండు నెలలు వర్షాలు తక్కువే!

IMD rain alert : నైరుతి రుతుపవనాల ద్వితీయార్ధంలో (ఆగస్టు-సెప్టెంబర్) దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా శనివారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

Published on: Aug 1, 2026, 10:00:26 IST
Advertisement

దేశంలో వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు, ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక సమాచారం అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ద్వితీయార్ధంలో.. అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం విడుదల చేసిన నెలవారీ అంచనాల్లో వాతావరణ శాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ఈ రెండు నెలలు వర్షాలు తక్కువే! (PTI)
ఈ రెండు నెలలు వర్షాలు తక్కువే! (PTI)

ఈ రెండు నెలల కాలంలో దేశంలో నమోదయ్యే సగటు వర్షపాతం దీర్ఘకాలిక సగటు (ఎల్​పీఏ)లో 94 శాతం కంటే తక్కువగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇది రుతుపవనాల రెండవ భాగంలో వర్షపాత తీవ్రత తగ్గుతుందనడానికి సంకేతమని పేర్కొన్నారు.

వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, 1971 నుంచి 2020 వరకు ఉన్న 50 ఏళ్ల చారిత్రక వర్షపాత డేటా ఆధారంగా ఆగస్టు-సెప్టెంబర్ కాలానికి దేశవ్యాప్త దీర్ఘకాలిక సగటు వర్షపాతం (ఎల్​పీఏ) 422.8 ఎంఎంగా నిర్ణయించారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా సీజన్‌లో కురిసే వర్షపాతం సాధారణమా, అంతకంటే ఎక్కువ లేదా తక్కువ అని సరిపోల్చడానికి ఈ ఎల్‌పీఏ ప్రమాణాన్ని ఒక కొలమానంగా ఉపయోగిస్తారు.

తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉధృతి..

మరోవైపు శనివారం దేశంలోని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలైన బీహార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఈ ప్రాంతమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

దక్షిణ భారతంలో కేరళ, మాహే, కోస్తా కర్ణాటక, లక్షద్వీప్‌లలో వర్షాలు ఉధృతంగా ఉంటాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ, ఇంటీరియర్ కర్ణాటక వ్యాప్తంగా అక్కడక్కడా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

కోస్తా కర్ణాటక, కేరళ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడులలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 70 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఆకస్మిక వరద ముప్పు!

గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది.

పశ్చిమ మధ్యప్రదేశ్: అగర్ మాల్వా, అలీరాజ్‌పూర్, బార్వానీ, బుర్హాన్‌పూర్, దేవాస్, ధార్, ఇందోర్, ఝాబువా, ఖాండ్వా, ఖార్గోన్, మంద్‌సౌర్, నీమచ్, రత్లామ్, షాజాపూర్ జిల్లాలకు వరద ముప్పు ఉంది.

గుజరాత్ రీజియన్: దద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్, అహ్మదాబాద్, ఆనంద్, అరవల్లి, బనస్కాంత, భరూచ్, ఛోటా ఉదేపూర్, దాహోద్, డాంగ్, గాంధీనగర్, ఖేడా, మెహసానా, మహిసాగర్, నర్మద, నవసారి, పంచమహల్, పటాన్, సబర్కాంత, సూరత్, తాపీ, వడోదర, వల్సాద్ జిల్లాలను అప్రమత్తం చేశారు.

మహారాష్ట్ర, కొంకణ్ రీజియన్: కొంకణ్ పరిధిలోని పాల్ఘర్, రాయగఢ్, రత్నగిరి, థానే జిల్లాలతో పాటు మధ్య మహారాష్ట్రలోని నందుర్బార్, నాసిక్, పుణే, సతారా జిల్లాలకు ముప్పు పొంచి ఉంది.

సౌరాష్ట్ర అండ్ కచ్: భావ్‌నగర్, రాజ్‌కోట్, సురేంద్రనగర్, మోర్బీ, కచ్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe