...
...
Next Story

లాభాల కోసం కక్కుర్తి పడకండి.. పెట్టుబడి కాపాడుకుంటే చాలు: నితిన్ కామత్ సూచన

ప్రస్తుత స్టాక్ మార్కెట్ గందరగోళ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవద్దని జెరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ హెచ్చరించారు. మార్కెట్ అస్థిరత, వరుస సెలవుల నేపథ్యంలో ట్రేడింగ్‌లో దూకుడు తగ్గించి, పెట్టుబడిని కాపాడుకోవడమే ప్రథమ లక్ష్యం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Published on: Mar 25, 2026, 15:49:05 IST
Advertisement

స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు లాభాలు రాకపోయినా పర్వాలేదు కానీ, ఉన్న డబ్బు పోగొట్టుకోకుండా 'సర్వైవ్' అవ్వడం ముఖ్యమని ట్రేడర్లకు సూచించారు జెరోధా (Zerodha) బాస్ నితిన్ కామత్. అంతర్జాతీయ మార్కెట్లు ప్రస్తుతం అత్యంత అస్థిరంగా ఉన్నాయని, కేవలం వార్తల ఆధారంగానే భారీ ఒడిదుడుకులు లోనవుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఈ మేరకు ఆయన లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు.

ఒకరి కనుసన్నల్లోనే గ్లోబల్ మార్కెట్లు

లాభాల కోసం కక్కుర్తి పడకండి.. పెట్టుబడి కాపాడుకుంటే చాలు: నితిన్ కామత్ సూచన
లాభాల కోసం కక్కుర్తి పడకండి.. పెట్టుబడి కాపాడుకుంటే చాలు: నితిన్ కామత్ సూచన

ప్రస్తుత మార్కెట్ పరిస్థితిపై కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మనం విచిత్రమైన కాలంలో ఉన్నాం. ప్రపంచ ఆర్థిక మార్కెట్లన్నీ ఇప్పుడు ఒకే ఒక్క వ్యక్తి ఇష్టాఇష్టాల మీద ఆధారపడి నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ వ్యక్తి ఏ మూడ్‌లో నిద్రలేచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే అంశమే మార్కెట్లను శాసిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitics), కీలక పాలసీ నిర్ణయాలు వెలువడుతున్న తరుణంలో మార్కెట్లు ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతాయో ఊహించడం నిపుణులకు కూడా కష్టతరంగా మారింది.

ట్రేడర్లు ఏం చేయాలి? కామత్ చిట్కాలు ఇవే:

ఇలాంటి అనిశ్చితి సమయంలో గెలుపు గుర్రాన్ని పట్టుకోవడం కంటే, రేసులో నిలబడటం ముఖ్యమని ఆయన వివరించారు. ట్రేడర్లు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను ఆయన సూచించారు:

  • రిస్క్ తగ్గించుకోండి: మీ ట్రేడింగ్ పరిమాణాన్ని (Trade Size) భారీగా తగ్గించండి. ఎక్కువ పెట్టుబడితో రిస్క్ తీసుకోవద్దు.
  • ఓవర్‌నైట్ పొజిషన్లు వద్దు: మార్కెట్ ముగిసిన తర్వాత వచ్చే వార్తల ప్రభావం మరుసటి రోజు భారీగా ఉంటుంది. అందుకే పొజిషన్లను తదుపరి రోజుకు క్యారీ ఫార్వార్డ్ చేయకపోవడమే మంచిది.
  • అవకాశం కోసం వేచి చూడండి: మార్కెట్ ఒక స్థిరమైన దిశను పట్టుకునే వరకు వేచి ఉండాలి. అనవసరంగా దూకుడు ప్రదర్శించి చేతులు కాల్చుకోవద్దు.

వరుస సెలవుల సెటప్.. మరింత రిస్క్

ట్రేడింగ్ అనేది నిరంతరం ఒత్తిడితో కూడుకున్న పని అని, లాభనష్టాల లెక్కలు మనిషిని మానసికంగా కుంగదీస్తాయని కామత్ అన్నారు. "ట్రేడింగ్ అనేది ప్రాథమికంగా ఒక ఒంటరి పోరాటం. నిరంతరం స్క్రీన్ల వైపు చూస్తూ గడిపితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఈ లాంగ్ వీకెండ్ సమయంలో ట్రేడింగ్‌కు కాస్త విరామం ఇచ్చి, రీఛార్జ్ అవ్వడం మంచిది" అని ఆయన హితవు పలికారు.

స్టాక్ మార్కెట్ సెలవుల వివరాలు:

భారతీయ స్టాక్ మార్కెట్లు (BSE, NSE) రానున్న రోజుల్లో ఈ క్రింది తేదీల్లో మూతపడనున్నాయి:

  • మార్చి 26 (గురువారం): శ్రీరామ నవమి సందర్భంగా సెలవు.
  • మార్చి 31 (మంగళవారం): మహావీర్ జయంతి సందర్భంగా సెలవు.
  • ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్లకు సెలవు.

సెలవుల కారణంగా ట్రేడింగ్ సెషన్లు తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్‌లో వోలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నితిన్ కామత్ సందేశం సారాంశం.

(గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.)

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe