IT index : ఐటీ ఇండెక్స్లో రికవరీ- దాదాపు 2శాతం జంప్! ఇప్పుడు ఏ స్టాక్స్ కొనొచ్చు?
నెల రోజుల్లో 15శాతం మేర క్రాష్ అయిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో రికవరీ కనిపిస్తోంది. మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఐటీ ఇండెక్స్తో పాటు సెక్టార్లోని అనేక స్టాక్స్ లాభాల్లో దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకరేజ్ సంస్థలు ఈ ఐటీ ప్యాక్పై తమ విశ్లేషణను అందించాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
ఇన్వెస్ట్ చేసిన వారికి పీడకలలు చూపిస్తూ ఇన్ని రోజులుగా పతనమైన ఐటీ స్టాక్స్లో ఫిబ్రవరి 17, మంగళవారం రికవరీ కనిపిస్తోంది. ఏఐ వల్ల ఐటీ కంపెనీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనల మధ్య భారీగా పడిపోయిన ఐటీ ఇండెక్స్, తాజాగా దాదాపు 2శాతం లాభాల్లో కొనసాగుతోంది. ఇక ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ వంటి షేర్లు గ్రీన్ మార్క్లోకి వచ్చాయి.

ఒక్క నిఫ్టీ ఐటీ ఇండెక్స్ నెల రోజుల్లో 15శాతం మేర క్రాష్ అయ్యింది.
స్టాక్ మార్కెట్ తాజా అప్డేట్స్..
నిఫ్టీ ఐటీ ఇండెక్స్: మంగళవారం ఉదయం సెషన్లో 2.3% మేర పెరిగింది. డిసెంబర్ 2025లో నమోదైన గరిష్ట స్థాయి (41,530) నుంచి 21% పడిపోయిన తర్వాత, తాజాగా 'ప్రాఫిట్ బుకింగ్' కారణంగా రికవరీ కనిపిస్తోంది. ఉదయం 11 గంటల సమయంలో ఐటీ ఇండెక్స్ 1.71శాతం లాభాలతో దూసుకెళుతోంది.
టాప్ గెయినర్స్: ఇన్ఫోసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ చెరో 2% లాభపడ్డాయి. విప్రో, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి షేర్లు 1-2% మధ్య పెరిగాయి.
ఐటీ రంగం ఎందుకు ఒత్తిడిలో ఉంది?
గత కొంతకాలంగా ఐటీ షేర్లు కుప్పకూలడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి:
ఏఐ భయం: ఆంథ్రోపిక్ సంస్థ ‘క్లాడ్’ చాట్బాట్ కోసం లీగల్ ఫోకస్డ్ ఏఐ టూల్ లాంచ్ చేయడంతో.. సంప్రదాయ ఐటీ సర్వీసెస్ మోడల్ దెబ్బతింటుందనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది.
వడ్డీ రేట్లు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించకపోవచ్చనే అంచనాలు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలపై ప్రభావం చూపాయి.
బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయం: ఏ షేర్ కొంటే బెటర్?
ఐటీ రంగంపై ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితిపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి:
ఐసీఐసీఐ డైరక్ట్- టీసీఎస్, ఎల్టీఐమైండ్ట్రీ, పర్సిస్టెంట్ సిస్టెమ్స్, అఫిల్ స్టాక్స్ని సూచించింది. వ్యాల్యూయేషన్లు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయని, మెల్లమెల్లగా పెట్టుబడులు పెట్టవచ్చని వివరించింది.
నోమురా- ఇన్పోసిస్, కొఫోర్జ్, ఈక్లార్క్స్ స్టాక్స్ని సూచించింది. ఐటీ కంపెనీల భవిష్యత్తు ముగిసిందన్న ఆందోళనలు అతిశయోక్తి అని, కంపెనీలు మార్పులకు అనుగుణంగా మారుతాయని ఈ బ్రోకరేజ్ సంస్థ అభిప్రాయపడింది..
సిటీ- ఇన్పోసిస్, హెచ్సీఎల్ టెక్ స్టాక్స్ని సూచించింది. ఏఐ వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వివరించింది.
నిపుణుల సలహా..
ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషణ ప్రకారం.. ఐటీ రంగం ప్రస్తుతం ఒక నిర్మాణపరమైన మార్పునకు గురి అవుతోంది. ఏఐ సామర్థ్యాలను పెంచుకుంటున్న కంపెనీలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. రిస్క్ తక్కువగా ఉండాలనుకునే వారు ఐటీ ఈటీఎఫ్ల (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) ద్వారా మదుపు చేయడం ఉత్తమం.

E-Paper












