రికార్డుల వేటలో వెండి.. కిలో రూ. 2.54 లక్షలు దాటిన వైనం
ఈ ఏడాది వెండి ధర ఏకంగా 181% పెరిగి సరికొత్త రికార్డులను సృష్టించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో కిలో వెండి ధర ₹2.54 లక్షలు దాటిన తరుణంలో, ఇది పెట్టుబడికి సరైన సమయమా లేదా లాభాలు స్వీకరించి బయటకు రావాలా? అనే అంశాలపై నిపుణుల విశ్లేషణ ఇక్కడ చదవండి.
బంగారం కంటే వేగంగా పరుగులు పెడుతూ, ఈ ఏడాది అత్యుత్తమ రాబడిని ఇస్తున్న ఆస్తిగా వెండి నిలిచింది. సోమవారం (డిసెంబర్ 29) దేశీయ మార్కెట్లో వెండి ధర సరికొత్త చరిత్ర సృష్టించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కిలో వెండి ధర ఏకంగా 6 శాతం ఎగబాకి, మొదటిసారిగా రూ. 2,54,000 మార్కును అధిగమించింది.

ఎన్విడియాను మించిన వెండి ‘విలువ’
ప్రస్తుతం వెండి మార్కెట్ క్యాప్ 4.65 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉన్న టెక్ దిగ్గజం 'ఎన్విడియా' (4.63 ట్రిలియన్ డాలర్లు) మార్కెట్ విలువ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటి వరకు వెండి ఏకంగా 181 శాతం వృద్ధిని నమోదు చేసి, ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ఒక దశలో 80 డాలర్ల మార్కును దాటి 83.62 డాలర్ల వద్ద ఆల్-టైమ్ హైని తాకింది. అయితే, ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపడంతో స్వల్పంగా తగ్గి 78 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలివే..
వెండి ధరలకు ఈ స్థాయిలో రెక్కలు రావడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి:
పారిశ్రామిక డిమాండ్: సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ఎలక్ట్రానిక్స్ తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. మరోవైపు గత ఏడేళ్లుగా డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు కారణమైంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు: అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు వెండి, బంగారం వంటి లోహాలకు కలిసొచ్చాయి. 2026లో మరిన్ని కోతలు ఉండవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి.
అంతర్జాతీయ అనిశ్చితి: డొనాల్డ్ ట్రంప్ రాకతో అంతర్జాతీయ వాణిజ్యంలో తలెత్తిన అనిశ్చితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు వెండిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి? నిపుణుల సలహా
ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో సామాన్య ఇన్వెస్టర్లలో ఒకటే ఆందోళన.. ఇప్పుడే లాభాలు తీసుకోవాలా? లేక ఇంకా వేచి చూడాలా?
"అమెరికా ఆర్థిక మందగమనం, చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల వెండికి డిమాండ్ కొనసాగుతుంది. అయితే ధరలు విపరీతంగా పెరిగినప్పుడు మార్కెట్ ఒక్కసారిగా పడిపోయే (Correction) ప్రమాదం ఉంది" అని ఏంజెల్ వన్ రీసెర్చ్ డివిపి ప్రథమేష్ మాల్యా హెచ్చరించారు. భవిష్యత్తులో వెండి ధర రూ. 2.75 లక్షలకు చేరవచ్చని, ఒకవేళ మార్కెట్ పడితే రూ. 1.50 లక్షల స్థాయికి కూడా రావొచ్చని ఆయన అంచనా వేశారు.
మరోవైపు బోనాంజా సీనియర్ అనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ స్పందిస్తూ.. ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో 15-25 శాతాన్ని బంగారం, వెండి రూపంలో ఉంచుకోవాలని సూచించారు. అందులోనూ వెండికి 40 శాతం ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్లో వెండి ధరలు ఇలా
నేడు డిసెంబరు 29న హైదరాబాద్లో వెండి 10 గ్రాముల ధర రూ. 2,514గా, 100 గ్రాముల ధర రూ. 25,141గా ఉంది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ. 2,517గా, బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర 2,512గా ఉంది.
(గమనిక: ఈ వార్తా కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. మార్కెట్ పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.)
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


