Mahindra SUVs : మహీంద్రా నుంచి 2 కొత్త మోడల్స్- విజన్ ఎస్, బీఈ 07పై అంచనాలు పీక్స్!
భారత మార్కెట్లోకి మహీంద్రా నుంచి రెండు కొత్త ఎస్యూవీలు రాబోతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ అప్కమింగ్ వాహనాల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇవి బేబీ స్కార్పియోగా పిలుస్తున్న విజన్ ఎస్తో పాటు ఎలక్ట్రిక్ కారు బీఈ 7 మోడళ్లు అవ్వొచ్చు. వీటిపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త వాహనాలను తీసుకురావడంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ దేశీయ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' మరోసారి సంచలనానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్లో స్కార్పియో ఎన్ ఫేస్లిఫ్ట్ హవా నడుస్తుండగా, ఇప్పుడు ఆ కంపెనీ మరింత ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా రెండు సరికొత్త ఎస్యూవీలను పరిచయం చేసేందుకు రంగం సిద్ధమైంది. వాటిలో ఒకటి కాంపాక్ట్ ఎస్యూవీ కాగా, మరొకటి సరికొత్త ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుతం రోడ్లపై రకరకాల టెస్టింగ్ దశల్లో ఉన్న ఈ రెండు మోడళ్లపై ఆటోమొబైల్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా విజన్ ఎస్ ఎస్యూవీ - సరికొత్త 'బేబీ స్కార్పియో'
టెస్టింగ్ దశ చివరి అంకానికి చేరుకున్న మహీంద్రా విజన్ ఎస్ మోడల్ ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. స్కార్పియో-ఎన్ కుటుంబంలో అతిచిన్న సభ్యుడిగా వస్తున్న ఈ కారుకు 'బేబీ స్కార్పియో' అనే పేరు వినిపిస్తోంది.
సాంప్రదాయ రగ్గడ్ లుక్తో ఈ ఎస్యూవీ కనువిందు చేయనుంది.
"విజన్ ఎస్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఎల్-షేప్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, కొత్త ఆరు స్లాట్ల గ్రిల్, ఏడాస్ కోసం ప్రత్యేక రాడార్ మాడ్యూల్, మస్క్యులర్ బాడీ లాంగ్వేజ్ ఈ కారుకు ప్రత్యేక లుక్ను తెస్తాయి," అని లీక్డ్ ఫోటోలు చూసిన ఆటోమొబైల్ నిపుణులు పేర్కొన్నారు.
ఈ కారులో పనోరమిక్ సన్రూఫ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, టెయిల్గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ వంటి అధునాతన హంగులు ఉండనున్నాయి. కేబిన్ లోపల డ్యుయల్ డిస్ప్లేలు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ ఏసీ వంటి సదుపాయాలు ఉంటాయి. భద్రత విషయానికి వస్తే, ఆరు ఎయిర్బ్యాగ్లతో పాటు లెవల్-2 అడాస్ టెక్నాలజీని కూడా మహీంద్రా జోడించింది. సరికొత్త ‘ఎన్ యూ-ఐక్యూ’ మాడ్యులర్ ప్లాట్ఫారమ్పై తయారవుతున్న ఈ కారు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ అలాగే హైబ్రిడ్ ఆప్షన్లలో లభించనుంది.
మహీంద్రా బీఈ 7 - సరికొత్త హారియర్ ఈవీకి గట్టి పోటీ!
ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మహీంద్రా తన నాల్గొవ ఎలక్ట్రిక్ ఎస్యూవీని రోడ్లపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. బీఈ.07 కాన్సెప్ట్ ఆధారంగా తయారవుతున్న ఈ ఎలక్ట్రిక్ కారును 'మహీంద్రా బీఈ 7'గా పిలువనున్నారు. కంపెనీ లైనప్లో బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ మోడళ్ల మధ్యలో దీన్ని ఉంచనున్నారు. కూపే-ఎస్ యూవీ డిజైన్కు భిన్నంగా ఇది ఎంతో విశాలమైన, ప్రాక్టికల్ లుక్తో రానుంది.
"ఇంగ్లో (INGLO) బోర్న్-ఈవీ ప్లాట్ఫారమ్పై రూపుదిద్దుకుంటున్న ఈ ఎలక్ట్రిక్ కారు సుమారు 4.6 మీటర్ల పొడవుతో ఉంటుంది," అని కంపెనీ వర్గాలు వివరించాయి.
ఫ్రేమ్లెస్ డోర్లు, మోటరైజ్డ్ పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్ ఈ కారు ప్రీమియం లుక్ను మరింత పెంచుతాయి. ఇందులో 59 కిలోవాట్ అవర్, 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీ వేరియంట్ డ్యుయల్-మోటార్ ఏడబ్ల్యూడీ సెటప్తో రానుండగా, ఈ మహీంద్రా బీఈ 7 నేరుగా టాటా హారియర్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


