Maruti Suzuki Brezza : ఇంకొన్ని రోజుల్లో మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ లాంచ్- ఇదే హైలైట్..
2026 Maruti Suzuki Brezza : భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్యూవీ 'మారుతీ సుజుకీ బ్రెజ్జా' సరికొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్ విడుదలకు సిద్ధమైంది. సరికొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో రాబోతున్న ఈ కారు విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్యూవీ 'బ్రెజ్జా'ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. జులై 23న ఈ సరికొత్త బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ వెర్షన్ భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. 2022లో సెకండ్ జనరేషన్ మోడల్ వచ్చిన తర్వాత ఈ పాపులర్ ఎస్యూవీకి లభిస్తున్న మొదటి మేజర్ అప్డేట్ ఇదే కావడం విశేషం. ఈ కొత్త మోడల్లో కేవలం డిజైన్ మార్పులు మాత్రమే కాకుండా, వాహన ప్రియులు ఎప్పటినుంచో కోరుకుంటున్న పవర్ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ని సైతం సంస్థ పరిచయం చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్లిఫ్ట్కి 'బూస్టర్జెట్' పవర్..!
కొత్త మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్లిఫ్ట్లో రాబోతున్న అతిపెద్ద మార్పు దాని ఇంజిన్. ప్రస్తుతం మారుతీ ఫ్రాంక్స్ కారులో అందిస్తున్న 1.0-లీటర్ బూస్టర్జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ను ఇకపై బ్రెజ్జాలోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ త్రీ-సిలిండర్ మోటార్ గరిష్టంగా 100 బీహెచ్పీ పవర్ను, 148 ఎన్ఎమ్ టాక్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి తోడు కొత్తగా 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ను జత చేయబోతున్నట్లు ఇటీవల లీకైన టెస్ట్ మోడల్స్ ద్వారా స్పష్టమైంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ వంటి కాంపాక్ట్ ఎస్యూవీలు అన్నీ టర్బో ఇంజిన్ ఆప్షన్లతో దూసుకుపోతున్నాయి. ఇప్పటివరకు బ్రెజ్జాలో కేవలం 1.5-లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉండటం పెద్ద మైనస్గా మారింది. ఇప్పుడు రాబోతున్న టర్బో ఇంజిన్తో ఈ లోటు పూర్తిగా భర్తీ కానుంది.
జీఎస్టీ అడ్వాంటేజ్.. భారీగా తగ్గనున్న ధర?
భారతదేశ పన్ను నిబంధనల ప్రకారం.. 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండి, 1200 సీసీలోపు పెట్రోల్ ఇంజిన్ కలిగిన వాహనాలకు కేవలం 18 శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం బ్రెజ్జా ఎస్యూవీలో ఉన్న 1.5-లీటర్ (1500సీసీ) ఇంజిన్ వల్ల దానిపై పన్ను భారం ఎక్కువగా పడుతోంది. ఇప్పుడు కొత్తగా రాబోతున్న 1.0-లీటర్ చిన్న టర్బో ఇంజిన్ వల్ల మారుతీ సుజుకీకి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పన్ను లబ్ధిని కస్టమర్లకు బదిలీ చేస్తే, కొత్త టర్బో వేరియంట్ల ధరలు మార్కెట్లో చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.
పాత 1.5-లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజిన్తో పాటు, మైలేజ్ కోరుకునే వారి కోసం సీఎన్జీ వేరియంట్ను కూడా కంపెనీ యథావిధిగా కొనసాగించనుంది.
మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్లిఫ్ట్- లుక్ మారింది.. ఫీచర్లు అదరహో!
డిజైన్ పరంగా చూస్తే, ఈ 2026 మారుతీ సుజుకీ బ్రెజ్జా మోడల్లో సరికొత్త ఫ్రంట్ బంపర్, అప్డేటెడ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, సరికొత్త అలాయ్ వీల్స్ రాబోతున్నాయి. కారు వెనుక భాగంలో మారుతీ లైనప్కు తగ్గట్టుగా కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్స్ను అమర్చనున్నారు.
ఇక క్యాబిన్ లోపల ప్రీమియం ఫీచర్ల జాతర సాగనుంది.
ప్రస్తుతమున్న 9-ఇంచ్ స్క్రీన్ స్థానంలో సరికొత్త 10.1-ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రానుంది.
వేసవి కాలానికి ఎంతో అవసరమైన వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్ అందుబాటులోకి రానున్నాయి.
వీటితో పాటు యాంబియంట్ లైటింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు కూడా చేర్చనున్నారు.
భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తూ 2026 మారుతీ సుజుకీ బ్రెజ్జా టాప్ వేరియంట్లలో లెవెల్-2 అడాస్ సేఫ్టీ ఫీచర్ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


