...
...
Next Story

ఎస్ఐపీల్లో స్మాల్ క్యాప్ ఫండ్ల ధమాకా: టాప్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండ్

గత ఏడాది కాలంలో ఎస్ఐపీ (SIP) ఇన్వెస్టర్లకు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు బంపర్ రాబడులను అందించాయి. ఏడాది కాలపరిమితిలో 40.05 శాతం వార్షిక రాబడితో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అగ్రస్థానంలో నిలిచింది.

Published on: Aug 3, 2026, 17:46:07 IST
Advertisement

స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొన్నప్పటికీ, క్రమశిక్షణతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కొనసాగించిన ఇన్వెస్టర్లకు స్మాల్ క్యాప్ ఫండ్లు కాసుల వర్షం కురిపించాయి. వాల్యూ రీసెర్చ్ (Value Research) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గత ఏడాది కాలంలో 11 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలు 20 శాతానికి పైగా వార్షిక ఎస్ఐపీ రాబడులను (Annualised SIP Returns) అందించాయి. ఇందులో ఏకంగా ఆరు స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన ఫండ్లే కావడం విశేషం. టాప్-5 ఫండ్లలోనూ నాలుగు స్మాల్ క్యాప్ ఫండ్లే ఆక్రమించాయి.

మెరుగైన స్మాల్ క్యాప్ ఫండ్ల పనితీరు

ఎస్ఐపీల్లో స్మాల్ క్యాప్ ఫండ్ల ధమాకా: టాప్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండ్
ఎస్ఐపీల్లో స్మాల్ క్యాప్ ఫండ్ల ధమాకా: టాప్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండ్

ఈ జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఫండ్ ఏకంగా 40.05 శాతం ఎస్ఐపీ రాబడిని అందించి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది.

మహింద్రా మనులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ (25.58%), సుందరం స్మాల్ క్యాప్ ఫండ్ (21.56%) కూడా అత్యుత్తమ రాబడులను అందించిన ఫండ్ల జాబితాలో నిలిచాయి. అయితే. ఈ విశ్లేషణ నుంచి సెక్టోరల్, థిమాటిక్ ఫండ్లను మినహాయించారు.

ఇతర కేటగిరీల్లో ఎవరిది పైచేయి?

మిడ్ క్యాప్ కేటగిరీలో హెచ్‌ఎస్‌బీసీ (HSBC) మిడ్‌క్యాప్ ఫండ్ 25.68 శాతం ఎస్ఐపీ రాబడితో టాప్‌లో నిలవగా.. వైట్‌ఓక్ క్యాపిటల్ మిడ్ క్యాప్ ఫండ్ (22.16%), జేఎమ్ మిడ్‌క్యాప్ ఫండ్ (20.95%), ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ (20.93%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. లార్జ్ & మిడ్ క్యాప్ విభాగంలో ఇన్వెస్కో ఇండియా లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ ఒక్కటే 20 శాతం మార్కును దాటింది.

ఈ రాబడులు ఇన్వెస్టర్ల సంపదను గణనీయంగా పెంచాయి. అగ్రస్థానంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌లో నెలకు రూ.10,000 చొప్పున ఏడాది పాటు చేసిన ఎస్ఐపీ పెట్టుబడి (మొత్తం రూ.1.20 లక్షలు) రూ.1.44 లక్షలకు పెరిగింది. టాప్ 10లోని మిగిలిన ఫండ్లలో చేసిన పెట్టుబడులు రూ.1.33 లక్షల నుంచి రూ.1.39 లక్షల వరకు లాభాలను అందించాయి.

స్వల్పకాలిక విజేతల వెంట పడొద్దు

కాబట్టి ఇన్వెస్టర్లు కేవలం ఏడాది రాబడులను మాత్రమే చూడకుండా.. వివిధ మార్కెట్ చక్రాలలో ఫండ్ యొక్క దీర్ఘకాలిక ప్రదర్శన, రాబడులలో నిలకడ, పోర్ట్‌ఫోలియో నాణ్యత, ఫండ్ మేనేజర్ అనుభవం, ఎక్స్‌పెన్స్ రేషియో (Expense Ratio) వంటి అంశాలను పరిశీలించాలి. మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి అనుగుణంగా ఫండ్లను ఎంచుకోవాలి. సుదీర్ఘ కాలంలో మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా ఎస్ఐపీలను కొనసాగించడమే మెరుగైన సంపద సృష్టికి సరైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe