NHAI Internship 2026 : రూ. 20వేల స్టైఫండ్తో ఎన్హెచ్ఏఐలో ఇంటర్న్షిప్- పూర్తి వివరాలు..
NHAI Internship 2026 notification : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2026 సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, లా వంటి వివిధ విభాగాల విద్యార్థులు ఏప్రిల్ 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 20 వేల స్టైఫండ్ లభిస్తుంది.
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో పని చేయాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తన 'సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2026' కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు నెలల పాటు సాగే ఈ శిక్షణా కాలంలో విద్యార్థులు క్షేత్రస్థాయిలో అనుభవం గడించడమే కాకుండా, ఆకర్షణీయమైన స్టైపెండ్ను కూడా పొందవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎన్హెచ్ఏఐ సమ్మర్ ఇంటర్న్షిప్ 2026- ఎవరెవరు అర్హులు? ఏయే విభాగాలు?
గతంలో కేవలం సివిల్ ఇంజనీరింగ్కే పరిమితమైన ఈ ఇంటర్న్షిప్ను ఇప్పుడు మరిన్ని విభాగాలకు విస్తరించారు.
టెక్నికల్: సివిల్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).
నాన్-టెక్నికల్: లా (బీఏ ఎల్ఎల్బీ), కామర్స్, సైన్స్ (బీఏ/ బీకామ్/ బీఎస్సీ), మేనేజ్మెంట్ (ఎంబీఏ - హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్), మాస్ కమ్యూనికేషన్, లైబ్రరీ సైన్స్.
ప్రముఖ విద్యాసంస్థలు (ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉన్నవి), లా యూనివర్సిటీలు, టాప్ మేనేజ్మెంట్ స్కూల్స్లో ఫుల్ టైమ్ డిగ్రీ లేదా పీజీ చదువుతున్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎన్హెచ్ఏఐ సమ్మర్ ఇంటర్న్షిప్ 2026- స్టైఫండ్, ఇతర ప్రయోజనాలు..
ఎంపికైన విద్యార్థులు మే 4 నుంచి జులై 5, 2026 వరకు అంటే రెండు నెలల పాటు ఎన్హెచ్ఏఐ హెడ్ క్వార్టర్స్ లేదా ఫీల్డ్ ఆఫీసుల్లో సీనియర్ నిపుణుల పర్యవేక్షణలో పనిచేస్తారు. వీరికి నెలకు రూ. 20,000 స్టైఫండ్ ఇస్తారు. ఇంటర్న్షిప్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికేట్ కూడా అందజేస్తారు. ఇది భవిష్యత్తులో వారి కెరీర్ వృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎన్హెచ్ఏఐ సమ్మర్ ఇంటర్న్షిప్ 2026- దరఖాస్తు ప్రక్రియ ఇలా..
ఎన్హెచ్ఏఐ సమ్మర్ ఇంటర్న్షిప్ 2026 కోసం ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక ఇంటర్న్షిప్ పోర్టల్ (internshipsatnhai.digitalindiacorporation.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2026.
అభ్యర్థులు తమ విద్యా వివరాలతో పాటు తమకు నచ్చిన ప్రాజెక్ట్ లొకేషన్ ప్రిఫరెన్స్ను కూడా తెలియజేయవచ్చు.
ముఖ్య గమనిక: విద్యార్థులు దరఖాస్తు చేసిన తర్వాత, సంబంధిత విద్యా సంస్థలు వాటిని ధృవీకరించి ఆమోదించాల్సి ఉంటుంది. కాలేజీలు ఆమోదించిన దరఖాస్తులను మాత్రమే ఎన్హెచ్ఏఐ పరిశీలనలోకి తీసుకుంటుంది.
ఎన్హెచ్ఏఐ సమ్మర్ ఇంటర్న్షిప్- మంచి స్పందన..
గతేడాది (డిసెంబర్ 2025) చేపట్టిన ఎన్హెచ్ఏఐ వింటర్ ఇంటర్న్షిప్కు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది. అప్పట్లో వందలాది మంది సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఆ విజయంతోనే ఇప్పుడు మరిన్ని విభాగాలను చేరుస్తూ ఈ సమ్మర్ ప్రోగ్రామ్ను ఎన్హెచ్ఏఐ విస్తరించింది. దేశ మౌలిక సదుపాయాల కల్పనలో యువతకు భాగస్వామ్యం కల్పించడమే ఈ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు వెంటనే ఎన్హెచ్ఏఐ ఇంటర్న్షిప్ పోర్టల్ను సందర్శించగలరు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


