...
...
Next Story

UGC NET june 2026 : యూజీసీ నెట్ అభ్యర్థులకు అలర్ట్! 3 పేపర్లు రద్దు.. ఈ తేదీల్లో రీ-టెస్ట్

UGC NET re test: జూన్‌లో నిర్వహించిన యూజీసీ-నెట్ పరీక్షల్లోని 3 పేపర్లలో అనేక తప్పులు దొర్లడంతో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లను రద్దు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను త్వరలో మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Published on: Aug 17, 2026, 06:01:36 IST
Advertisement

ఈ ఏడాది జూన్ 22 నుంచి జూన్ 30 వరకు నిర్వహించిన యూజీసీ-నెట్ పరీక్షా పత్రాల్లో అనేక తప్పులు దొర్లడంతో, మూడు సబ్జెక్టుల పరీక్షలను మళ్లీ నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఈ ఏడాది మే 3న జరగాల్సిన నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదం తర్వాత, ఎన్టీఏ మరో ప్రధాన పరీక్షను రద్దు చేయడం ఇదే మొదటిసారి.

యూజీసీ నెట్ పరీక్షా కేంద్రం వద్ద దృశ్యం..
యూజీసీ నెట్ పరీక్షా కేంద్రం వద్ద దృశ్యం..

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ యూజీసీ నెట్ పరీక్షను నిర్వహిస్తారు.

3 పేపర్లలో అనేక తప్పులు..

యూజీసీ నెట్ జూన్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ ప్రశ్నపత్రాలపై వచ్చిన అనేక ఫిర్యాదులను పరిశీలించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ తెలిపింది. ఈ మూడు పేపర్లలో వాస్తవ సంబంధిత, ముద్రణా పరమైన, అనువాద లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించిందని పేర్కొంది. ప్రముఖ విద్వాంసుల పేర్లలో తప్పులు, పుస్తకాల పేర్లు తప్పుగా ముద్రించడం, ప్రశ్నల వాక్య నిర్మాణంలో లోపాలు, వ్యాకరణ దోపాలు, కాల, వచన సంబంధిత తప్పులు, విరామ చిహ్నాల పొరపాట్లు, పాత ప్రశ్నల రిపీటేషన్ వంటి అనేక సమస్యలు ఉన్నాయని తెలిపింది. నిష్పక్షపాతంగా, ఎలాంటి తప్పులు లేకుండా పరీక్షను నిర్వహించేందుకు ఈ మూడు పేపర్లను మళ్లీ నిర్వహించాలని కమిటీ సిఫారసు చేసిందని వెల్లడించింది.

పరీక్షలు.. మళ్లీ ఎప్పుడు?

తాజాగా వెలువడిన ప్రకటన ప్రకారం.. సెప్టెంబర్ 9న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ పరీక్ష, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కామర్స్ పరీక్ష జరుగుతాయి. సెప్టెంబర్ 10న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సోషియాలజీ పరీక్ష నిర్వహిస్తామని ఏజెన్సీ తెలిపింది. పరీక్ష కేంద్రాలు, నగరాలు, అడ్మిట్ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని పేర్కొంది. ఈ మూడు సబ్జెక్టుల అభ్యర్థుల నుంచి ఎలాంటి అదనపు పరీక్ష ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేసింది.

ప్రతి సబ్జెక్టులో డజనుకు పైగా ప్రశ్నలను తొలగించి విద్యార్థులను ఆందోళనకు గురిచేయడం కంటే, ఆ మూడు సబ్జెక్టుల పరీక్షలను పూర్తిగా మళ్లీ నిర్వహించడమే మేలని ఎన్టీఏ నిర్ణయించిందని ఆయన తెలిపారు.

యూజీసీ-నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 లో టీచింగ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2 లో సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.

ఈ మూడు సబ్జెక్టుల పరీక్షల్లో తప్పులు, పదేపదే ఒకే రకమైన ప్రశ్నలు రావడంపై పలువురు ముందే అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. సోషియాలజీ పరీక్షకు ముందు రోజు చేతితో రాసిన ప్రశ్నలతో కూడిన 100 పేజీల పీడీఎఫ్ సర్క్యులేట్ అయిందని, అందులోని దాదాపు 90 ప్రశ్నలు, జవాబులు అసలు పేపర్‌తో సరిపోలాయని హిందుస్తాన్ టైమ్స్ గతంలోనే రిపోర్ట్ చేసింది.

ఇంగ్లీష్ పేపర్‌లో 150 ప్రశ్నల్లో 60కి పైగా ప్రశ్నలు 2024 పరీక్షలో అవే ప్రశ్నలుగా ఉన్నాయని, జవాబుల క్రమం కూడా మారలేదని అభ్యర్థులు ఆరోపించారు.

కాగా మళ్లీ పరీక్ష అనగానే అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ చదవడం, పరీక్ష కేంద్రాలకు ప్రయాణించడం భారంగా మారిందని వారు వాపోతున్నారు.

అభ్యర్థుల ఆందోళన..

జూన్‌లో యూజీసీ-నెట్ ఇంగ్లీష్ పరీక్ష రాసిన పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌కు చెందిన ఒక అభ్యర్థి మాట్లాడుతూ, "ఇది పెద్ద ఒత్తిడిలా అనిపిస్తోంది. నా తప్పు లేకపోయినా ఎన్టీఏ, దాని వ్యవస్థ వైఫల్యం వల్ల మేం ఎందుకు ఈ సమస్యలను ఎదుర్కోవాలి?" అని ప్రశ్నించారు.

జూన్ పరీక్ష కోసం సుమారు 450 కిలోమీటర్లు ప్రయాణించి బర్ధమాన్ వెళ్లానని, ప్రస్తుతం సెప్టెంబర్ 6న జరగనున్న సీటీఈటీతో పాటు ఇతర పరీక్షల కోసం సిద్ధమవుతున్నానని ఆయన చెప్పారు. ఎన్టీఏ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సెప్టెంబర్ 9 నాటి యూజీసీ-నెట్ పరీక్షపై మళ్లీ దృష్టి పెట్టడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. ఏజెన్సీ ఆదివారం 87 సబ్జెక్టులలో 84 సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు ఆగస్టు 18 వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలు తెలపవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe