ఒక్క దెబ్బకు అమెజాన్, బిగ్బాస్కెట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఔట్- ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..
Karnataka : ఆన్లైన్లో విషపూరిత ఉమ్మత్త (ధతుర) కాయలు, విత్తనాలు విక్రహిస్తున్నట్లు తేలడంతో కర్ణాటక ప్రభుత్వం అమెజాన్, స్విగ్గీ, బిగ్బాస్కెట్ల ఫుడ్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. వాటిని వెంటనే తొలగించాలని తేల్చిచెప్పింది.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్ల ఫుడ్ లైసెన్స్ను కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది! విషపూరితమైన ఉమ్మత్త (ధతుర) పండ్లు, గింజలను ఆన్లైన్ వేదికల ద్వారా ఆహార పదార్థాలుగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించడం ఇందుకు కారణం. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందనే తీవ్ర ఆందోళనల నేపథ్యంలో, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ మూడు సంస్థల ఫుడ్ లైసెన్సులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ప్లాట్ఫారమ్లకు ధతుర ఉత్పత్తులను సరఫరా చేస్తున్న వ్యాపారులు, సంస్థల లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను కూడా తక్షణమే నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఆహారం లేదా మానవ వినియోగం కోసం ఉమ్మత్తకు సంబంధించిన అన్ని ప్రకటనలు, ప్రమోషనల్ మెటీరియల్స్, ఆన్లైన్ లిస్టింగ్లను వెంటనే తొలగించాలని సంబంధిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను ఆదేశించినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ప్రజారోగ్య భద్రతకే అత్యంత ప్రాధాన్యత..
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006, దాని నిబంధనల ప్రకారం ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది.
"ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 నిబంధనలకు అనుగుణంగా, అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్ అనే ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లకు జారీ చేసిన ఆహార లైసెన్సులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాము. తక్షణమే నివేదిక సమర్పించాలని కోరాము," అని ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన ప్రకటనలో పేర్కొంది.
ఆంగ్లంలో 'థార్న్ యాపిల్' అని పిలిచే ఈ మొక్కను తమిళంలో 'ఉమతాయి' అంటారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు లేదా రిజిస్ట్రేషన్ల కింద కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో ఉమ్మత్త పండ్లు, గింజలు విక్రయానికి ఉంచినట్లు గుర్తించిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
వెంటనే తొలగించాలని ఆదేశాలు..
ధతుర మొక్కలో తీవ్రమైన విషపూరిత గుణాలు ఉంటాయని, దీని పండ్లు లేదా గింజలను తింటే మానవ ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. మానవ వినియోగం కోసం ఈ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడం, ప్రదర్శించడం, ప్రచారం చేయడం వంటివి ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉమ్మత్త పండ్లు, గింజలకు సంబంధించిన అన్ని ఆన్లైన్ లిస్టింగ్లు, ప్రకటనలు, ప్రచార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను ఆదేశించారు. భవిష్యత్తులో మానవ వినియోగం కోసం వీటిని విక్రయించడం లేదా పంపిణీ చేయడాన్ని కఠినంగా నిషేధించారు.
"ఆన్లైన్ సంస్థలకు పైన పేర్కొన్న ఉత్పత్తులను సరఫరా చేస్తున్న సంస్థలు, విక్రేతల లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తక్షణమే సస్పెండ్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర/కేంద్ర నామినేటెడ్ ఆఫీసర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను ఆదేశించాము," అని శాఖ పేర్కొంది.
ప్రజారోగ్యం, ఆహార భద్రత దృష్ట్యా ఈ ఆదేశాలను కఠినంగా, తక్షణమే పాటించాలని సంబంధిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను ప్రభుత్వం ఆదేశించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


