...
...
Next Story

మళ్లీ రూపాయి పతనం- జీవితకాల కనిష్టానికి! స్టాక్​ మార్కెట్​ కూడా డౌన్​..

భారత రూపాయికి మరో షాక్! డాలర్‌తో పోలిస్తే చారిత్రక కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. దీని కారణంగా స్టాక్​ మార్కెట్​ సైతం నష్టాల్లో కొనసాగుతోంది. రూపాయి పతనానికి అసలు కారణం ఏంటి? ఈ స్టాక్​ మార్కెట్​ ఫాల్​లో ఏ స్టాక్స్​పై ఫోకస్​ చేయాలి? వంటి అంశాలపై నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 16, 2025, 09:35:16 IST
Advertisement

భారత రూపాయి విలువ పతనమవుతూనే ఉంది! భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో వరుసగా నాలుగో రోజు, డిసెంబర్​ 16న కూడా రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయికి చేరింది.

కొత్త రికార్డు కనిష్టం వద్ద రూపాయి..

జీవితకాల కనిష్ఠానికి రూపాయి విలువ.. (Reuters)
జీవితకాల కనిష్ఠానికి రూపాయి విలువ.. (Reuters)

రూపాయి విలువ జీవితకాల కనిష్ట స్థాయి అయిన 90.82కు పడిపోయింది. సోమవారం నాడు నమోదైన 90.78 అనే రికార్డు కనిష్ట స్థాయిని కూడా ఇది అధిగమించింది.

అమెరికా విధించిన భారీ సుంకాలు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడం ఈ పతనానికి ముఖ్య కారణం. ప్రస్తుతం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం లేని ఏకైక పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమే!

మరోవైపు నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ మార్కెట్‌లో గడువు ముగుస్తున్న పొజిషన్ల కారణంగా డాలర్‌కు డిమాండ్ పెరగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్​ఐఐ) నిరంతర నిధుల తరలింపు వంటివి మరిన్ని కారణాలు అని నిపుణులు చెబుతున్నారు.

ఈ సంవత్సరంలో ఇప్పటివరకు, భారత రూపాయి ఆసియాలోనే అత్యంత బలహీనమైన పనితీరును కనబరిచిన కరెన్సీగా నిలిచింది! అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ, ఈ ఏడాదిలో ఏకంగా 6% వరకు తగ్గింది.

స్టాక్ మార్కెట్‌పై ప్రభావం..

రూపాయి పతనం దేశీయ స్టాక్​ మార్కెట్​ని ప్రభావితం చేస్తోంది. ఏడాది మొత్తం నష్టాలు చూసిన సూచీలు, ఇటీవలే లాభాల్లోకి వచ్చాయి. కానీ రూపాయి పతనంతో పాటు ఇతర కారణాల వల్ల భారతదేశ 5.2 ట్రిలియన్​ డాలర్ల స్టాక్​ మార్కెట్​ రికవరీ ముప్పులో పడింది. రూపాయి బలహీనత కారణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్ అనిశ్చితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

బెంచ్‌మార్క్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ నవంబర్‌లో ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత, తిరిగి వెనక్కి తగ్గి, కొంత నష్టాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా డిసెంబర్‌లో, అంతర్జాతీయ ఫండ్‌లు భారతీయ ఈక్విటీల నుంచి ఏకంగా సుమారు రూ. 13 వేల కోట్లు వెనక్కి తీసుకున్నాయి. దీనికి ముందు రెండు నెలల్లో వచ్చిన 1.3 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం పూర్తిగా ఆవిరైపోయింది! విదేశీ పెట్టుబడిదారులు ఈక్విటీల నుంచే కాకుండా, స్థానిక డెట్​ మార్కెట్ నుంచి కూడా తమ డబ్బును ఉపసంహరించుకున్నారు. ఫలితంగా మొత్తం మార్కెట్​లో నెగిటివ్​ సెంటిమెంట్​ మొదలైంది.

ఛాయిస్ వెల్త్ రీసెర్చ్ అధిపతి అక్షత్ గార్గ్‌ మాట్లాడుతూ, "విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలు, రుణాల నుంచి తమ పెట్టుబడులను తగ్గించడం కొనసాగించారు. ఫలితంగా డాలర్ల రూపంలో నిధులు స్థిరంగా బయటకు వెళుతున్నాయి," అని అన్నారు.

"ప్రపంచవ్యాప్త అనిశ్చితి, భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన మూలధన ప్రవాహ సవాళ్ల కలయికతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది," అని ఆయన చెప్పారు.

రూపాయి పడినా లాభపడే స్టాక్స్ ఇవే..!

రూపాయి విలువ బలహీనపడటం వల్ల విదేశాల్లో పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించే కంపెనీలకు, ముఖ్యంగా ఐటీ ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. రూపాయి నష్టాలు పెరిగిన కాలంలోనే, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ సెప్టెంబర్ చివరి నుంచి సుమారు 14% వృద్ధిని చూసింది.

సిస్టమ్యాటిక్స్ షేర్స్ అండ్ స్టాక్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ ధనంజయ సిన్హా అభిప్రాయం ప్రకారం.. బలహీనమైన రూపాయి, ప్రభుత్వం జారీ చేసే బాండ్లపై రేంజ్​ బౌండ్​ బాండ్​ యీల్డ్స్​, సాధారణ ఆదాయ వృద్ధి వంటి అంశాల కారణంగా ఈక్విటీలు రాబోయే రోజుల్లో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎంపిక చేసిన రంగాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది.

పడిపోతున్న రూపాయి విలువ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్, మెటల్ స్టాక్స్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. అయితే, ఇది బ్యాంకులు, ఇంధన ఉత్పత్తిదారులు, మౌలిక సదుపాయాల కంపెనీలకు నష్టాన్ని కలిగిస్తుందని వివరించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe