Nissan SUVs : భారత మార్కెట్లోకి నిస్సాన్ రెండు సరికొత్త ఎస్‌యూవీలు- అదిరిపోతాయంతే..

Nissan 7 Seater SUV : భారత ఆటోమొబైల్ మార్కెట్లో పట్టు సాధించేందుకు నిస్సాన్ ఇండియా వేగంగా అడుగులు వేస్తోంది. జూలై 9, 2026న 'టెక్టాన్' మిడ్‌సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుండగా, 2027 నాటికి సరికొత్త 7 సీటర్ ప్రీమియం ఎస్‌యూవీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

Published on: Jun 7, 2026, 17:09:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Upcoming Nissan SUVs 2026 : ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా దేశీయ మార్కెట్లో తన బ్రాండ్ ఇమేజ్‌ని మరింత పటిష్టం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే బడ్జెట్ ధరలో ఫ్యామిలీ కస్టమర్లను ఆకట్టుకునేలా 'గ్రావైట్' సబ్‌కాంపాక్ట్ ఎంపీవీని విడుదల చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు అదే ఊపుతో భారతీయ ఎస్‌యూవీ ప్రియుల కోసం మరో రెండు సరికొత్త మోడళ్లను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా నిస్సాన్ ‘టెక్టాన్’ పేరుతో ఒక మిడ్‌సైజ్ ఎస్‌యూవీని, అలాగే మూడు వరుసల సీటింగ్ కలిగిన ఒక ప్రీమియం 7 సీటర్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ జులై 9, 2026న గ్రాండ్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉండగా, 7 సీటర్ మోడల్ 2027 నాటికి రోడ్లపైకి రానుంది. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..

నిస్సాన్ టెక్టాన్ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..
నిస్సాన్ టెక్టాన్ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..

నిస్సాన్ టెక్టాన్: డిజైన్, లుక్ ఎలా ఉంది?

నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ నిజానికి రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందింది. అయితే దీని లుక్ మాత్రం నిస్సాన్ గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ‘పాట్రోల్’ ఎస్‌యూవీ డిజైన్ శైలిని పోలి ఉంటుంది. ఇప్పటికే విడుదలైన అధికారిక టీజర్ల ప్రకారం.. ఈ కారు ముందు భాగంలో పెట్రోల్ ఎస్‌యూవీ తరహాలోనే రెండు క్రోమ్ స్ట్రిప్స్‌తో కూడిన వెడల్పాటి గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, డ్యూయల్-టోన్ బంపర్‌ను అమర్చారు.

కారు పక్క భాగంలో ఉండే బలమైన వీల్ ఆర్చెస్, బ్లాక్ ట్రిమ్ ఎలిమెంట్స్ దీనికి మంచి రగ్గడ్ లుక్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్స్, డ్యూయల్-టోన్ బంపర్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ దీనికి మరింత స్పోర్టీ లుక్‌ను జోడించాయి.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది దాదాపు రెనాల్ట్ డస్టర్ కారును పోలి ఉన్నప్పటికీ, స్టీరింగ్ వీల్, సీట్ల అప్హోల్‌స్టరీపై నిస్సాన్ బ్రాండ్ లోగోలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఫీచర్ల పరంగా కూడా డస్టర్‌లోని మెజారిటీ అధునాతన ఆప్షన్లు ఇందులోనూ కొనసాగే అవకాశం ఉంది.

ఈ సరికొత్త నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ రెండు రకాల టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది:

1.0 లీటర్ టర్బో పెట్రోల్: ఇది గరిష్టంగా 100బీహెచ్​పీ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.

1.3 లీటర్ టర్బో పెట్రోల్: ఇది 163బీహెచ్​పీ పవర్​ని విడుదల చేస్తుంది.

ట్రాన్స్మిషన్ కోసం ఈ కార్లలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా వస్తుంది. అయితే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్లలో మాత్రం 6-స్పీడ్ డీసీటీ ( డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్) ఆటోమేటిక్ ఆప్షన్‌ను కూడా అందించనున్నారు. భవిష్యత్తులో ఈ నిస్సాన్ ఎస్‌యూవీని 160బీహెచ్​పీ పవర్ ఇచ్చే 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో కూడా లాంచ్ చేసే ఆలోచనలో కంపెనీ ఉంది.

నిస్సాన్ 7-సీటర్ ఎస్‌యూవీ: లగ్జరీ అండ్ స్పేస్..

భారతదేశంలో నిస్సాన్ బ్రాండ్ నుంచి రాబోయే అత్యంత ఖరీదైన, ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఈ 7 సీటర్ ఎస్‌యూవీ నిలవనుంది. మార్కెట్లోకి ప్రవేశించాక ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్​ఓ, టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ పెద్ద ఎస్‌యూవీలో 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. అయితే, కారు పరిమాణం పెద్దదిగా ఉండటం, బరువు ఎక్కువగా ఉండటం వల్ల, దీని పర్ఫార్మెన్స్, మైలేజ్ గణాంకాలలో టెక్టాన్ మోడల్‌తో పోలిస్తే స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

డిజైన్ చూసుకుంటే.. ఈ 7 సీటర్​ ఎస్​యూవీ టెక్టాన్​నే పోలి ఉండొచ్చు. కానీ కాస్త పెద్దగా, స్పేషియస్​గా ఉండనుంది. ధర కూడా టెక్టాన్ కంటే ఎక్కువ ఉండనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More