పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అంతర్గత సంక్షోభం తీవ్రరూప దాల్చింది. మహారాష్ట్రలో శివసేన చీలిపోయిన తరహాలోనే, బెంగాల్లోనూ టీఎంసీ ముక్కలయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ నుండి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రీతబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకునేందుకు దాదాపు 60 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు.
స్పీకర్కు లేఖ ఇచ్చేందుకు సిద్ధం

మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో సుమారు 60 మంది సంతకాలను తిరుగుబాటు వర్గం సేకరించింది. తామే అసలైన టీఎంసీ అని గుర్తింపు ఇవ్వాలంటూ బుధవారం అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్కు లేఖ సమర్పించనున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి తప్పించుకోవడానికి కనీసం మూడింట రెండొంతుల (54 మంది) ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, ఈ వర్గానికి అంతకంటే ఎక్కువే బలముంది.
"తృణమూల్ కాంగ్రెస్ ముక్కలైపోయింది. బెంగాల్లో ఇప్పుడు మహారాష్ట్ర తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రీతబ్రత దాదాపు 50 మంది ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్ కార్యాలయానికి వచ్చారు. ఇక ఆట మొదలైంది" అని మంత్రి తపస్ రాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఢిల్లీ నుంచే కుట్ర: మమతా బెనర్జీ
మంగళవారం కోల్కతాలో జరిగిన ఒక ర్యాలీలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "టీఎంసీని చీల్చేందుకు ఢిల్లీ నుంచి పెద్ద కుట్ర జరుగుతోంది. కానీ దీనిని మేం అనుమతించం, గట్టిగా పోరాడుతాం" అని ఆమె స్పష్టం చేశారు.
అయితే ఎన్నికల ఓటమి తర్వాత మమత చేపట్టిన తొలి నిరసన ప్రదర్శనకు కేవలం తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే హాజరుకావడం పార్టీ తాజా పరిస్థితిని తెలియజేస్తోంది. గత ఆదివారం (మే 31) ఆమె పిలిచిన ఎమ్మెల్యేల సమావేశానికి కూడా కేవలం 20 మంది మాత్రమే రావడం పార్టీలో అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో చూపుతోంది.
అభిషేక్ బెనర్జీ నాయకత్వంపైనే అసంతృప్తి
ఈ తిరుగుబాటుకు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయకత్వ శైలియే ప్రధాన కారణమని అసంతృప్త నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మే 6న జరిగిన సమావేశంలో, అభిషేక్ బెనర్జీని అభినందిస్తూ ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాలని మమత కోరారని, ఆ క్షణంలోనే తిరుగుబాటు బీజాలు పడ్డాయని ఒక నేత వెల్లడించారు.
{{/usCountry}}ఈ తిరుగుబాటుకు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయకత్వ శైలియే ప్రధాన కారణమని అసంతృప్త నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మే 6న జరిగిన సమావేశంలో, అభిషేక్ బెనర్జీని అభినందిస్తూ ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాలని మమత కోరారని, ఆ క్షణంలోనే తిరుగుబాటు బీజాలు పడ్డాయని ఒక నేత వెల్లడించారు.
{{/usCountry}}"నేను ఇంకా తృణమూల్కు చెందినవాడినేనని నమ్ముతున్నాను. పార్టీని కార్పొరేట్ తరహాలో నడిపేందుకు ప్రయత్నించడం వల్లే ప్రజలు తిరస్కరించారు. ప్రజలు మెరుగైన టీఎంసీని కోరుకుంటున్నారు" అని తిరుగుబాటు నేత రీతబ్రత బెనర్జీ వ్యాఖ్యానించారు.
పతనం అంచున టీఎంసీ.. నేతల విమర్శలు
టీఎంసీ తాజా పరిణామాలపై బెంగాల్ అధికార పక్షం, విపక్ష నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. "టీఎంసీ కథ ముగిసింది. మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి ఆ పార్టీలో ఎవరూ కనిపించడం లేదు. మమతా బెనర్జీ ఇప్పుడు ఒంటరిగా మిగిలారు. అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం" అని బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ విమర్శించారు.
మమత ప్రధాన అనుచరుడు కునాల్ ఘోష్ మాత్రం ఆత్మపరిశీలన వైఖరిని ప్రదర్శించారు. "బీజేపీ ఏదైనా ఆశ చూపి మన పార్టీ నేతలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తే, అందులో వారి తప్పు లేదు. అధికారం పోగానే కొందరికి ఆలస్యంగా జ్ఞానోదయం కలిగి ఊపిరాడనట్టు ఫీలవుతున్నారు. మొదట మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ లోపల గండం.. బయట ప్రభావం ఎంత?
గతంలో సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీగా ఉండి, 2017లో బహిష్కరణకు గురైన రీతబ్రతను టీఎంసీ 2024లో రాజ్యసభకు పంపింది. ఇటీవల అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా శోభన్దేబ్ ఛటోపాధ్యాయను నియమిస్తూ టీఎంసీ ఇచ్చిన లేఖలో ఫోర్జరీ సంతకాలు ఉన్నాయని రీతబ్రత, మరో ఎమ్మెల్యే సందీపన్ సాహా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో జూన్ 1న వీరిద్దరినీ టీఎంసీ బహిష్కరించింది.
ఈ రాజకీయ సంక్షోభంపై జేఎన్యూ ప్రొఫెసర్ మణీంద్ర నాథ్ ఠాకూర్ విశ్లేషిస్తూ, "టీఎంసీలో పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగినా, దీర్ఘకాలంలో ఈ అసంతృప్త వర్గానికి రాజకీయంగా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అసెంబ్లీలో వారి ప్రభావం పరిమితంగానే ఉంటుంది, పైగా వారి స్వేచ్ఛను బీజేపీయే శాసిస్తుంది. కానీ ప్రతిపక్ష నాయకురాలిగా మమతా బెనర్జీకి సొంతంగా పట్టు ఉంటుంది" అని అభిప్రాయపడ్డారు.