విండీస్‌తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఇండియా-రెండో టెస్టులోనూ గ్రాండ్ విక్ట‌రీ-డ‌బ్ల్యూటీసీ టేబుల్‌లో భార‌త ప్లేస్ ఇదే!

టీమిండియా అదరగొట్టింది. సొంతగడ్డపై మరోసారి ఆధిపత్యాన్ని చాటింది. వెస్టిండీస్ ను రెండు టెస్టుల సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం (అక్టోబర్ 14) ముగిసిన రెండో టెస్టులోనూ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్ ల్లో భారత్ ఎక్కడుందో చూద్దాం. 

Published on: Oct 14, 2025, 11:31:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ లో భారత్ సత్తాచాటింది. రెండు మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం (అక్టోబర్ 14) న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముగిసిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి రోజు విజయానికి 58 పరుగులు అవసరమవగా.. ఇండియా 17.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.

టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌ (AFP)
టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌ (AFP)

రాహుల్, సుదర్శన్ కలిసి

ఓవర్ నైట్ స్కోరు 63/1 స్కోరుతో అయిదో రోజు బ్యాటింగ్ కొనసాగించింది భారత్. కేఎల్ రాహుల్ (58 నాటౌట్), సాయి సుదర్శన్ (39) రాణించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా 518/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 248 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫాలో ఆన్ లో 390 పరుగులు చేసింది. మ్యాచ్ లో మొత్తం 8 వికెట్లు తీసిన కుల్ దీప్ యాదవ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.

12 పాయింట్లు

భారత టెస్టు కెప్టెన్ గా శుభ్‌మ‌న్ గిల్‌ కు ఇదే ఫస్ట్ సిరీస్ విక్టరీ. ఈ విజయంతో ఇండియా ఖాతాలో మరో 12 పాయింట్లు చేరాయి. దీంతో భారత్ ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 7 టెస్టుల్లో 4 గెలిచిన ఇండియా, రెండు ఓడిపోయింది. ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. 61.9 పాయింట్ల శాతంతో మూడో స్థానంలో నిలిచింది.

ఆస్ట్రేలియా టాప్ ప్లేస్

ఆస్ట్రేలియా 100 పాయింట్ల శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ టీమ్ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచింది. శ్రీలంక 66.67 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రెండు టెస్టుల్లో లంక ఒకటి గెలిచి, మరొకటి ఓడిపోయింది. స్వదేశంలో 296 మ్యాచ్ ల్లో భారత్ 122వ టెస్టు విజయం సాధించింది. అంతకుముందు అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో విజయం సాధించింది.

డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్

PosTeamsMatchesWinLossDrawNRPointsPCT
1Australia3300036100.00
2Sri Lanka210101666.67
3India742105261.90
4England522102643.33
5Bangladesh20110416.67
6West Indies5050000.00
7New Zealand0000000.00
8Pakistan0000000.00
9South Africa0000000.00

డబ్ల్యూటీసీ పాయింట్లు ఇలా

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం ఒక జట్టు టెస్టు గెలిస్తే 12 పాయింట్లు ఇస్తారు. ఒక జట్టు టై అయితే ఆరు పాయింట్లు, డ్రా చేసుకుంటే నాలుగు పాయింట్లు వస్తాయి. గెలుచుకున్న పాయింట్ల శాతం ఆధారంగా అన్ని జట్లకు ర్యాంక్ ఇస్తారు.

టీమిండియా షెడ్యూల్

డబ్ల్యూటీసీలో వెస్టిండీస్ తో సిరీస్ ను ఇండియా కంప్లీట్ చేసింది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు ఆడనుంది భారత్. నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ తొలి టెస్టుకు, రెండో మ్యాచ్ నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. దక్షిణాఫ్రికా సిరీస్ తరువాత వచ్చే ఏడాది జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ ఆడుతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More