Fuel crisis : భారత పెట్రోల్​ బంకులను తాకిన ఇరాన్​ యుద్ధం సెగ్​! షాకిచ్చిన చమురు సంస్థలు..

Petrol pumps fuel credit : ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరాకు ఆటంకం కలగడంతో, భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ బంకులకు ఇప్పటివరకు ఇస్తున్న ‘క్రెడిట్’ సదుపాయాన్ని నిలిపివేసి, అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని స్పష్టం చేశాయి!

Published on: Mar 17, 2026, 10:45:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ చమురు విపణిలో నెలకొన్న అనిశ్చితి భారత ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో “ముందు డబ్బు చెల్లించండి.. ఆ తర్వాతే ట్యాంకులు నింపుకోండి” అంటూ ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ (ఐఓసీఎల్​), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్​పీసీఎల్​), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్​) ఇంధన విక్రయ కేంద్రాలకు (పెట్రోల్ బంకులకు) తేల్చిచెప్పాయి!

పెట్రోల్​ పంపులను తాకిన ఇరాన్​ యుద్ధం సెగ.. (AFP)
పెట్రోల్​ పంపులను తాకిన ఇరాన్​ యుద్ధం సెగ.. (AFP)

క్రెడిట్ సదుపాయం నిలిపివేత..

ఇరాన్‌లోని 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మార్గం మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ఈ క్రమంలో ఇంధన నిల్వలను పొదుపుగా వాడటంతో పాటు ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి ఓఎంసీలు పెట్రోల్ బంకులకు ఇచ్చే క్రెడిట్ పరిమితిని నిలిపివేశాయి. హెచ్​పీసీఎల్​​, బీపీసీఎల్​ గత వారం నుంచే అడ్వాన్స్ పేమెంట్లు అడగగా, ఇండియన్ ఆయిల్ తన ఐదు రోజుల 'రివాల్వింగ్ క్రెడిట్' విధానాన్ని సోమవారం నుంచి నిలిపివేసింది.

రంగంలోకి కొత్త నిబంధనలు..

సాధారణంగా చమురు సంస్థలు డీలర్లకు మూడు రకాల వెసులుబాటు కల్పిస్తాయి:

డ్రాఫ్ట్ ఆన్ డెలివరీ: రోజంతా అమ్మిన దానికి సాయంత్రం చెల్లింపు చేయడం.

రివాల్వింగ్ క్రెడిట్: 3-5 రోజులు అప్పుగా ఇంధనం తీసుకుని, 6వ రోజున డబ్బు కట్టడం.

ఎలక్ట్రానిక్ డీలర్ ఫైనాన్స్: బ్యాంక్ గ్యారెంటీతో 15-30 రోజుల వరకు క్రెడిట్ పొందడం.

ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా మధ్య అనిశ్చితి కారణంగా ఇండియాలో ప్రస్తుతం మొదటి రెండు సదుపాయాలను నిలిపివేశారని తెలుస్తోంది. కేవలం బ్యాంక్ గ్యారెంటీ ఉన్న మూడో విధానం మాత్రమే కొనసాగుతోంది.

వ్యవసాయం, పరిశ్రమలపై ప్రభావం..

భారతదేశంలో దాదాపు 1,00,000 పెట్రోల్ బంకులు ఉండగా, వాటిలో అత్యధిక భాగం ఈ మూడు సంస్థల పరిధిలోనే ఉన్నాయి. క్రెడిట్ రద్దు కావడంతో పెట్రోల్ బంకులే కాకుండా, వాటి నుంచి అప్పుపై ఇంధనం కొనుగోలు చేసే రైతులు, పారిశ్రామికవేత్తలు, ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారులు ఇబ్బందుల్లో పడే అవకాశం లేకపోలేదు.

పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో బల్క్ కొనుగోలుదారుల వాటా ఎక్కువ కాబట్టి, అక్కడ అమ్మకాలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని డీలర్ల అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

నియంత్రణలో ప్రైవేట్ బంకులు.

మరోవైపు అంతర్జాతీయ చమురు అనిశ్చితి నేపథ్యంలో జియో-బీపీ, నాయరా ఎనర్జీ, షెల్ ఇండియా వంటి ప్రైవేట్ సంస్థలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మహారాష్ట్ర వంటి చోట్ల ప్రైవేట్ పెట్రోల్​ బంకులు మూడు షిఫ్టులకు బదులు రెండు షిఫ్టులే నడుపుతున్నాయని, రాత్రి వేళల్లో లైట్లు తగ్గించి కేవలం ఒక్క మెషీన్‌నే అందుబాటులో ఉంచుతున్నారని డీలర్లు పేర్కొంటున్నారు.

యుద్ధం తెచ్చిన ఇబ్బందులు..

ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌కు అందే ముడి చమురు సరఫరాలో దాదాపు 40% మేర కోత పడిందని తెలుస్తోంది. ప్రపంచంలోనే మూడొవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్.. 2027 నాటికి 250.8 మిలియన్ టన్నుల పెట్రో ఉత్పత్తుల డిమాండ్‌ను చేరుకోనుంది.

అయితే, ప్రస్తుతానికి దేశంలో తగినంత చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో చమురు సంస్థలు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. చమురు సంస్థలు అకస్మాత్తుగా క్రెడిట్ (అప్పు) సదుపాయాన్ని ఎందుకు రద్దు చేశాయి?

ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా వ్యవస్థ అతలాకుతలమైంది. భారత్‌కు అందే సరఫరాలో దాదాపు 40% మేర కోత పడటంతో, ఇంధన నిల్వలను నియంత్రించడమే కాకుండా.. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక రిస్క్ తీసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

2. ఈ నిర్ణయం వల్ల సాధారణ వాహనదారులపై ఏవైనా ప్రభావం ఉంటుందా?

ప్రస్తుతానికి పెట్రోల్ ధరల పెరుగుదలపై అధికారిక ప్రకటన లేకపోయినా, బంకుల్లో ఇంధన లభ్యతపై ప్రభావం ఉండవచ్చు. డీలర్లు అడ్వాన్స్ కడితేనే ఇంధనం వస్తుంది కాబట్టి, చిన్న బంకులు తక్కువ స్టాక్ ఉంచే అవకాశం ఉంది. అలాగే, ప్రైవేట్ బంకులు ఇప్పటికే రాత్రి వేళల్లో షిఫ్టులను తగ్గించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇంధనం దొరకడం కష్టం కావచ్చు.

3. పెట్రోల్ బంకుల వద్ద అప్పుగా ఇంధనం తీసుకునే రైతులు, వ్యాపారుల పరిస్థితి ఏంటి?

ఇది ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే అతిపెద్ద వర్గం. పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో వ్యవసాయం మరియు రవాణా రంగాలకు చెందిన వారు బంకుల వద్ద క్రెడిట్‌పై ఇంధనం తీసుకుంటారు. ఇప్పుడు చమురు సంస్థలే బంకులకు అప్పు ఇవ్వడం లేదు కాబట్టి, డీలర్లు కూడా బల్క్ కొనుగోలుదారులకు క్రెడిట్ ఇవ్వడం నిలిపివేయవచ్చు. దీనివల్ల రవాణా, వ్యవసాయ పనుల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More