Dhoni IPL: ధోని ఫ్యాన్స్కు పిడుగులాంటి వార్త.. ఐపీఎల్ 2026కు 'తలా' దూరం.. సీఎస్కే పోస్టు వైరల్.. ఏం చెప్పిందంటే?
Dhoni IPL: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే సీఎస్కే అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఎంఎస్ ధోని గాయం కారణంగా తొలి రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎస్కే చేసిన పోస్టు వైరల్ గా మారింది.
ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే పిడుగులాంటి వార్త ఇది. ఆ జట్టు గుండెకాయ లాంటి ఎంఎస్ ధోనికి గాయమైంది. దీంతో ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్లకు అతను టీమ్ కు అందుబాటులో ఉండడని సీఎస్కే ఫ్రాంఛైజీ శనివారం (మార్చి 28) అనౌన్స్ చేసింది.

ధోనికి కండరాల నొప్పి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం పిక్క కండరాల నొప్పితో (calf strain) తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన స్పెషల్ రిహాబిలిటేషన్లో ఉన్నారని, మైదానంలోకి అడుగుపెట్టే పరిస్థితి లేదని సీఎస్కే తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
సంజు శాంసన్
గ్వాలియర్లో రాజస్థాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోతున్న హై-వోల్టేజ్ మ్యాచ్కు కేవలం రెండు రోజుల ముందే ధోని గాయం అప్డేట్ రావడం గమనార్హం. ధోని ఆడటం దాదాపు అసాధ్యం కావడంతో, ఆయన స్థానంలో సంజు శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
రెండు వారాల పాటు
ధోని కోలుకోవడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. "ధోని ప్రస్తుతం పిక్క కండరాల నొప్పి నుంచి కోలుకుంటున్నాడు. ఈ కారణంగా ఆయన ఐపీఎల్ 2026కు తొలి రెండు వారాలు దూరమయ్యే అవకాశం ఉంది’’ అని సీఎస్కే ఎక్స్ వేదికగా వెల్లడించింది.
కీలకమైన నాలుగు మ్యాచ్లు
షెడ్యూల్ ప్రకారం, మొదటి రెండు వారాల్లో సీఎస్కే ఆడే నాలుగు కీలక మ్యాచ్లకు ధోని దూరం కానున్నాడు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే పోరులో ధోని మెరుపులు ఉండవని తేలిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
వయసు భారంతోనే
44 ఏళ్ల వయసులో కూడా ధోని ఐపీఎల్ 19వ సీజన్ కు రెడీ కావడం విశేషం. అయితే ఈ వయసులో కండరాల గాయాల నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుందని, ఇది ధోని కెరీర్పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సీజన్ లో ధోని ఆడితే ఐపీఎల్ ఆడిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పుతాడు.
వారసుడిగా సంజు శాంసన్
రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ ద్వారా సంజు శాంసన్ సీఎస్కేలోకి రావడంతో ధోని వారసుడు దొరికాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ సీజన్ మొదట్లోనే ధోని గాయపడటం, శాంసన్ నేరుగా వికెట్ల వెనుక బాధ్యతలు తీసుకోవాల్సి రావడం ఊహించని పరిణామం.
చివరి సీజన్ అవుతుందా?
ఐపీఎల్ 2026 ధోనికి చివరి సీజన్ కావచ్చని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో గాయంతో ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ చర్చలు మళ్లీ జోరందుకున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


