Road accidents in India : రోడ్డు ప్రమాదాలపై షాకింగ్ రిపోర్టు- ప్రతి గంటకు 21 మంది మృతి!

దేశంలో రోడ్డు ప్రమాదాల నివేదికను లోక్‌సభ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నివేదిక చాలా ఆందోళనకరంగా ఉంది. 2024తో పోల్చితే 2025లో ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు డేటా వెల్లడి.

Published on: Jul 24, 2026, 11:21:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రోడ్డు భద్రతపై ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా, కఠిన చట్టాలు తెస్తున్నా.. భారత్‌లో రహదారి ప్రమాదాల రక్తపాతం ఆగడం లేదు. గతేడాది (2025) దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల ఘోర గణాంకాలు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ చేదు నిజాలను వెల్లడించారు.

ఇండియాలో రోడ్డు ప్రమాదాలు.. ప్రతి గంటకు 21 మంది మృతి!
ఇండియాలో రోడ్డు ప్రమాదాలు.. ప్రతి గంటకు 21 మంది మృతి!

షాకింగ్ గణాంకాలు: ప్రతి గంటకూ 21 మరణాలు!

గడ్కరీ సమర్పించిన డేటా ప్రకారం — 2025లో దేశ వ్యాప్తంగా నమోదైన రోడ్డు ప్రమాదాల సరళి ఇలా ఉంది:

మొత్తం మరణాలు: గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 1,83,382 మంది ప్రాణాలు కోల్పోయారు.

రోజువారీ మరణాలు: సగటున రోజుకు 502 మంది రహదారులపై బలయ్యారు.

ప్రతి గంటకు : గంటకు సగటున 21 మంది ప్రమాదాల్లో కన్నుమూశారు.

ప్రమాదాల సంఖ్య నమోదు: దేశవ్యాప్తంగా మొత్తం 5,13,563 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5.30% పెరుగుదలను సూచిస్తోంది.

సగటున గంటకు ప్రమాదాలు: దేశంలో ప్రతి గంటకు సగటున 59 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

రాష్ట్రాల వారీగా పరిస్థితి ఇలా..

ప్రమాదాల నమోదులో తమిళనాడు అత్యధికంగా 71,387 కేసులతో మొదటి స్థానంలో నిలవగా, అత్యధిక మరణాలు నమోదైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ (27,550 మరణాలు) నిలిచింది.

దేశంలో జరుగుతున్న ప్రమాదాల్లో మెజారిటీ ద్విచక్ర వాహనదారులకే (టూ వీలర్స్) చెందుతున్నాయని, అతి వేగం, హెల్మెట్ వాడకపోవడం, అజాగ్రత్త వంటి రకరకాల కారణాలు ఈ విషాదాలకు దారితీస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

ఏడాదికేడాది పెరుగుతున్న ప్రమాదాల ఉధృతి..

గత కొన్నేళ్ల కేంద్ర రవాణా శాఖ డేటాను పరిశీలిస్తే, పరిస్థితి తీవ్రత స్పష్టమవుతుంది:

2023లో: 4,80,583 ప్రమాదాలు జరగ్గా.. 1,72,890 మంది మరణించారు, 4,62,825 మంది గాయపడ్డారు.

2024లో: 4,87,707 ప్రమాదాలు నమోదు కాగా.. 1,77,175 మంది ప్రాణాలు కోల్పోయారు.

2025లో: ఈ సంఖ్య ఏకంగా 5.13 లక్షల ప్రమాదాలకు, 1.83 లక్షల మరణాలకు చేరింది.

కేంద్రం చేపట్టిన ‘4ఈ’ వ్యూహం

ఈ ఆందోళనకర పరిస్థితులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు ముఖ్యమైన స్థంభాల (4ఈ స్ట్రాటజీ) ప్రాతిపదికన బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోందని నితిన్ గడ్కరీ వివరించారు:

Education (విద్య - అవగాహన): వాహనదారులకు రోడ్డు నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించడం.

Engineering (ఇంజనీరింగ్): రహదారులు, వాహనాల రూపకల్పనలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు పాటించడం.

Enforcement (అమలు): ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం.

Emergency Care (అత్యవసర వైద్య సంరక్షణ): ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు త్వరితగతిన వైద్య సహాయం అందించడం.

ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ, రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతతో ప్రవర్తించినప్పుడే ఈ ప్రాణ నష్టాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది.

రాత్రి ఆ ఒక్క గంటలోనే ప్రమాదాలు అధికం!

మరోవైపు దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (ఐఆర్​ఎస్​ఆర్) 2026 మరిన్ని కీలక వివరాలను బయటపెట్టింది. భారతదేశంలో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య సమయం.. డ్రైవింగ్ చేయడానికి రోజులోనే అత్యంత ప్రమాదకరమైన సమయమని రిపోర్టు స్పష్టం చేసింది.

ఇక మహిళల డ్రైవింగ్‌పై సమాజంలో ఉండే పాతకాలపు అపోహలను ఈ నివేదిక పటాపంచలు చేసింది. సురక్షితమైన డ్రైవింగ్ విషయంలో స్త్రీ, పురుషుల మధ్య అసలు తేడాయే లేదని టెలిమెట్రీ డేటా స్పష్టం చేసింది. ఈ విశ్లేషణలో మహిళలు సగటున 92.86 డ్రైవింగ్ స్కోరు సాధించగా, పురుషులు 92.43 స్కోరుతో వారికి సమానంగా నిలిచారు. అంటే, పురుషుల కన్నా మహిళలే ఇంకాస్త సేఫ్​ డ్రైవర్స్​!

రిపోర్టులోని పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More