కర్ణాటకలో ఘోర ప్రమాదం- స్లీపర్​ బస్సుకు మంటలు.. 13 మంది సజీవదహనం

కర్ణాటక హిరియూర్​కు సమీపంలో ఒక స్లీపర్​ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఓ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చెలరేగింది. ఈ ఘటనలో 13 మంది సజీవదహనం అయ్యారు.

Published on: Dec 25, 2025, 06:43:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్ణాటకలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చిత్రదుర్గం​ హిరియూర్​ సమీపంలోని జాతీయ రహదారిపై ఒక స్లీపర్​ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది సజీవహదం అయినట్టు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న అనేక మంది గాయపడ్డారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ఘటనాస్థలంలో ఎగిసిపడుతున్న మంటలు..
ఘటనాస్థలంలో ఎగిసిపడుతున్న మంటలు..

కర్ణాటకలో బస్సు ప్రమాదం- అసలేం జరిగింది?

చిత్రదుర్గ జిల్లా హిరియూర్​ తాలుకాలోని హోర్లథు క్రాసింగ్​ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హియూరు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి డీవైడర్​ని దాటింది. ఆ వెంటనే, అటుగా వస్తున్న ప్రైవేట్​ బస్సును బలంగా ఢీకొట్టింది. సరిగ్గా డీజిల్​ ట్యాంక్​ని లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో మొత్తం బస్సుకు మంటలు వ్యాపించాయి.

ప్రమాదం సమయంలో ఈ ప్రైవేట్​ బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గవైపు వెళుతోంది.

ప్రమాదం సమయంలో బస్సులో 30కిపైగా మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో చాలా మంది నిద్రపోతూ ఉండటంతో బస్సుకు మంటలు అంటుకున్నట్టు వెంటనే తెలియలేదు. ఫలితంగా అనేక మంది సజీవదహనం అయ్యారు.

మంటలు చెలరేగుతున్నట్టు అర్థంచేసుకున్న కొందరు మాత్రమే బస్సు నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. వీరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కర్ణాటక బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీశారు. 9మంది క్షతగాత్రులను సిరా ఆసుపత్రికి తరలించారు. హిరియూరులోని ఆసుపత్రిలో ఇంకొందరికి చికిత్స జరుగుతోంది.

“లారీ డ్రైవర్​ నిర్లక్షం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తు బట్టి తెలుస్తోంది. బలంగా ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. సహాయక చర్యలు మరింత కష్టంగా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేశాము. బస్సు ప్రమాదంపై దర్యాప్తు చేపడతాము. అసలేం జరిగింది? అన్నది క్లారిటీగా తెలుస్తుంది. ఆడిట్​ నిర్వహించిన తర్వాతే మరణాల సంఖ్యపై స్పష్టత వస్తుంది,” అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్​ జామ్​ సంభవించింది. ప్రస్తుతం శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగుతోంది.

మంటల్లో తగలబడుతున్న బస్సు దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి:

తాజా ప్రమాదంతో ప్రైవేట్​ బస్సుల్లో ప్రయాణికుల భద్రతపై ఆందోళన మరింత పెరిగింది.

అక్టోబర్​ నెలలో హైదరాబాద్​- బెంగళూరు హైవేపై ఓ ప్రైవేట్​ బస్సు అగ్నికి ఆహుతైంది. కర్నూల్​ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. ఈ ఘటనలో 20కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన కూడా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలోనే జరిగింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More