JEE Advanced 2026 : జేఈఈ అడ్వాన్స్డ్ జరిగేది ఆరోజే- పరీక్ష ఫార్మాట్లో కీలక మార్పులు?
JEE Advanced 2026 : 'జేఈఈ అడ్వాన్స్డ్ - 2026' షెడ్యూల్ విడుదలైంది. మే 17 2026న ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అయితే ఈసారి పరీక్ష సరళిలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది!
భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఖరారైంది. మే 17, 2026 (ఆదివారం) న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు ఐఐటీ రూర్కీ ప్రకటించింది. పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) మోడ్లో నిర్వహించనున్నారు.
కొత్త ప్రయోగం: ఆప్టిట్యూడ్ ఆధారిత ప్రశ్నలతో పరీక్షా సరళిలో మార్పు?
ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఒక సరికొత్త మార్పు చోటుచేసుకోనున్నట్లు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్థుల్లో కేవలం ‘బట్టీ పట్టే’ విధానాన్ని కాకుండా, వారిలోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని, లోతైన అవగాహనను పరీక్షించేలా ఐఐటీ కాన్పూర్ ఒక కొత్త 'ఆప్టిట్యూడ్ ఆధారిత' ప్రశ్నల సెట్ను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఐఐటీ రూర్కీ ఆమోదం కోరినట్లు తెలుస్తోంది. ఐఐటీ కౌన్సిల్, జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) చర్చించిన ఈ 'అడాప్టివ్ టెస్టింగ్ ఫార్మాట్' ద్వారా భవిష్యత్తులో ఐఐటీ ప్రవేశ పరీక్షల స్వరూపమే మారే అవకాశం ఉంది.
జేఈఈ అడ్వాన్స్డ్2026- పరీక్ష షెడ్యూల్, విధానం..
జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో అభ్యర్థులు పేపర్-1, పేపర్-2.. రెండింటికీ హాజరుకావడం తప్పనిసరి. ప్రతి పేపర్ మూడు గంటల పాటు ఉంటుంది.
తేదీ: మే 17, 2026 (ఆదివారం)
పేపర్ 1: ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు
పేపర్ 2: మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు
విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)
జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా లభించే కోర్సులు..
ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు ఐఐటీలు, ఐఐఎస్సీ బెంగళూరులో కింది కోర్సుల్లో చేరవచ్చు:
4 ఏళ్ల కోర్సులు: బీ.టెక్, బీ.ఎస్
5 ఏళ్ల కోర్సులు: బీ.ఆర్క్
డ్యూయెల్ డిగ్రీలు: బీ.టెక్–ఎం.టెక్, బీ.ఎస్–ఎం.ఎస్, బీ.టెక్–ఎంబీఏ, బీ.ఎస్–ఎంబీఏ
ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్: ఎం.టెక్, బీ.ఎస్–ఎం.ఎస్
జేఈఈ అడ్వాన్స్డ్ 2026- అర్హత ప్రమాణాలు..
అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ 2026 రాయాలంటే కింది నిబంధనలు పాటించాలి:
జేఈఈ మెయిన్స్: జేఈఈ మెయిన్స్ 2026 (బీ.ఈ./ బీ.టెక్)లో టాప్ 2,50,000 అభ్యర్థుల్లో ఉండాలి.
వయస్సు: అక్టోబర్ 1, 2001న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది).
అటెంప్ట్స్: వరుసగా రెండేళ్లలో గరిష్టంగా రెండుసార్లు మాత్రమే పరీక్ష రాయవచ్చు.
విద్యార్హత: 2025 లేదా 2026లో మొదటిసారి 12వ తరగతి పరీక్షకు హాజరై ఉండాలి.
గతంలో ఐఐటీలో సీటు పొంది ఉండకూడదు.
అడ్మిషన్ కోసం కనీస మార్కులు..
పరీక్షలో క్వాలిఫై అయిన తర్వాత, ఐఐటీలో సీటు పొందాలంటే కింది వాటిలో ఏదో ఒక అర్హత ఉండాలి:
ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షల్లో కనీసం 75% మార్కులు సాధించాలి (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 65% మార్కులు).
లేదా, ఆయా బోర్డులో టాప్ 20 పర్సంటైల్ లో ఉండాలి. సీట్ల కేటాయింపు 'జోసా' కౌన్సెలింగ్ ద్వారా జరుగుతుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ 2026- రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు..
మహిళా అభ్యర్థులు (అన్ని కేటగిరీలు): రూ. 1600
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు: రూ. 1600
ఇతరులందరికీ: రూ. 3200
విదేశీ అభ్యర్థులు: సార్క్ దేశాల వారికి 100 డాలర్లు, నాన్-సార్క్ దేశాల వారికి 200 డాలర్లు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


