Srikakulam stampede : రోజుకో తొక్కిసలాట ఘటన! గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు- నివారించలేమా?
పెరుగుతున్న జనాభా, ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో తొక్కిసలాట జరగకుండా నివారించడం నేడు ఒక పెద్ద సవాలుగా మారింది! దాదాపు ప్రతి రాష్ట్రంలో తొక్కిసలాట ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏం చేస్తే తొక్కిసలాటలు జరగవు? అసలు ఇవి ఎందుకు జరుగుతాయి?
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటం ఆందోళనకర విషయం. క్యూలైన్లలో తోపులాట జరగటం, అదే సమయంలో రెయిలింగ్ విరిగిపోవటం వల్ల ఈ విషాదం జరిగినట్టు సమాచారం. ఘటనాస్థలం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు అత్యంత భయానకంగా, విషాదకరంగా ఉన్నాయి.

మహాకుంభ మేళా తొక్కిసలాట, దిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట తిరుపతి క్యూ లైన్లలో తొక్కిసలాట, ఆర్సీబీ పరేడ్లో తొక్కిసలాట నుంచి నేటి శ్రీకాకుళంలో జరిగిన ప్రమాదం వరకు.. ఈ ఏడాది అనేక విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా సెలవు దినాల్లో, పండుగ వేళ్లల్లో ఆలయాలు, రద్దీ ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయంగా ఉంటోంది.
ఈ సమస్యకు పరిష్కారం లేదా? అనే సందేహం ఇప్పుడు అందరిలో ఉత్పన్నమవుతోంది!
అసలు తొక్కిసలాట అంటే ఏంటి?
రద్దీ ఒక్కసారిగా పెరిగిపోవడం : భారీ సమూహం కదలికలు అదుపుతప్పి.. కిందపడిపోయి, ఉక్కిరిబిక్కరి అవ్వడం.
గందరగోళం, అతృత : వీటి వల్ల ప్రజల్లో భయం పెరుగుతుంది. చిన్న స్థలంలో ఎక్కువ మంది కదిలేందుకు ప్రయత్నిస్తారు. రద్దీ పెరిగిపోతుంది. గందరగోళం తారస్థాయికి చేరుతుంది.
పలు అధ్యయనాల ప్రకారం మన దేశంలో 79శాతం తొక్కిసలాటలు మతపరమైన కార్యక్రమాల్లోనే జరుగుతుంటాయి!
తొక్కిసలాట ఘటనలు ఎందుకు జరుగుతాయి?
కట్టడాలు కూలడం : రద్దీని దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా నిర్మించిన కట్టడాలు కూలిపోవడం, బ్యారికెడ్లను సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం, ఎంట్రీ-ఎగ్జిట్ చాలా ఇరుకుగా ఉండటం.
రద్దీ నియంత్రణ చర్యలు సరిగ్గా లేకపపోవడం : అనుకున్న దాని కన్నా ఎక్కువ మంది వచ్చినప్పుడు లేదా ఎక్కువ మంది రారు అనుకుని తక్కువ మందికి ఏర్పాట్లు చేసినప్పుడు, మేనేజ్ చేసేందుకు తగిన సిబ్బంది లేనప్పుడు, ఎగ్జిట్ పాయింట్లు ఎక్కువగా లేనప్పుడు.
గందరగోళం, ఊహాగానాలు : ఎవరైనా తప్పుడు వదంతులు వ్యాపించినప్పుడు.
ఎలక్ట్రికల్ సమస్యలు : షార్ట్ సర్క్యూట్, లైటింగ్ సరిగ్గా లేనప్పుడు, మంటలను అదుపుచేసేందుకు సరైన సెటప్ లేనప్పుడు గందరగోళం మొదలవుతుంది.
కోఆర్డినేషన్ లేనప్పుడు : వ్యవస్థలు సరిగ్గా ప్లాన్ చేయనప్పుడు, ప్రతిస్పందన ఆలస్యమైనప్పుడు, రియల్ టైమ్ మానిటరింగ్ లేనప్పుడు.
తొక్కిసలాట నివారణలో సవాళ్లు ఏంటి?
పెద్ద సంఖ్యలో జనం గుమికూడినప్పుడు నియంత్రణను కోల్పోవడం, కొన్ని లోపాలు తొక్కిసలాటకు దారితీస్తున్నాయి.
నియంత్రణ లేని జన ప్రవాహం: మతపరమైన సెంటిమెంట్లు, క్రమశిక్షణ లేకపోవడం, ఒక్కసారిగా జనం పోటెత్తడం వల్ల జన నియంత్రణ కష్టమవుతుంది.
చట్ట అమలులో లోపాలు: శిక్షణ పొందిన సిబ్బంది కొరత, సమన్వయం లేకపోవడం, సెక్టార్ల వారీగా సరిగ్గా మోహరించకపోవడం వంటివి అత్యవసర ప్రతిస్పందన ప్రయత్నాలను అడ్డుకుంటాయి.
