Hybrid SUV : దీపావళికి ఎంజీ తొలి హైబ్రిడ్​ ఎస్​యూవీ- మహీంద్రా కార్లకు గట్టి పోటీగా..

MG Hybrid SUV : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అక్టోబర్ 2026 నాటికి సరికొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. దీపావళి కానుకగా రానున్న ఈ కారు డిజైన్ పేటెంట్ భారత్‌లో పూర్తయింది. దీని ఫీచర్లు, మైలేజ్ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jun 7, 2026, 14:01:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతున్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కీలక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (పీహెచ్​ఈవీ) విభాగంలోకి అధికారికంగా అడుగుపెడుతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. అక్టోబర్ 2026 నాటికి ఈ సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీని రోడ్లపైకి తీసుకురావడానికి కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం '520' అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రీమియం ఎస్‌యూవీ.. మార్కెట్లోకి వచ్చాక మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్​ఓ, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఎంజీ తొలి హైబ్రిడ్​ ఎస్​యూవీ..
ఎంజీ తొలి హైబ్రిడ్​ ఎస్​యూవీ..

2026 దీపావళి పండుగ సీజన్ నాటికి ఈ కారును మార్కెట్లో విడుదల చేయాలని ఎంజీ మోటార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘వులింగ్ స్టార్‌లైట్ 560’ ఎస్‌యూవీ డిజైన్‌ను కంపెనీ భారతదేశంలో పేటెంట్ చేయించుకుంది. ఈ మోడల్‌ను భారతీయ కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేసి, ఎంజీ బ్రాండ్ పేరుతో సరికొత్త గుర్తింపుతో లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఎంజీ హైబ్రిడ్​ ఎస్​యూవీ- పవర్‌ట్రెయిన్, పర్ఫార్మెన్స్..

గ్లోబల్ మార్కెట్లో వులింగ్ స్టార్‌లైట్ 560 ఎస్‌యూవీని ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ప్యూర్ ఎలక్ట్రిక్ (ఈవీ) అనే రెండు ఆప్షన్లలో విక్రయిస్తున్నారు.

హైబ్రిడ్ (పీహెచ్​ఈవీ) వెర్షన్: భారతదేశంలో 'ఎంజీ స్టార్‌లైట్ 560' పేరుతో రాబోయే ఈ ఎస్‌యూవీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 20.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇవి రెండు కలిసి కారుకు 197బీహెచ్​పీ పవర్‌ను, 230ఎన్​ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తాయి.

ఎలక్ట్రిక్ (ఈవీ) వెర్షన్: ఈ మోడల్‌లో 56.7కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది ముందు భాగంలో ఉండే ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 136బీహెచ్​పీ పవర్‌ను, 200ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఎంజీ హైబ్రిడ్​ ఎస్​యూవీ- రేంజ్ ఎంతంటే?..

చైనా లైట్-డ్యూటీ వెహికల్ టెస్ట్ సైకిల్ (సీఎల్​టీసీ) ప్రమాణాల ప్రకారం.. ఈ ఎస్‌యూవీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌లో కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని సంస్థ పేర్కొంది.

ఎంజీ హైబ్రిడ్​ ఎస్​యూవీ- ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు..

ఈ కారు ఇంటీరియర్ చాలా సింపుల్‌గా, లగ్జరీ లుక్‌తో కూడిన డ్యూయల్-టోన్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. కారు లోపలికి అడుగుపెట్టగానే డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఉండే భారీ 12.8 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో డ్రైవర్ కోసం 8.8 ఇంచుల డిజిటల్ డిస్‌ప్లేను అందించారు. కారులోని చాలా ఫంక్షన్లను టచ్‌స్క్రీన్ ద్వారానే కంట్రోల్ చేయవచ్చు. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు సులభంగా ఉండేందుకు స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్, డోర్ ఆర్మ్‌రెస్ట్‌లపై ఫిజికల్ బటన్లను కూడా అందుబాటులో ఉంచారు.

ఈ ఎస్‌యూవీలో ప్రయాణికులకు వినోదం, రక్షణ కోసం అధునాతన ఫీచర్లను జోడించారు:

  • 6-స్పీకర్ల అద్భుతమైన ఆడియో సిస్టమ్
  • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
  • ప్రీమియం లెథరెట్ అప్హోల్‌స్టరీ
  • ఓటీఏ అప్‌డేట్స్, 4G కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
  • భద్రత కోసం మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్సీ
  • ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా

ఎంజీ హైబ్రిడ్​ ఎస్​యూవీ- మహీంద్రా ఎక్స్‌యూవీ 7XO కంటే పెద్దదా?

డైమెన్షన్స్ విషయానికి వస్తే, ఈ కొత్త ఎంజీ స్టార్‌లైట్ 560 ఎస్‌యూవీ తన అంతర్జాతీయ మోడల్ సైజులోనే ఉండే అవకాశం ఉంది. ఇది 4,745 ఎంఎం పొడవు, 1,850 ఎంఎం వెడల్పు, 1,755 ఎంఎం ఎత్తును కలిగి ఉంటుంది. అలాగే ఈ కారు వీల్‌బేస్ 2,810 ఎంఎంగా ఉంది.

ఇదే కొలతలతో భారత మార్కెట్లోకి వస్తే గనుక, ఎంజీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ తన ప్రధాన పోటీదారు అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 7XO కంటే 50 మిమీ అదనపు పొడవును కలిగి ఉంటుంది. అలాగే దీని వీల్‌బేస్ కూడా మహీంద్రా కారు కంటే 60 మిమీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కారు లోపల ప్రయాణికులకు లెగ్‌రూమ్, బూట్ స్పేస్ చాలా ధారాళంగా లభిస్తుందని చెప్పవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More