NEET UG 2026 : నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్కి భారీ భద్రత! 5లక్షల మంది సిబ్బందితో..
NEET UG 2026 city intimation slip : పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ-టెస్ట్కి అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఐదు లక్షల మందికి పైగా సిబ్బందితో భారీ నిఘా ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం తర్వాత.. జూన్ 21, 2026న జరగబోయే రీ-ఎగ్జామినేషన్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ముందెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిరోధించడమే లక్ష్యంగా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది.

ఈ భారీ ఆపరేషన్లో దేశవ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాలుపంచుకోనున్నారు. ఇందులో రెండు లక్షల మందికి పైగా పోలీసు అధికారులు, హోంగార్డులు, జిల్లా పరిపాలనాధికారులు, పరీక్షా సిబ్బందిని దేశంలోని వివిధ పరీక్షా కేంద్రాల వద్ద మోహరిస్తున్నారు. వీటితో పాటు సమస్యాత్మక, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లోని కేంద్రాల వద్ద పారామిలట్రీ బలగాలను కూడా రంగంలోకి దించుతున్నారు.
నీట్ యూజీ 2026 పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడానికి ఒక లక్షకు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం కెమెరాలకే పరిమితం కాకుండా, ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే పట్టుకునేలా మల్టీ-లేయర్ నిఘా వ్యవస్థలను, అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత మానిటరింగ్ సాంకేతికతను అధికారులు ఉపయోగించనున్నారు.
అంతేకాదు పేపర్ల ట్రాన్స్ఫర్కి ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఐఏఎఫ్ (భారత వాయుసేన) సేవలను తీసుకున్నట్టు ఎన్టీఏ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ మాల్ప్రాక్టీస్కు చెక్ పెట్టేందుకు అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియను మరింత కఠినతరం చేశారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి పరీక్షా కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద తప్పనిసరిగా ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే (ఇంపర్సనేషన్) మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, నిజమైన అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాసేలా చూసేందుకు ఈ గట్టి చర్యలు తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్థానిక పరిపాలనా విభాగాలు, పోలీసు శాఖలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల సమన్వయంతో ఈ భారీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ నీట్ యూజీ రీ-టెస్ట్కు దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని అంచనా.
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జూన్ 21న జరగబోయే నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు సంబంధించిన 'ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను' ఆదివారం విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి తమ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్థులు తమ పరీక్షా నగరం వివరాలను తెలుసుకునేందుకు కింది పద్ధతిని అనుసరించవచ్చు:
- ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ను సందర్శించండి.
- హోమ్పేజీలో కనిపించే "Present Address and Exam City Updation Window for NEET(UG) 2026" అనే లింక్పై క్లిక్ చేయండి.
- వెంటనే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ మరియు సెక్యూరిటీ క్యాప్చాను ఎంటర్ చేయండి.
- ఇప్పుడు మీ నీట్ ఎగ్జామ్ సిటీ స్లిప్ స్క్రీన్పై కనిపిస్తుంది.
- దానిని డౌన్లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింటవుట్ తీసుకొని భద్రపరుచుకోండి.
పెన్ అండ్ పేపర్ మోడ్లోనే పరీక్ష..
ఎన్టీఏ జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం.. ఈ నీట్ పునఃపరీక్ష పాత పద్ధతిలోనే అంటే 'పెన్ అండ్ పేపర్' (ఆఫ్లైన్) మోడ్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరుగుతుంది. భారతదేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
విద్యార్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగానే తెలియజేయడానికి ఈ సిటీ స్లిప్ ఉపయోగపడుతుందని, పరీక్షకు సంబంధించిన అసలైన అడ్మిట్ కార్డులను త్వరలోనే విడుదల చేస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. అలాగే విద్యార్థులు దరఖాస్తులో కోరుకున్న మొదటి ప్రాధాన్యత నగరాల్లోనే పరీక్షా కేంద్రాలను కేటాయించడానికి గరిష్టంగా ప్రయత్నించామని టెస్టింగ్ ఏజెన్సీ తన నోటీసులో పేర్కొంది.
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఎందుకు జరుగుతోంది?
మే 3న జరిగిన మెడికల్ ప్రవేశ పరీక్షలో పేపర్ లీక్ అయినట్లు తేలడంతో అప్పట్లో ఆ పరీక్షను రద్దు చేశారు. ఆ సమయంలో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పేపర్ లీక్ ఉదంతంపై ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముమ్మర దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 21న దేశవ్యాప్తంగా తిరిగి పరీక్ష నిర్వహిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


