Iran War : ట్రంప్ 48 గంటల డెడ్లైన్.. ముగింపు దిశగానా? లేక 'మహా విధ్వంసం' వైపా?
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది. ఇరాన్ తన గగనతలంలో అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేయడం, ఒక పైలట్ ఆచూకీ గాలీ లేకుండా పోవడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరాన్పై డొనాల్డ్ ట్రంప్ 48 గంటల డెడ్లైన్ విధించారు. ఆ తర్వాత ఎం జరుగుతుందో అని ఆందోళనలు మొదల్యయాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు చివరి హెచ్చరిక జారీ చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు తాను విధించిన గడువు ముగిసిపోతోందని, ఒప్పందానికి కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ డెడ్లైన్ ముగిసిన తర్వాత ఏం జరుగుతుందో అని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి.

ట్రంప్ హెచ్చరిక: "నరకం చూపిస్తాం"
యుద్ధం మొదలైనప్పటి నుంచి ట్రంప్ భిన్నమైన సంకేతాలు ఇస్తున్నారు. ఒకవైపు దౌత్యపరమైన పురోగతి గురించి మాట్లాడుతూనే, మరోవైపు ఇరాన్ను "రాతి యుగానికి" పంపిస్తామని బెదిరిస్తున్నారు. శనివారం ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ:
"ఇరాన్కు ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్ముజ్ జలసంధిని తెరవడానికి నేను 10 రోజుల సమయం ఇచ్చాను. ఆ గడువు ముగిసిపోతోంది. మరో 48 గంటల్లో వారికి నరకం చూపిస్తాము. గ్లోరీ టు ది గాడ్!" అని పేర్కొన్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ కూడా ట్రంప్ హెచ్చరికలను సమర్థిస్తూ, ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే వారంలోనే ఈ దాడులు జరిగే అవకాశం ఉంది.
ఇరాన్ మొండితనం..
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ చేస్తున్న శాంతి ప్రయత్నాలను గౌరవిస్తామని, చర్చలకు సిద్ధమని అంటూనే, ట్రంప్ డిమాండ్లకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమపై అక్రమంగా రుద్దిన యుద్ధాన్ని ముగించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
పైలట్ మిస్సింగ్.. పెరిగిన ఉద్రిక్తత!
శుక్రవారం ఇరాన్ గగనతలంలో అమెరికా ఎయిర్ ఫోర్స్కు చెందిన ఎఫ్-15ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చివేశాయి. విమానంలోని ఒక సిబ్బంది ప్రాణాలతో బయటపడగా, మరొకరు అదృశ్యమయ్యారు. ఆ పైలట్ ప్రాణాలతోనే ఉండి, ఇరాన్ భూభాగంలో ఎక్కడో తలదాచుకుని ఉండవచ్చనే వార్తలు వాషింగ్టన్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా డ్రోన్లు, హెలికాప్టర్లు పర్వత ప్రాంతాల్లో గాలిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు అదృశ్యమైన పైలట్ తల్లి తన కుమారుడి కోసం ప్రార్థించమని చేసిన భావోద్వేగపూరిత సోషల్ మీడియా పోస్ట్పై ఇరాన్ రాయబార కార్యాలయాలు వింతగా స్పందించాయి.
పాకిస్థాన్లోని ఇరాన్ ఎంబసీ స్పందిస్తూ.. "ట్రంప్ చేతిలో కంటే మీ కుమారుడు మా వద్దే క్షేమంగా ఉంటాడు. అమెరికా రెస్క్యూ టీమ్స్ కంటే ముందే ఇరాన్ అతన్ని పట్టుకోవాలని ప్రార్థించండి. ముస్లింలుగా, నాగరికత కలిగిన ఇరానీయులుగా యుద్ధ ఖైదీలను ఎలా గౌరవించాలో మాకు తెలుసు," అని రాసింది.
దక్షిణాఫ్రికాలోని ఎంబసీ కూడా ఇదే తరహాలో స్పందిస్తూ, తాము ఖైదీలను అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ (జియోనిస్టులు) లాగా క్రూరంగా చూడమని, తాము రాతి యుగంలో లేమని ఎద్దేవా చేసింది.
యుద్ధం మిగిల్చిన విషాదం..
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ సుప్రీం లీడర్ అల్ ఖమేనీని హతమార్చినప్పటి నుంచి ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,900 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు, 19 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. ఇరాన్ 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్'ను మూసివేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అమెరికాకు చెందిన మరికొన్ని విమానాలు కూడా కూలిపోయినట్లు ఆర్మీ ధృవీకరించింది.
ఈ నేపథ్యంలో వచ్చే 48 గంటల్లో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు ఎప్పుడు ముగుస్తుంది?
శనివారం ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం.. ఈ గడువు సోమవారం నాటికి ముగుస్తుంది; అప్పటిలోగా ఇరాన్ శాంతి ఒప్పందానికి రాకపోతే తీవ్ర దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు.
2. ఇరాన్ గగనతలంలో కూలిపోయిన అమెరికా ఎఫ్-15ఈ విమాన పైలట్ పరిస్థితి ఏంటి?
విమానంలోని ఇద్దరు సిబ్బందిలో ఒకరు సురక్షితంగా రక్షించబడగా, మరొక పైలట్ ప్రస్తుతం కనిపించకుండా పోయారు; అతని కోసం అమెరికా దళాలు ఇరాన్ పర్వత ప్రాంతాల్లో గాలిస్తున్నాయి.
3. హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల కలిగే పరిణామాలు ఏంటి?
ప్రపంచవ్యాప్త చమురు, సహజ వాయువు రవాణాలో ఐదో వంతు ఈ మార్గం గుండానే జరుగుతుంది, కాబట్టి ఇది మూతపడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగి ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


