Electric car : ఎంజీ మోటార్ నుంచి కొత్త ఈవీ- మహీంద్రాకు పోటీగా! త్వరలోనే లాంచ్..
MG Eksion Electric SUV India Launch : జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన సరికొత్త 'ADAPT' ఈవీ/హైబ్రిడ్ ప్లాట్ఫారమ్ను ఆవిష్కరించింది. దీని ఆధారంగా వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చే నెలలోనే విడుదల కానుంది. ఇది మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్తో నేరుగా తలపడనుంది. పూర్తి వివరాలు..
భారత ఈవీ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. కంపెనీ తన సరికొత్త 'ADAPT' ఈవీ/హైబ్రిడ్ ప్లాట్ఫారమ్ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ప్లాట్ఫారమ్పై రూపొందుతున్న మొదటి మోడల్.. వచ్చే నెలలోనే భారత మార్కెట్లో విక్రయానికి రానుందని కంపెనీ వర్గాలు ధృవీకరించాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్కు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇండోనేషియా మార్కెట్లో విక్రయించే 'వులింగ్ ఎక్సియాన్' మోడల్ను ఆధారంగా చేసుకుని ఈ కొత్త ఈవీని రూపొందించారు. వులింగ్, ఎంజీ మోటార్స్ రెండూ కూడా ఒకే మాతృ సంస్థ అయిన 'ఎస్ఏఐసీ' గ్రూప్ పరిధిలోకి వస్తాయి. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీని మార్కెట్లో అత్యంత పోటీ ధరకే అందించాలని జేఎస్డబ్ల్యూ ఎంజీ భావిస్తోంది. ప్రస్తుతం రూ. 25.8 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ఉన్న మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ 70kWh వేరియంట్ కంటే తక్కువ ధరలోనే ఎంజీ కొత్త ఈవీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
బ్యాటరీ సామర్థ్యం, రేంజ్..
ఈ కొత్త జేఎస్డబ్ల్యూ ఎంజీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 69kWh బ్యాటరీ ప్యాక్తో రానుంది. ఇది సింగిల్ ఛార్జ్పై దాదాపు 600 కిలోమీటర్ల అధికారిక రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ మోడల్ 59kWh (521 కిమీ రేంజ్), 70kWh (600 కిమీ రేంజ్), 79kWh (679 కిమీ రేంజ్) అనే మూడు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 70kWh మోడల్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు అదే రేంజ్తో తక్కువ ధరకు ఎంజీ బైక్ను తీసుకురావడం ద్వారా మహీంద్రా కస్టమర్లను తనవైపు తిప్పుకోవాలని జేఎస్డబ్ల్యూ ఎంజీ ప్లాన్ చేస్తోంది.
సామర్థ్యం పరంగా చూస్తే, ఎక్సియాన్ సింగిల్ మోటార్ 201హెచ్పీ పవర్, 310ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ (245హెచ్పీ పవర్, 380ఎన్ఎం టార్క్) కంటే కొంచెం తక్కువ. అలాగే ఎక్సియాన్ ఫ్రంట్-మోటార్, ఫ్రంట్-వీల్-డ్రైవ్ లేఅవుట్ను కలిగి ఉంటే, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ రియర్-మోటార్, రియర్-వీల్-డ్రైవ్ ఆప్షన్తో వస్తుంది.
డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లు..
కొలతల పరంగా ఈ రెండు ఎస్యూవీలు దాదాపు ఒకే పరిమాణంలో ఉన్నాయి. వులింగ్ ఎక్సియాన్ 4.7 మీటర్ల పొడవు, 1.85 మీటర్ల వెడల్పు, 1.7 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ కూడా 4.7 మీటర్ల పొడవు, 1.9 మీటర్ల వెడల్పు, 1.7 మీటర్ల ఎత్తును కలిగి ఉంది. పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉండేలా ఈ కొత్త మోడల్ను 7-సీటర్ కాన్ఫిగరేషన్తో తీసుకువస్తున్నారు.
