FASTag : టోల్ ప్లాజాల దగ్గర ఇక నో క్యాష్- నేటి నుంచే కొత్త రూల్ అమలు, ఎందుకంటే..
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక వార్త చెప్పింది. టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి పలికేందుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 10, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల వల్ల ప్రయాణంలో కీలక మార్పులు రానున్నాయి.
నేషనల్ హైవేలపై ప్రయాణం మరింత వేగవంతం కానుంది. టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే రోజులకు కాలం చెల్లనుంది. భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) టోల్ వసూళ్ల వ్యవస్థను పూర్తి డిజిటలైజ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజా ప్రతిపాదన ప్రకారం, నేటి నుంచి (2026 ఏప్రిల్ 10) టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో చెల్లింపులను పూర్తిగా నిలిపివేయనున్నారు.
ఎందుకు ఈ కఠిన నిర్ణయం?
ప్రస్తుతం దేశంలో టోల్ వసూళ్లలో దాదాపు 98 శాతం లావాదేవీలు ఫాస్టాగ్ ద్వారానే సాగుతున్నాయి. కేవలం 2 శాతం మాత్రమే నగదు లేదా యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. అయితే, ఈ స్వల్ప శాతం వాహనాల వల్లే టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరుగుతోందని ఎన్హెచ్ఏఐ గుర్తించింది.
ప్రస్తుతం నగదు రూపంలో టోల్ చెల్లిస్తే రెట్టింపు రుసుము వసూలు చేస్తున్నారు. యూపీఐ చెల్లింపులకు కూడా సాధారణ ధర కంటే 1.25 రెట్లు అదనంగా భారం వేస్తున్నారు. అయినప్పటికీ నగదు వాడకం వల్ల సమయం వృథా అవుతుండటంతో, దీనిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు.
ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు..
నగదు రహిత టోల్ విధానం వల్ల సామాన్యులకు అనేక లాభాలు చేకూరనున్నాయి:
ట్రాఫిక్ కష్టాలకు చెక్: టోల్ గేట్ల వద్ద చిల్లర కోసం వెతుక్కోవడం, రసీదు తీసుకోవడం వంటి పనుల వల్ల సమయం వృథా కాదు. దీనివల్ల రద్దీ సమయాల్లోనూ వాహనాలు వేగంగా వెళ్లిపోవచ్చు.
తగ్గిన వెయిటింగ్ పీరియడ్: 2022-23 లెక్కల ప్రకారం, టోల్ ప్లాజాల వద్ద వెయిటింగ్ సమయం 734 సెకన్ల నుంచి 47 సెకన్లకు తగ్గింది. ఈ కొత్త రూల్తో ఇది మరింత దిగొస్తుంది.
పారదర్శకత: డిజిటల్ చెల్లింపుల వల్ల చిల్లర సమస్యలు తలెత్తవు. అలాగే వసూళ్లలో అవకతవకలకు తావుండదు.
అలా చేస్తే ఫ్రీగా రూ. 1000 క్రెడిట్ చేస్తారు!
భారతదేశంలో హైవే ప్రయాణాల సమయంలో ప్రజల సౌకర్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల దగ్గర ఉన్న అపరిశుభ్ర టాయిలెట్లను ఫిర్యాదు చేసిన వారికి, వారి ఫాస్టాగ్లో రూ. 1000 రివార్డు లభించే విధంగా చర్యలు తీసుకోనుంది.
పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
2026 చివరికి 'బారియర్ లెస్' ప్రయాణం..
మరోవైపు హైవే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఎన్హెచ్ఏఐ 'బారియర్-ఫ్రీ' (అడ్డంకులు లేని) టోల్ వసూళ్ల వ్యవస్థపై కసరత్తు చేస్తోంది. 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద గేట్లు లేదా అడ్డంకులు ఉండవు. వాహనాలు వేగంగా వెళుతున్నప్పుడే ఆటోమేటిక్గా టోల్ కట్ అవుతుంది. దీని కోసం అధునాతన కెమెరాలు, జీపీఎస్ ఆధారిత సాంకేతికతను వినియోగించనున్నారు.
"ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే మా లక్ష్యం. ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లలో సాధించిన పురోగతిని మరింత బలోపేతం చేసేందుకు ఈ మార్పులు అవసరం," అని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
ఫాస్టాగ్ లేకపోతే కష్టమే!
ఇప్పటికే మీ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే వెంటనే తీసుకోవడం ఉత్తమం. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికతతో పనిచేస్తుంది. బ్యాంక్ ఖాతా లేదా వాలెట్ నుంచి నేరుగా డబ్బులు కట్ అవుతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 750కి పైగా టోల్ ప్లాజాల్లో ఈ సదుపాయం ఉంది.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు ఎప్పటి నుంచి నిలిచిపోతాయి?
ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం, 2026 ఏప్రిల్ 10వ తేదీ నుంచి నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది.
2. బారియర్-లెస్ టోల్ అంటే ఏంటి?
ఇందులో టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేదు. వాహనం నంబర్ ప్లేట్ లేదా జీపీఎస్ ఆధారంగా మీరు ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ రుసుము ఆటోమేటిక్గా కట్ అవుతుంది.
3. ఫాస్టాగ్ వల్ల ప్రయోజనం ఏంటి?
ఇది సమయాన్ని ఆదా చేస్తుంది, ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. ఆన్లైన్ ద్వారా సులభంగా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


