Road Safety Report : సేఫ్టీ రిపోర్ట్లో సంచలన విషయాలు.. దేశంలో ఆ ఒక్క గంటలోనే ప్రమాదాలు అధికం!
India Road Safety Report 2026 : భారతదేశంలో రాత్రి 1 గంట సేపు డ్రైవింగ్కు అత్యంత ప్రమాదకరమని జునో రోడ్ సేఫ్టీ రిపోర్ట్ 2026 వెల్లడించింది. అంతేకాదు డ్రైవింగ్ అలవాట్లు, స్త్రీ-పురుషుల డ్రైవింగ్, మధ్యాహ్నం వేళ సురక్షిత ప్రయాణం వంటి వాటికి సంబంధించిన కీలక విషయాలను సైతం ఈ రిపోర్టు బయటపెట్టింది.
మీరు నిత్యం రాత్రి వేళల్లో వాహనాలు నడుపుతుంటారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. భారతదేశంలో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య సమయం.. డ్రైవింగ్ చేయడానికి రోజులోనే అత్యంత ప్రమాదకరమైన సమయమని ఒక సమగ్ర అధ్యయనం వెల్లడించింది. జునో జనరల్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన ‘ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (ఐఆర్ఎస్ఆర్) 2026’ ప్రకారం.. రాత్రి 8 గంటల తర్వాత వాహనదారుల డ్రైవింగ్ స్కోర్లు వేగంగా పడిపోతున్నాయి. దీనివల్ల మధ్యాహ్న సమయంతో పోలిస్తే రాత్రి వేళల్లో ప్రయాణాల రిస్క్ బాగా పెరుగుతోంది. అదే సమయంలో, రోడ్లపై ప్రయాణించడానికి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య సమయం అత్యంత సురక్షితమైనదని ఈ నివేదిక పేర్కొంది.

జునో స్మార్ట్డ్రైవ్ యాప్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. దేశంలోని 17 రాష్ట్రాల్లో దాదాపు 5.5 కోట్ల కిలోమీటర్ల మేర సాగిన 45 లక్షల ప్రయాణాలను, వాహనదారుల ప్రవర్తనను విశ్లేషించి ఈ విషయాలను వెల్లడించారు.
డ్రైవింగ్ సీట్లో పురుషులు వర్సెస్ మహిళలు..
మహిళల డ్రైవింగ్పై సమాజంలో ఉండే పాతకాలపు అపోహలను ఈ నివేదిక పటాపంచలు చేసింది. సురక్షితమైన డ్రైవింగ్ విషయంలో స్త్రీ, పురుషుల మధ్య అసలు తేడాయే లేదని టెలిమెట్రీ డేటా స్పష్టం చేసింది. ఈ విశ్లేషణలో మహిళలు సగటున 92.86 డ్రైవింగ్ స్కోరు సాధించగా, పురుషులు 92.43 స్కోరుతో వారికి సమానంగా నిలిచారు. అంటే, పురుషుల కన్నా మహిళలే ఇంకాస్త సేఫ్ డ్రైవర్స్!
భారతీయ వాహనదారుల్లో అసలు లోపాలు ఎక్కడ?
మన దేశంలో రోడ్డు ప్రమాదాలకు వాతావరణం కంటే, డ్రైవర్ల ప్రవర్తనే 80 శాతానికి పైగా కారణమవుతోందని ఈ నివేదిక తేల్చింది. హఠాత్తుగా బ్రేకులు వేయడం (దీని స్కోరు 87), ఒక్కసారిగా వేగాన్ని పెంచడం (దీని స్కోరు 91) అనేవి మన దేశ వాహనదారుల్లో ప్రధాన బలహీనతలుగా తేలాయి. విశేషం ఏంటంటే.. భారీ వర్షాలు కురిసే వర్షాకాలం గానీ, దట్టమైన పొగమంచు కమ్మే చలికాలం గానీ వాహనదారుల డ్రైవింగ్ స్కోర్లపై పెద్దగా ప్రభావం చూపడం లేదు! ఏడాది పొడవునా ఈ స్కోర్లు ఒకేలా ఉంటున్నాయి.
భారత్లో రోడ్డు ప్రమాదాల తీవ్రత..
దేశంలో రోడ్డు భద్రత ఎంతటి ఆందోళనకరంగా ఉందో ఈ నివేదిక మరోసారి కళ్లకు కట్టింది. భారతదేశంలో ఏటా సుమారు 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ప్రపంచవ్యాప్త మరణాలలో దాదాపు 11 శాతానికి సమానం. దీనివల్ల దేశ జీడీపీలో 3 నుంచి 5 శాతం మేర భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోంది.
ఈ ప్రమాదాల్లో రోడ్లపై వెళ్లే అత్యంత బలహీనమైన వర్గాలే ఎక్కువగా బలవుతున్నారు. రోడ్డు ప్రమాద మరణాల్లో టూ వీలర్ వాహనదారులు 44 శాతం ఉండగా, కాలినడకన వెళ్లే పాదచారులు 19 శాతంగా ఉన్నారు.
స్టాక్హోమ్ డిక్లరేషన్ ప్రకారం 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో జునో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ షనాయ్ ఘోష్ మాట్లాడుతూ.. "కేవలం రోడ్ల మౌలిక సదుపాయాలను మెరుగుపరిస్తే సరిపోదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ వాహనదారుల డ్రైవింగ్ ప్రవర్తన, అలవాట్లలో మార్పులు తీసుకురావడం ఎంతో అవసరం," అని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


