...
...
Next Story

Best electric car : కియా సైరోస్ ఈవీ వర్సెస్ టాటా పంచ్​ ఈవీ- ఏది బెస్ట్?

Kia Syros EV vs Tata Punch EV : భారత ఈవీ మార్కెట్లో సబ్-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల హవా పెరుగుతోంది. ఈ విభాగంలో కియా సంస్థ తన సరికొత్త, చౌకైన 'సైరోస్ ఈవీ'ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే మార్కెట్లో రారాజుగా ఉన్న టాటా పంచ్ ఈవీతో కియా సైరోస్ ఈవీ ఎలా పోటీ పడుతుందో ఇప్పుడు చూద్దాము..

Published on: Jul 18, 2026 05:39 AM IST
Advertisement

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో అన్ని విభాగాల్లో ఈవీలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి పరిమాణం, ఆకర్షణీయమైన ధరల కారణంగా చిన్న ఎలక్ట్రిక్ కార్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా.. భారత మార్కెట్లోకి తన అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు ‘సైరోస్ ఈవీ’ని ఇటీవలే విడుదల చేసింది.

కియా సైరోస్​ ఈవీ వర్సెస్​ టాటా పంచ్​ ఈవీ..
కియా సైరోస్​ ఈవీ వర్సెస్​ టాటా పంచ్​ ఈవీ..

సబ్-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలోకి అడుగుపెడుతున్న కియా సైరోస్ ఈవీకి మార్కెట్లో గట్టి పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ వంటి మోడళ్లు దీనికి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. అయితే, ప్రస్తుతానికి మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టాటా పంచ్ ఈవీతో పోలిస్తే ఈ సరికొత్త కియా సైరోస్ ఈవీ ఏ మేరకు రాణిస్తుందో బ్యాటరీ, ఫీచర్లు, సేఫ్టీ, ధరల పరంగా క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

కియా సైరోస్ ఈవీ వర్సెస్​ టాటా పంచ్ ఈవీ- పర్ఫార్మెన్స్..

కియా సైరోస్ ఈవీలో కంపెనీ రెండు లిక్విడ్-కూల్డ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించింది. ఇందులో మొదటిది 42 kWh బ్యాటరీ ప్యాక్ కాగా, ఇది ఫ్రంట్ యాక్సిల్‌పై ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌కు పవర్ అందిస్తుంది. ఇది 132.76 బీహెచ్​పీ శక్తిని, 255 ఎన్​ఎం టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవదైన పెద్ద 51.4 kWh బ్యాటరీ ప్యాక్ కూడా ఫ్రంట్ యాక్సిల్ మోటార్‌తోనే వస్తుంది. ఇది ఏకంగా 168.9 బీహెచ్​పీ పవర్, 255 ఎన్​ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. పెద్ద ప్యాక్ 526 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది.

కియా సైరోస్ ఈవీలో అత్యాధునిక ప్రీమియం ఫీచర్లను అమర్చారు. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-ఇంచుల టచ్‌స్క్రీన్ డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ముందు- వెనుక వైపు వెెంటిలేటెడ్ సీట్లు, 12.3-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. వీటితో పాటు డైనమిక్ అసిస్టెన్స్‌తో కూడిన రియర్-వ్యూ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, వెనుక వైపు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, రియర్ డీఫాగర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, షిఫ్ట్-బై-వైర్ టెక్నాలజీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

దీనికి పోటీగా టాటా పంచ్ ఈవీలో కూడా ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 10.24-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌బిల్ట్ నావిగేషన్‌తో కూడిన 10-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వాయిస్ కమాండ్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, టచ్ ఆధారిత హెచ్​వీఏసీ (ఏసీ) కంట్రోల్స్ ఉన్నాయి.

కియా సైరోస్ ఈవీ వర్సెస్​ టాటా పంచ్ ఈవీ- సేఫ్టీ..

భద్రత విషయానికి వస్తే కియా సైరోస్ ఈవీ ఒక అడుగు ముందే ఉంది. ఇందులో 16 అటానమస్ ఫీచర్లు ఉన్న లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) అందించారు. దీంతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌లను ఇచ్చారు.

టాటా పంచ్ ఈవీలో అడాస్ ఫీచర్ లేదు. కానీ భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్​పీ, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), హిల్ హోల్డ్ అసిస్ట్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి నమ్మకమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

కియా సైరోస్ ఈవీ వర్సెస్​ టాటా పంచ్ ఈవీ- ధరలు..

మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాటా పంచ్ ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.69 లక్షలుగా ఉంది. దీని టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 12.59 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు వెళ్తుంది. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ (బీఏఏఎస్) ప్రోగ్రామ్ కింద కొనుగోలు చేస్తే పంచ్ ఈవీ ప్రారంభ ధర రూ. 6.49 లక్షలకే లభిస్తుంది, అయితే కిలోమీటరుకు రూ. 2.6 చొప్పున బ్యాటరీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

ఇక కియా సైరోస్ ఈవీ విషయానికి వస్తే, కంపెనీ అధికారికంగా ధరలను ఇంకా వెల్లడించలేదు. అయితే మార్కెట్ అంచనాల ప్రకారం దీని ప్రారంభ ధర సుమారు రూ. 15 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe