భారత సైనికులకు కొత్త సోషల్ మీడియా రూల్స్: ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ నిషేధం

భారత సైన్యం తన సిబ్బంది కోసం కొత్త సోషల్ మీడియా పాలసీని విడుదల చేసింది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలను కేవలం సమాచారం కోసం చూడవచ్చని, కానీ స్పందించకూడదని స్పష్టం చేసింది. సైనిక క్రమశిక్షణ, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Published on: Dec 25, 2025 5:31 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత సైన్యంలో పనిచేసే అధికారులు, జవాన్లకు సోషల్ మీడియా వినియోగంపై ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం అనివార్యమైనప్పటికీ, దేశ భద్రత, క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠిన నిబంధనలను విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (DGMI) ఈ ఉత్తర్వులను తక్షణమే అమలులోకి తెచ్చింది.

భారత సైనికులకు కొత్త సోషల్ మీడియా రూల్స్: ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ నిషేధం
భారత సైనికులకు కొత్త సోషల్ మీడియా రూల్స్: ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ నిషేధం

ఏ యాప్.. ఎలా వాడాలి?

కొత్త పాలసీ ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వినియోగాన్ని సైన్యం వర్గీకరించింది.

  1. ఇన్‌స్టాగ్రామ్ (Instagram): సైనికులు ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం చూడటానికి (Viewing only) మాత్రమే ఉపయోగించాలి. పోస్టులపై ఎలాంటి కామెంట్స్ చేయకూడదు, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదు.
  2. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్: ఈ మెసేజింగ్ యాప్స్ ద్వారా కేవలం తెలిసిన వ్యక్తులతో మాత్రమే సంభాషించాలి. సాధారణ సమాచారాన్ని మాత్రమే పంచుకోవాలి. ఎవరికి మెసేజ్ పంపిస్తున్నారో ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని, రహస్య సమాచారం (Classified Info) అస్సలు పంపకూడదని ఆర్మీ హెచ్చరించింది.
  3. యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), క్వోరా: వీటిని కేవలం జ్ఞాన సముపార్జన కోసం లేదా సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే వాడాలి. సొంతంగా కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం లేదా మెసేజ్‌లను షేర్ చేయడం నిషిద్ధం.
  4. లింక్డ్‌ఇన్ (LinkedIn): కేవలం ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం, రెజ్యూమెలను అప్‌లోడ్ చేయడానికి మాత్రమే దీనిని అనుమతించారు.

జనరల్ ఉపేంద్ర ద్వివేది అభిప్రాయం

ఇటీవల జరిగిన ‘చాణక్య డిఫెన్స్ డైలాగ్’లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి యువత స్మార్ట్‌ఫోన్లకు ఎంతలా అలవాటు పడ్డారో ఆయన వివరిస్తూ..

"ఎన్‌డీఏ (NDA)లో చేరే యువకులు కూడా మొదట తమ క్యాబిన్లలో ఫోన్లు ఎక్కడ దాచుకోవాలో అని వెతుకుతూ ఉంటారు. వారికి ఫోన్ లేకుండా కూడా జీవితం ఉంటుందని నమ్మించడానికి మాకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది" అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు.

అయితే, సైనికులకు స్మార్ట్‌ఫోన్ ఒక అవసరమని కూడా ఆయన అంగీకరించారు. సరిహద్దుల్లో కుటుంబానికి దూరంగా ఉండే జవాన్లకు.. తమ పిల్లల ఫొటోలు చూడటానికి, క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫోన్ ఒక వారధిలా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రియాక్షన్ వద్దు.. రెస్పాన్స్ ముఖ్యం

సోషల్ మీడియాలో ఏదైనా విషయం చూడగానే వెంటనే స్పందించడం (React) కంటే, ఆలోచించి స్పందించడం (Respond) ముఖ్యమని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. సైనికులు ఆవేశంతో ఏదైనా పోస్ట్ చేస్తే అది శత్రువులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని, అందుకే 'వ్యూ ఓన్లీ' (View Only) పాలసీని తెచ్చామని వివరించారు. ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటే అది రిటైర్మెంట్ తర్వాతే చేయాలని ఆయన హితవు పలికారు. ఈ క్రమశిక్షణ సైన్యం యొక్క పటిష్టతను చాటిచెబుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More