...
...
Next Story

Nepal floods : 600 దాటిన మృతుల సంఖ్య! వేలాది మంది గల్లంతు..

చైనా సరిహద్దుల్లో గ్లేషియర్ విరిగిపడటంతో నేపాల్, టిబెట్ ప్రాంతాలను ఊహించని ప్రళయం చుట్టుముట్టింది. కొండచరియలు, మంచు విరిగిపడి ఉప్పొంగిన ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 2,500 మంది గల్లంతయ్యారు. విపత్తు సహాయక చర్యల్లో భారత దళాలు కూడా పాలుపంచుకుంటున్నాయి.

Published on: Aug 29, 2026, 11:18:15 IST
Advertisement

ప్రపంచ దేశాలను షాక్​కు గురిచేసిన నేపాల్ ఆకస్మిక వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 600 దాటింది. నేపాల్ పోలీసుల ప్రకారం ఇప్పటివరకు 626 మంది మరణించారు. పొరుగునే ఉన్న టిబెట్‌లో మరో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో కనీసం 2,478 మంది ఆచూకీ లేకుండా పోయారు. వీరిలో 1,924 మంది నేపాల్‌లోనే గల్లంతవ్వగా, టిబెట్ పరిధిలో 554 మంది జాడ దొరకడం లేదు. విపత్తు ధాటికి మృతదేహాలు కొట్టుకుపోయిన తీరు చూస్తే మృతుల సంఖ్య మరిన్ని వందల్లో పెరిగే అవకాశముందని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగింది?

సహాయక శిబిరంలో చిన్నారులు..
సహాయక శిబిరంలో చిన్నారులు..

హిమాలయ పర్వత శ్రేణుల్లో విరిగిపడ్డ భారీ మంచు కొండ, సరిహద్దు దేశాలైన నేపాల్, టిబెట్‌లను ముంచెత్తింది. బుధవారం ఉదయం చైనా సరిహద్దు సమీపంలోని రసువా జిల్లా పరిధిలో గ్లేషియర్ (హిమానీనదం) ఉన్నపళంగా విరిగిపడటంతో కొండచరియలు, బురద నీరు విపరీతమైన వేగంతో కిందికి దూసుకొచ్చాయి. పర్వతాల పైనుంచి విరుచుకుపడిన ఈ జలప్రళయం నిమిషాల వ్యవధిలోనే అనేక గ్రామాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులను తుడిచిపెట్టేసింది.

టూరిస్టులు, విదేశీయుల ఆచూకీ కోసం తీవ్ర గాలింపు..

హిమాలయ సందర్శనకు వెళ్లిన అనేకమంది విదేశీ యాత్రికులు కూడా ఈ జలప్రళయంలో చిక్కుకున్నారు. నేపాల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ లెక్కల ప్రకారం సుమారు 517 మంది విదేశీయులు గల్లంతయ్యారు. వీరిలో భారతదేశానికి చెందిన యాత్రికులతో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా పర్యాటకులు కూడా ఉన్నట్లు తెలిసింది. చైనా సరిహద్దులో మరో 260 మంది విదేశీయుల ఆచూకీ దొరకడం లేదు. రెస్క్యూ బృందాలు శ్రమించి 121 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగాయి.

భారీ వరద ధాటికి నేపాల్-టిబెట్ వ్యాపార కేంద్రమైన ‘గైరాంగ్’ బోర్డర్ చెక్‌పోస్ట్ పూర్తిగా ధ్వంసమైంది. చైనాకు చెందిన 21 మంది నిపుణులైన రెస్క్యూ బృందాలు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి అత్యంత ప్రమాదకరమైన కొండచరియల గుండా రోప్‌లు కట్టుకుని సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఉప్పొంగుతున్న నదులు.. భారత్‌కూ ముప్పు?

సరస్సుల్లో సుమారు 2.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు చేరుకుందని, కట్టలు తెగితే ప్రవాహం మరింత బీభత్సం సృష్టిస్తుందని చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ నదులు అంతిమంగా భారత్‌లోని గంగా, కోసి నదీ పరివాహక ప్రాంతాలతో అనుసంధానమై ఉన్నందున, బీహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు జిల్లాల యంత్రాంగం కూడా అప్రమత్తమై పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది.

అదృశ్యమైన వారి కోసం భారత బృందాల శోధన..

విపత్తు సంభవించిన కొత్తలో విదేశీ సహాయాన్ని తిరస్కరించిన నేపాల్ ప్రభుత్వం, పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో మనస్సు మార్చుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు, మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు జరిపేందుకు భారతదేశం నుంచి ప్రత్యేక విపత్తు స్పందన దళాలు నేపాల్ చేరుకున్నాయి. భారత్‌తో పాటు చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలకు చెందిన అత్యంత నైపుణ్యం కలిగిన రెస్క్యూ టీమ్‌లు ప్రస్తుతం రసువా, ఖాట్మండు మార్గాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe