షాకింగ్- ప్యాంటు జేబులో పేలిన స్మార్ట్ఫోన్.. ఇలా ఎందుకు జరుగుతుంది?
స్మార్ట్ఫోన్స్ని ప్యాంటు జేబులో పెట్టే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కానీ జేబులోనో ఫోన్ పేలితే? ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది కదూ! కానీ ఇది నిజంగా జరిగింది. ఓ వ్యక్తి జేబులో ఫోన్ పేలి మంటలు వచ్చాయి.
అది ఒక మామూలు రోజు.. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఊహించని షాక్ తగిలింది! తన జేబులో ఉన్న మోటోరోలా స్మార్ట్ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఆ వెంటనే మంటలు చెలరేగడంతో ఆ వ్యక్తి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

అభిషేక్ యాదవ్ అనే ఎక్స్ వినియోగదారుడు షేర్ చేసిన ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ వీడియోను 'shubhxr_369' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి సేకరించారు. ఆ వీడియోలో బ్లూ కలర్లో ఉన్న ఓ మోటోరోలా జీ-సిరీస్ ఫోన్ పూర్తిగా కాలిపోయి కనిపిస్తోంది. ఫోన్ వెనుక భాగం కరిగిపోగా, డిస్ప్లే పగిలిపోయి, నల్లటి మచ్చలతో భయంకరంగా తయారైంది. ఆ ఫోన్ డిజైన్, రంగును బట్టి అది 'మోటో జీ54' మోడల్ అయి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.
అయితే దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.
తాను ఫోన్ను వాడుతున్నప్పుడు ఈ ప్రమాదం జరగలేదని, అది జేబులో ఉండగానే మంటలు వచ్చాయని ఉత్తర్ప్రదేశ్లో నివాసముంటున్న బాధితుడు వివరించాడు. ఆ మంటల ధాటికి తన జీన్స్ ప్యాంటుకు పెద్ద రంధ్రం పడినట్లు కూడా అతను వీడియోలో చూపించాడు.
అదృష్టవశాత్తూ అతనికి ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా రాలేదని సమాచారం.
స్మార్ట్ఫోన్ బ్యాటరీలపై పెరుగుతున్న ఆందోళన..
ఈ ఘటనతో స్మార్ట్ఫోన్లలో వాడే లిథియం-అయాన్ బ్యాటరీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. నేటి తరం ఫోన్ల స్లిమ్ డిజైన్ కోసం ఈ బ్యాటరీలనే వాడుతున్నారు. అయితే వీటిలోని రసాయన సమతుల్యత దెబ్బతింటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
"టెక్నికల్ పరిశీలన లేకుండా ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం చెప్పలేం. ఫోన్ తయారీ లోపమా? లేక మరే కారణంగానైనా జరిగిందా? అనేది కంపెనీ విచారణలో తేలాల్సి ఉంది," అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా బ్యాటరీలో వేడి విపరీతంగా పెరిగిపోయి 'థర్మల్ రన్అవే' అనే పరిస్థితి ఏర్పడినప్పుడు ఇలా మంటలు వస్తుంటాయి.
బ్యాటరీ ఎందుకు వేడెక్కుతుంది?
ఫోన్ బ్యాటరీ వేడెక్కడానికి రకరకాల కారణాలు ఉండవచ్చు:
- ఫోన్ కింద పడటం వల్ల లేదా దానిపై ఒత్తిడి పడటం వల్ల అంతర్గత భాగాలు దెబ్బతినవచ్చు.
- నేరుగా ఎండలో లేదా ఎక్కువ వేడి ఉన్న చోట ఫోన్ను ఉంచడం.
- నాణ్యత లేని ఛార్జర్లు, కేబుల్స్ వాడటం వల్ల షార్ట్ సర్క్యూట్ జరగడం.
- కొన్నిసార్లు హానికరమైన సాఫ్ట్వేర్ వల్ల ప్రాసెసర్ నిరంతరం పనిచేస్తూ లోపల వేడిని పెంచడం.
ప్రస్తుతానికి ఈ మోటోరోలా ఫోన్ ఘటనపై కంపెనీ స్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. స్మార్ట్ఫోన్ అతిగా వేడెక్కుతున్నా లేదా బ్యాటరీ ఉబ్బినట్లు అనిపించినా వెంటనే అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మనల్ని హెచ్చరిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


