Today chandra grahan time : నేడే ‘చంద్రగ్రహణం’.. ఎప్పుడు? ఎలా చూడాలి? పూర్తి వివరాలు..

Today grahan timing : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. కానీ ఇండియాలో మాత్రం ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఈ గ్రహణాన్ని ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడాలి? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Mar 3, 2026, 06:30:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఖగోళ ప్రియులకు ఈ మార్చి 3వ తేదీ (నేడు) ఒక ప్రత్యేకమైన రోజు. 2026 సంవత్సరంలో సంభవించబోయే మొట్టమొదటి సంపూర్ణ చంద్రగ్రహణం నేడు ఆకాశంలో కనువిందు చేయనుంది. అయితే ఇండియాలో మాత్రం ఇది పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే. ఆకాశం నిర్మలంగా ఉంటే భారత దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించే అవకాశం ఉంది.

నేడే ‘చంద్రగ్రహణం’.. (X/ANI)
నేడే ‘చంద్రగ్రహణం’.. (X/ANI)

సూర్యుడు, చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు.. భూమి నీడ చంద్రుడిపై పడటాన్ని చంద్రగ్రహణం అంటారు. ఈ క్రమంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మేసినప్పుడు అది ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. దీనినే ఖగోళ శాస్త్ర భాషలో ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు.

భారత్‌లో గ్రహణ సమయాలు..

'టైమ్ అండ్ డేట్' అందించిన సమాచారం ప్రకారం, గ్రహణానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు ఈ కింది సమయాల్లో జరగనున్నాయి:

పెనంబ్రల్ (పాక్షిక ఛాయ) ప్రారంభం: సాయంత్రం 4:58 గంటలకు

సంపూర్ణ గ్రహణం ప్రారంభం: సాయంత్రం 4:58 గంటలకు

సంపూర్ణ గ్రహణం ముగింపు: సాయంత్రం 5:32 గంటలకు

పెనంబ్రల్ దశ ముగింపు: రాత్రి 7:53 గంటలకు

భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో చంద్రోదయం అయ్యే సమయానికే గ్రహణం అప్పటికే ప్రారంభమై ఉంటుంది. దీనివల్ల మన దేశంలోని వీక్షకులు గ్రహణ చివరి దశలను మాత్రమే చూసే అవకాశం ఉంది. అందుకే ఇది మనకి పాక్షిక చంద్రగ్రహణం. సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు ఉదయించేటప్పుడు సాధారణం కంటే తక్కువ కాంతితో లేదా స్వల్ప ఎరుపు రంగులో కనిపిస్తాడు. కొన్ని నగరాల్లో ఈ దృశ్యం కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తుంది.

ఈ నగరాల్లో స్పష్టంగా..

భారతదేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో పాక్షికంగానే కనిపించినప్పటికీ, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం సంపూర్ణ గ్రహణాన్ని సైతం స్పష్టంగా చూసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

అసోం: దిబ్రూఘర్, దిస్పూర్, గువహటి

అరుణాచల్ ప్రదేశ్: ఇటానగర్

మేఘాలయ: షిల్లాంగ్

ఈ నగరాల్లో సాయంత్రం 5:10 నుంచి 5:25 గంటల మధ్య గ్రహణం గరిష్ట స్థాయిలో కనిపిస్తుంది.

హైదరాబాద్​లో ఎప్పుడు చూడవచ్చు?

హైదరాబాద్​లో సాయంత్రం 06:26 గంటల నుంచి సాయంత్రం 06:46 గంటల వరకు (మొత్తం 20 నిమిషాలు) చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు.

ఎలా చూడాలి?

చంద్రగ్రహణాన్ని చూడటానికి ఎటువంటి ప్రత్యేక రక్షణ అద్దాలు అవసరం లేదు. ఇది పూర్తిగా సురక్షితం.

సూర్యాస్తమయ సమయంలో బయటకు వచ్చి తూర్పు ఆకాశం వైపు చూడవచ్చు.

ఎత్తైన భవనాలు లేదా చెట్లు లేని ఖాళీ ప్రదేశాన్ని ఎంచుకుంటే వీక్షణ బాగుంటుంది.

బైనాక్యులర్లు ఉంటే అనుభవం ఇంకా బాగుంటుంది!, కానీ నేరుగా కళ్లతో చూసినా ఈ అద్భుతాన్ని ఆస్వాదించవచ్చు.

అంతర్జాతీయంగా వీక్షణ..

ఈ బ్లడ్ మూన్‌ను ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆసియా, ఓషియానియా ఖండాల్లో సుమారు 330 కోట్ల మంది వీక్షించనున్నారు. న్యూజిలాండ్‌లో రాత్రి 10:50 గంటలకు ఆకాశం మధ్యలో చంద్రుడు ఉన్నప్పుడు అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది.

ఎందుకు ఈ గ్రహణం ప్రత్యేకం?

రాబోయే ఆరు చంద్రగ్రహణాల్లో చంద్రుడు భూమి నీడలోకి పూర్తిగా వెళ్లడు. కేవలం భూమి వెలుపలి నీడ (Penumbra) లోకి మాత్రమే వెళతాడు. ముఖ్యంగా 2027లో రాబోయే మూడు గ్రహణాల సమయంలో చంద్రుడి కాంతి కేవలం స్వల్పంగా మాత్రమే తగ్గుతుంది. కాబట్టి, సంపూర్ణంగా 'బ్లడ్ మూన్'ను చూసే అవకాశం మళ్లీ ఇప్పుడప్పుడే రాదు.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. ఈ గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేకమైన సోలార్ ఫిల్టర్లు లేదా కళ్లద్దాలు అవసరమా?

అవసరం లేదు. సూర్య గ్రహణాన్ని చూసినప్పుడు కళ్లకు రక్షణ అవసరం కానీ, చంద్ర గ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడటం పూర్తిగా సురక్షితం. దీనివల్ల కళ్లకు ఎలాంటి హాని కలగదు. చంద్రుడి కాంతి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, మీరు బైనాక్యులర్లు లేదా టెలిస్కోపులను ఉపయోగించి కూడా ఎటువంటి భయం లేకుండా ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చు.

2. చంద్రుడు ఎరుపు రంగులోకి (బ్లడ్ మూన్) ఎందుకు మారుతాడు?

సంపూర్ణ చంద్ర గ్రహణ సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మేస్తుంది. అయితే, భూమి వాతావరణం గుండా వెళ్లే సూర్యకాంతి వక్రీభవనం చెంది (Refraction) చంద్రుడిపై పడుతుంది. ఈ క్రమంలో నీలం, ఆకుపచ్చ రంగులు వాతావరణంలో కలిసిపోగా, ఎరుపు రంగు మాత్రమే చంద్రుడి ఉపరితలంపైకి చేరుతుంది. అందుకే ఆ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More