...
...
Next Story

ఎన్‌పీఎస్ కొత్త విత్ డ్రా రూల్స్: 'రిస్' స్కీమ్‌తో నెలనెలా పెన్షన్

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారుల కోసం పిఎఫ్‌ఆర్‌డిఎ (PFRDA) సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. రిటైర్మెంట్ ఇన్‌కమ్ స్కీమ్ (RIS) ద్వారా పదవీ విరమణ తర్వాత కూడా నిధిని ఇన్వెస్ట్ చేస్తూనే, ఆకర్షణీయమైన నెలవారీ ఆదాయం పొందే వీలు కలుగుతుంది.

Published on: Jul 11, 2026 09:05 PM IST
Advertisement

నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)ను చందాదారులకు మరింత అనుకూలంగా, సరళంగా మార్చేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) కాలక్రమేణా పలు మార్పులు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే చందాదారుల ఎగ్జిట్ (పదవీ విరమణ), విత్‌డ్రా ఆప్షన్లకు సంబంధించి సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. చందాదారులు తమ పదవీ విరమణ తర్వాతి కాలంలో క్రమబద్ధమైన ఆదాయాన్ని పొందేందుకు వీలుగా 'రిటైర్మెంట్ ఇన్‌కమ్ స్కీమ్' (RIS), డ్రాడౌన్ (విత్‌డ్రా) ఆప్షన్లను ప్రవేశపెట్టింది.

అసలు రిటైర్మెంట్ ఇన్‌కమ్ స్కీమ్ (RIS) అంటే ఏమిటి?

ఎన్‌పీఎస్ కొత్త విత్ డ్రా రూల్స్: 'రిస్' స్కీమ్‌తో నెలనెలా పెన్షన్
ఎన్‌పీఎస్ కొత్త విత్ డ్రా రూల్స్: 'రిస్' స్కీమ్‌తో నెలనెలా పెన్షన్

ఎన్‌పీఎస్ గడువు ముగిసిన తర్వాత చందాదారులు తమ మొత్తం నిధి నుంచి 80 శాతం వరకు ఒకేసారి (Lumpsum) విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. ఈ నిధిని ఒకేసారి కాకుండా దశలవారీగా విత్‌డ్రా చేసుకునేందుకు 'రిస్' (RIS) పథకం చందాదారులకు వీలు కల్పిస్తుంది. ఇందుకోసం రెండు రకాల డ్రాడౌన్ ఆప్షన్లను ఎంచుకునే వెసులుబాటును ఇచ్చింది.

పదవీ విరమణ చేసిన తర్వాత చందాదారులకు అందే క్రమబద్ధమైన చెల్లింపులను మరింత మెరుగుపరచడమే ఈ డ్రాడౌన్ ఆప్షన్ల ప్రధాన ఉద్దేశం. ఈ విధానం వల్ల చేతికి వచ్చే నగదుపై స్పష్టత ఉండటమే కాకుండా, మిగిలిన నిధి మార్కెట్లో ఇన్వెస్ట్ అయి ఉండటం వల్ల దాని విలువ నిరంతరం పెరుగుతుంది. తద్వారా డ్రాడౌన్ గడువు ముగియక ముందే నిధి పూర్తిగా ఖర్చయిపోయే ప్రమాదం తప్పుతుంది. ఈ డ్రాడౌన్ సదుపాయం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతర చందాదారులందరికీ అందుబాటులో ఉంటుంది. చందాదారులు తమ ప్రాధాన్యతను బట్టి 85 ఏళ్ల వయసు వచ్చే వరకు నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన ఈ చెల్లింపులను అందుకోవచ్చు.

'రిస్ స్టెడీ' (RIS Steady) ఎలా పనిచేస్తుంది?

60 ఏళ్ల వయసులో: చందాదారుడి పెట్టుబడిలో 35 శాతం ఈక్విటీ (E) కి, 10 శాతం కార్పొరేట్ బాండ్లకు (C), 55 శాతం ప్రభుత్వ సెక్యూరిటీలకు (G) కేటాయిస్తారు.

ఈక్విటీ కేటాయింపులు: ప్రతి ఏటా ఈక్విటీ కేటాయింపులు 2 శాతం చొప్పున తగ్గుతూ వస్తాయి. చందాదారుడికి 70 ఏళ్లు వచ్చేసరికి ఇది 15 శాతానికి చేరుతుంది. ఆ తర్వాతి 5 ఏళ్లలో ఏడాదికి 1 శాతం చొప్పున తగ్గి 75 ఏళ్ల వయసు నాటికి 10 శాతానికి పరిమితమవుతుంది. ఆపై ఇది 10 శాతం వద్దే స్థిరంగా కొనసాగుతుంది.

కార్పొరేట్ బాండ్లు: ప్రతి సంవత్సరం 1 శాతం చొప్పున పెరుగుతూ 70 ఏళ్ల వయసు నాటికి 20 శాతానికి చేరుతుంది. 75 ఏళ్ల వయసు వరకు 20 శాతం వద్దే స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఏటా 1 శాతం చొప్పున తగ్గుతూ 80 ఏళ్లకు 15 శాతానికి చేరుకుంటుంది.