మౌలిక సదుపాయాల నిర్వహణ లోపం: ఇరుకైన దారులు, బలహీనమైన వంతెనలు, అక్రమ ఆక్రమణలు వంటి అడ్డంకులను సృష్టించి, జనం ఒక్కసారిగా పోటెత్తడానికి దారితీస్తాయి.
సాంకేతికత వినియోగం లేమి: రియల్ టైమ్ క్రౌడ్ అనలిటిక్స్, జీపీఎస్ ట్రాకింగ్, ఏఐ ఆధారిత జన నియంత్రణ వ్యవస్థలు లేకపోవడం వల్ల సంక్షోభ ప్రతిస్పందన ఆలస్యం అవుతుంది.
ముందస్తు నమోదుకు ప్రతిఘటన: చాలా మంది భక్తులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీని కారణంగా పర్యవేక్షణ లేని జన ప్రవాహం పెరిగి, సామర్థ్యం మించిపోయే సమస్యలు వస్తున్నాయి.
తొక్కిసలాట ఘటనలను ఎలా నివారించొచ్చు?
తొక్కిసలాట వంటి ఘటనలను నివారించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) పలు మార్గదర్శకాలను తెలియజేసింది.
జన అంచనా, నిర్వహణ: అధికారులు ఆశించిన జన సమూహం పరిమాణాన్ని అంచనా వేయాలి, ప్రవేశ ద్వారాలను నియంత్రించాలి, పాదచారుల రద్దీని క్రమబద్ధీకరించాలి.
మౌలిక సదుపాయాలు, భద్రత: పటిష్టమైన బ్యారికేడ్లు, అత్యవసర ఎగ్జిట్ మార్గాలు, తగినంత వెంటిలేషన్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
భద్రత, నిఘా: జన సమూహ కదలికలను పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, శిక్షణ పొందిన భద్రతా సిబ్బందిని మోహరించాలి.
అత్యవసర సంసిద్ధత: తక్షణ ప్రతిస్పందన కోసం వైద్య బృందాలు, అంబులెన్స్లు, అగ్నిమాపక యూనిట్లను వ్యూహాత్మకంగా నియమించాలి.
ప్రజా అవగాహన, సమాచార వ్యాప్తి: భయభ్రాంతులకు లోనవకుండా ఉండేందుకు సైన్బోర్డ్లు, హెల్ప్లైన్ నంబర్లు, రియల్ టైమ్ డిజిటల్ అప్డేట్ల ద్వారా హాజరైన వారికి అవగాహన కల్పించాలి.
భవిష్యత్తు ప్రణాళిక ఇలా ఉంటే తొక్కిసలాట జరగదు!
తొక్కిసలాటలను నివారించడానికి వ్యవస్థాపరమైన మార్పులు, సాంకేతికతను జోడించడం చాలా కీలకం. ఇప్పుడు అత్యవసరం.
కఠినమైన ముందస్తు నమోదు: ప్రవేశ పరిమితులను నియంత్రించడానికి తప్పనిసరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను అమలు చేయాలి.
అధునాతన ఏఐ పర్యవేక్షణ: రియల్ టైమ్ క్రౌడ్ విశ్లేషణ కోసం, రద్దీని అంచనా వేయడానికి, జన సంచయాన్ని నివారించడానికి ఏఐ, డ్రోన్లను ఉపయోగించాలి.
భద్రతా సిబ్బందికి శిక్షణ: జన మనస్తత్వం, అత్యవసర ప్రతిస్పందనలలో నైపుణ్యం ఉన్న శిక్షణ పొందిన సిబ్బందిని, వాలంటీర్లను మోహరించాలి.
సమర్థవంతమైన ట్రాఫిక్, కదలిక ప్రణాళిక: సెక్టార్ల వారీగా జన నిర్వహణ, వన్-వే కదలిక మార్గాలు, ప్రత్యేక అత్యవసర లేన్లను అమలు చేయాలి.
అత్యవసర మాక్ డ్రిల్స్: సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికారులు, భద్రతా సిబ్బంది, ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి తరచుగా తొక్కిసలాట ప్రతిస్పందన డ్రిల్స్ను నిర్వహించాలి.
ఎన్డీఎంఏ చెప్పినట్టు.. "నివారణ అనేది చికిత్స కంటే ఉత్తమం!" భవిష్యత్తులో తొక్కిసలాటలు జరగకుండా నిరోధించడానికి చురుకైన జన నిర్వహణ, సాంకేతికత జోడింపు, కఠినమైన నిబంధనలు కీలకం. సమర్థవంతమైన విధానాల అమలు, వివిధ ఏజెన్సీల సమన్వయం ప్రాణాలను కాపాడుతుంది, ప్రజల సమావేశాలను సురక్షితంగా నిర్వహిస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


