India vs Ireland : పసికూన చేతిలో క్వీన్ స్వీప్- గంభీర్​పై విపరీతంగా ట్రోల్స్..

Ind vs Ire t20 : ఐర్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు ఊహించని రీతిలో 0-2తో సిరీస్ కోల్పోవడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘోర పరాజయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను టార్గెట్ చేస్తూ ఐస్‌లాండ్ క్రికెట్ చేసిన వ్యంగ్య పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Published on: Jun 29, 2026, 09:58:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత క్రికెట్ జట్టుకు ఐర్లాండ్ పర్యటన కోలుకోలేని షాక్ ఇచ్చింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన టీ20 సిరీస్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియా 0-2తో క్లీన్‌స్వీప్ అవ్వడం అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనంగా మారింది. ఈ అవమానకర ఓటమితో భారత జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో సెటైర్లతో వార్తల్లో నిలిచే ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు, గంభీర్‌ను ఉద్దేశించి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు మరింత మంట పుట్టిస్తోంది!

టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్..
టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్..

గౌతమ్ గంభీర్‌ను తమ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకునే ఉద్దేశం మాకు అస్సలు లేదంటూ ఐస్‌లాండ్ క్రికెట్ ఎక్స్‌లో ఘాటుగా ట్వీట్ చేసింది.

"మా కోచింగ్ స్టాఫ్‌లో గౌతమ్ గంభీర్‌ను చేర్చుకోవాలనే ఆలోచన లేదని మేము స్పష్టం చేస్తున్నాము. అయితే ఆయనలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ఇలాంటి మేటి భారత ఆటగాళ్లను పెట్టుకుని, ఐర్లాండ్ గడ్డపై ఇలాంటి ఫలితాలను రాబట్టడం నిజంగా అసాధారణమైన ప్రతిభే," అంటూ ఐస్‌లాండ్ క్రికెట్ తీవ్రమైన వ్యంగ్యాన్ని జోడించింది.

ఒక రకంగా గంభీర్ కోచింగ్ సామర్థ్యాన్ని ఈ పోస్ట్ ద్వారా వారు ఎద్దేవా చేశారు. ఐస్‌లాండ్ క్రికెట్ చేసిన ట్వీట్ నవ్వు తెప్పించేలా ఉన్నా, భారత క్రికెట్ ప్రస్తుత పరిస్థితిని చూస్తే మాత్రం ఫ్యాన్స్‌కు అస్సలు నవ్వు రావడం లేదు.

ఐర్లాండ్ సృష్టించిన సరికొత్త చరిత్ర!

రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాను కట్టడి చేసింది. మొదటి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో విజయం సాధించిన ఐర్లాండ్, ఆదివారం జరిగిన రెండో టీ20లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ చేతిలో ఒక ద్వైపాక్షిక సిరీస్‌ కోల్పోవడం ఇదే తొలిసారి. అలాగే 2023 తర్వాత భారత్‌కు ఇదే మొదటి టీ20 సిరీస్ ఓటమి కావడం గమనార్హం.

యువ ఆటగాళ్లే అయినా, బలమైన జట్టుతోనే భారత్ ఈ పర్యటనకు వెళ్లింది. కానీ మైదానంలో మాత్రం ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. ముఖ్యంగా రెండో మ్యాచ్‌లో 155 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.

కుప్పకూలిన బ్యాటింగ్.. గంభీర్‌పై ప్రశ్నల వర్షం!

రెండో టీ20లో భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే దెబ్బతింది. ఐర్లాండ్ బౌలర్ జై ముంద్రా వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే సంజూ శాంసన్, అభిషేక్ శర్మ పెవిలియన్ చేరారు. ఆ వెంటనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ కావడంతో భారత్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో పోరాడినా, చివర్లో హర్షిత్ రాణా మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది.

ఈ పర్యటన కేవలం యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి, ప్రయోగాలు చేయడానికి ఉద్దేశించిందే అయినప్పటికీ, ఘోర పరాజయం పాలవ్వడం అభిమానులకు మింగుడుపడటం లేదు. సిరీస్ ఆరంభానికి ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీకి కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వస్తున్నాయి. మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా రెండో మ్యాచ్‌లో సూర్యవంశీని జట్టులోకి తీసుకోకపోవడం గంభీర్ సెలక్షన్ వ్యూహ లోపాలను ఎత్తిచూపుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More