ప్రభుత్వ సెక్యూరిటీలు: ప్రతి సంవత్సరం 1 శాతం చొప్పున పెరుగుతూ చందాదారుడికి 80 ఏళ్లు వచ్చేసరికి గరిష్టంగా 75 శాతానికి చేరుకుంటుంది.

ప్రతి సంవత్సరం చందాదారుడి పుట్టినరోజున, ఆ సమయానికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా వారి వయసుకు అనుగుణంగా ఈ నిధిని తిరిగి సర్దుబాటు (Asset Rebalancing) చేస్తారు.

డబ్బులు చేతికి వచ్చే రెండు మార్గాలు ఇవే..

రిస్ స్టెడీ కింద నిధి ఎలా ఇన్వెస్ట్ అవుతుందో చూశాం. ఇప్పుడు చందాదారులు తమ డబ్బును వెనక్కి తీసుకునేందుకు ఉన్న రెండు కీలక ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.

1. సిస్టమాటిక్ పేఅవుట్ రేట్ (SPR)

ఇది డిఫాల్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. అంటే చందాదారుడు ఏ ఆప్షన్ ఎంచుకోకపోతే దీని ఆధారంగానే చెల్లింపులు జరుగుతాయి. ఈ విధానంలో సేకరించిన నిధి నుంచి నిర్ణీత శాతాన్ని చందాదారుడికి చెల్లిస్తారు. చందాదారుడి ప్రస్తుత వయసు, డ్రాడౌన్ ముగిసే వయసు ఆధారంగా ఈ రేటును లెక్కిస్తారు. చందాదారుడి పుట్టినరోజు నాటి మార్కెట్ విలువపై ఆ వయసుకు వర్తించే ఎస్‌పీఆర్ రేటు ప్రకారం ఆ సంవత్సరానికి సంబంధించిన క్రమబద్ధమైన చెల్లింపులను ఖరారు చేస్తారు. ప్రతి సంవత్సరం పుట్టినరోజున ఈ రేటు రీసెట్ అవుతుంది. చందాదారులు తమ వీలును బట్టి నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన డబ్బులు తీసుకోవచ్చు.

2. సిస్టమాటిక్ యూనిట్ రిడెంప్షన్ (SUR)

ఈ ఆప్షన్‌లో ఎంచుకున్న డ్రాడౌన్ కాలపరిమితి ఆధారంగా సమాన సంఖ్యలో యూనిట్లను విక్రయించి (Redeem) నగదును అందిస్తారు.

ఉదాహరణకు ఒక చందాదారుడి వద్ద రూ.10 నెట్ అసెట్ వాల్యూ (NAV) చొప్పున రూ.80 లక్షల విలువైన 8,00,000 యూనిట్లు ఉన్నాయనుకుందాం. ఆయన 25 ఏళ్ల డ్రాడౌన్ గడువుతో నెలవారీ పేఅవుట్ ఆప్షన్ ఎంచుకున్నారు.

ఈ సందర్భంలో 25 ఏళ్లకు గాను మొత్తం 300 నెలవారీ పేఅవుట్లు (25 ఏళ్లు x 12 నెలలు) వస్తాయి. అంటే ప్రతి నెల 2,666.67 యూనిట్లను (8 లక్షల యూనిట్లు / 300 పేఅవుట్లు) విక్రయిస్తారు. ఆ నెలలో ఉన్న ఎన్‌ఏవీ (NAV) ధరను బట్టి నెలవారీ చెల్లింపు చందాదారుడి ఖాతాలో జమ అవుతుంది. అందుకే ఎన్‌ఏవీ హెచ్చుతగ్గులను బట్టి నెలవారీ వచ్చే ఆదాయం మారుతుంటుంది. ఎన్‌ఏవీ ఎక్కువగా ఉంటే ఆ నెల ఎక్కువ డబ్బు, తక్కువగా ఉంటే తక్కువ డబ్బు వస్తుంది.

పెన్షనర్లకు చేకూరే భారీ ప్రయోజనం

"పిఎఫ్‌ఆర్‌డిఎ తీసుకొచ్చిన ఈ కొత్త చొరవ వల్ల చందాదారులకు పదవీ విరమణ తర్వాత మరింత మెరుగైన, సౌకర్యవంతమైన ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఒకవైపు నెలవారీ అవసరాలకు డబ్బులు అందుతూనే, మిగిలిన నిధి మార్కెట్లో ఇన్వెస్ట్ అయి ఉండటం వల్ల నిరంతరం పెరుగుతూనే ఉంటుంది" అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం మన దేశంలో సగటు ఆయుర్దాయం 72 ఏళ్లుగా ఉంది. ఈ పథకం 85 ఏళ్ల వయసు వరకు చెల్లింపులు జరుపుతుంది కాబట్టి రిటైర్మెంట్ జీవితానికి ఇది చక్కటి భరోసా ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా 85 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవిస్తే, వారు ఇతర ఆదాయ వనరులను చూసుకోవాల్సి ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON