కార్ల ధరలు పెంచనున్న మారుతీ సుజుకీ.. ఆగస్టు నుంచి ఎంత పెరగనుందంటే?

మారుతీ సుజుకీ కార్ల ప్రియులకు చేదు వార్త. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల భారాన్ని తగ్గించుకోవడానికి ఆగస్టు 2026 నుంచి తమ వాహనాల ధరలను రూ.30,000 వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వాహన మోడల్‌ను బట్టి ఈ పెంపు మారనుంది.

Published on: Jul 21, 2026, 18:17:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వచ్చే ఆగస్టు 2026 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మంగళవారం వెల్లడించింది. కంపెనీ తన ఆల్‌మోడల్స్ పోర్ట్‌ఫోలియోపై గరిష్టంగా రూ.30,000 వరకు ధరలను పెంచాలని నిర్ణయించింది.

కార్ల ధరలు పెంచనున్న మారుతీ సుజుకీ.. ఆగస్టు నుంచి ఎంత పెరగనుందంటే?
కార్ల ధరలు పెంచనున్న మారుతీ సుజుకీ.. ఆగస్టు నుంచి ఎంత పెరగనుందంటే?

వాహనాల విడిభాగాల తయారీ వ్యయం రోజురోజుకూ పెరుగుతోందని, ఆ భారాన్ని తట్టుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే మారుతీ సుజుకీ షేర్లు బిఎస్‌ఈ (BSE)లో 0.6 శాతం లాభపడి రూ.13,597 వద్ద ముగిశాయి.

వ్యయాల భారం.. తప్పని పెంపు

"నిరంతరం పెరుగుతున్న ఇన్ పుట్ కాస్ట్స్ కారణంగానే విధిలేక ధరలు పెంచాల్సి వస్తోంది. ఆగస్టు 2026 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి" అని మారుతీ సుజుకీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.

గడిచిన కొన్ని నెలలుగా ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడానికి అంతర్గతంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ద్రవ్యోల్బణ ప్రభావం వల్ల ఆ భారాన్ని పాక్షికంగా వినియోగదారులపై వేయక తప్పడం లేదని సంస్థ వివరించింది. అయితే, కస్టమర్లపై ఈ ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం మారుతీ సుజుకీ ఎంట్రీ లెవెల్ 'ఎస్-ప్రెస్సో' (S-Presso) నుంచి ప్రీమియం ఎస్‌యూవీ 'ఇన్విక్టో' (Invicto) వరకు అనేక మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 3.5 లక్షల నుంచి రూ. 28.70 లక్షల మధ్య ఉన్నాయి.

మార్కెట్లో మిగతా కంపెనీల పరిస్థితి

కేవలం మారుతీ మాత్రమే కాదు, ఆటోమొబైల్ రంగంలోని ఇతర దిగ్గజాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న రవాణా అడ్డంకులు, ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లు, సరఫరా వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో విడిభాగాల తయారీ ఖర్చులు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే జూన్‌లో మారుతీ రూ.30,000 వరకు ధరలు పెంచగా, టాటా మోటార్స్ రెండుసార్లు, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ సంస్థలు ఒకసారి చొప్పున వాహనాల ధరలను సవరించాయి.

'ప్రైస్ ప్రొటెక్షన్' మళ్లీ ఇస్తారా?

గత మే/జూన్ నెలలో ధరలు పెంచినప్పుడు ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్-ఆర్ వంటి చిన్న కార్ల బుకింగ్‌లపై మారుతీ 'ప్రైస్ ప్రొటెక్షన్' వెసులుబాటు కల్పించింది. జూన్ 14 నాటికి కార్లను బుక్ చేసుకున్న వారికి పాత ధరలకే వాహనాలు అందిస్తామని నాడు హామీ ఇచ్చింది.

"కారు కొనాలనే ఆలోచనతో ధైర్యంగా ముందుకు వచ్చిన సామాన్య కస్టమర్ ధరల పెంపు వల్ల వెనక్కి తగ్గకూడదనే ఉద్దేశంతోనే చిన్న కార్ల కొనుగోలుదారులకు ప్రైస్ ప్రొటెక్షన్ వెసులుబాటు కల్పించాం" అని మారుతీ సుజుకీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ గతంలో వెల్లడించారు.

అయితే రాబోయే ఆగస్టు పెంపునకు కూడా ఇలాంటి ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్‌ను వర్తింపజేస్తారా లేదా అనేది కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More