లుక్స్ పరంగా ఈ ఈవీ బాక్సీ డిజైన్, నిటారైన టెయిల్ ల్యాంప్లతో ఆకట్టుకుంటుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యాష్బోర్డ్ మధ్యలో 12.8 ఇంచుల భారీ టచ్స్క్రీన్ హైలైట్గా నిలుస్తుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్రూఫ్, పవర్డ్ టెయిల్గేట్ వంటి ప్రీమియం ఫీచర్లు భారతీయ మోడల్లో ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓకి పోటీగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్!
జేఎస్డబ్ల్యూ ఎంజీ తన జోరును ఇక్కడితో ఆపడం లేదు. వచ్చే ఏడాది ఇదే ఎస్యూవీలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ వెర్షన్ను కూడా లాంచ్ చేయనుంది. దీని డిజైన్ ఈవీ మోడల్ను పోలి ఉన్నప్పటికీ, కొన్ని స్టైలింగ్ మార్పులు ఉంటాయి.
ఈ ప్లాట్ఫారమ్ నుంచి రాబోయే రెండవ మోడల్ అయిన ఈ పీహెచ్ఈవీ (PHEV) లో 1.5 లీటర్ అట్కిన్సన్-సైకిల్ పెట్రోల్ ఇంజన్ (105హెచ్పీ/130ఎన్ఎం)స 20.5kWh ఎల్ఎఫ్పీ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్ (195hp/230Nm) ఉంటాయి. ఇది కేవలం ఎలక్ట్రిక్ మోడ్లోనే 125 కిమీ రేంజ్ ఇస్తుండగా, పెట్రోల్ + బ్యాటరీ కలిపి మొత్తం 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని వులింగ్ కంపెనీ క్లెయిమ్ చేసింది.
ఈవీల లాగా తక్కువ ఖర్చు, పెట్రోల్ కార్ల లాగా లాంగ్ డ్రైవ్ వెళ్లే స్వేచ్ఛ.. ఈ రెండూ కలిపి ఇచ్చే ఈ హైబ్రిడ్ మోడల్ భారతీయ కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్గా మారుతుందని కంపెనీ నమ్ముతోంది. ముఖ్యంగా మార్కెట్లో ఉన్న పెద్ద డీజిల్-ఆటోమేటిక్ ఎస్యూవీలను టార్గెట్ చేస్తూ, మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ డీజిల్-ఏటీ ధర కంటే కేవలం రూ. 1.5 లక్షల వ్యత్యాసంలోనే దీని ధరను ఉంచాలని జేఎస్డబ్ల్యూ ఎంజీ యోచిస్తోంది.
ఈవీ, హైబ్రిడ్ మోడళ్లపైనే ఫోకస్..
ఈ కొత్త ADAPT ప్లాట్ఫారమ్ బ్యాటరీ-ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, రేంజ్-ఎక్స్టెండర్, స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్లకు సపోర్ట్ చేస్తుంది. అయినప్పటికీ, ప్రారంభంలో జేఎస్డబ్ల్యూ ఎంజీ కేవలం ఈవీ, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడళ్లపైనే ఎక్కువ దృష్టి పెట్టనుంది.
"భారతీయ మార్కెట్లో అన్ని రకాల ఇంజన్లకు చోటుంది, కానీ భవిష్యత్తులో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలదే సింహభాగం అవుతుంది. ఆ తర్వాత స్థానాల్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్లు ఉంటాయి. రేంజ్ ఎక్స్టెండర్ ఈవీలు అనేది చాలా కొత్త టెక్నాలజీ కాబట్టి ప్రస్తుతం దాని మార్కెట్ చిన్నగానే ఉంటుంది," అని జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా వివరించారు.
భారతదేశంలో ఎలక్ట్రిఫికేషన్ ప్రయాణానికి ఒకే ఒక్క ఇంజన్ విధానం సరిపోదని, వినియోగదారులకు వేగవంతమైన ఛార్జింగ్, ఎక్కువ రేంజ్, మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని ఒకే ప్లాట్ఫారమ్ ద్వారా అందించడమే తమ లక్ష్యమని మెహ్రోత్రా స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


