Stock market holiday : ఈరోజు స్టాక్ మార్కెట్లకు సెలవు- ఈ నెలలోనే ఇంకో రెండు!
ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు కీలక అలర్ట్! ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు మూతపడి ఉంటాయి. అంతేకాదు, ఈ నెలలోనే స్టాక్ మార్కెట్లకు మరో రెండు రోజులు సెలవులు లభిస్తున్నాయి. ఆ వివరాలు..
సోమవారం (మార్చి 2) భారత స్టాక్ మార్కెట్లో చోటుచేసుకున్న భారీ పతనం ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బ తీసింది. అయితే, మంగళవారం (మార్చి 3) 'హోలీ' సందర్భంగా మార్కెట్కు సెలవు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను మార్చి 4న జరుపుకుంటున్నప్పటికీ, ఎక్స్ఛేంజీల క్యాలెండర్ ప్రకారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు మార్చి 3నే ఉండటం గమనార్హం.
మార్కెట్ సెలవుల వివరాలు..
బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండూ మంగళవారం పూర్తిగా మూసివేసి ఉంటాయి. కమోడిటీ మార్కెట్ (ఎంసీఎక్స్) విషయానికి వస్తే, ఉదయం సెషన్ సెలవు ఉంటుంది, కానీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రేడింగ్ యధావిధిగా కొనసాగుతుంది.
మార్చి నెలలో ఈరోజు, వారాంతపు సెలవులు కాకుండా మరో రెండు కీలక సెలవులు ఉన్నాయి:
- మార్చి 26 (గురువారం): శ్రీరామ నవమి
- మార్చి 31 (మంగళవారం): శ్రీ మహావీర్ జయంతి
2026 సంవత్సరంలో మొత్తం 16 ట్రేడింగ్ సెలవులు ఉండగా, ఇప్పటికే జనవరిలో రెండు సెలవులు ముగిశాయి. ఏప్రిల్, మే నెలల్లో రెండేసి చొప్పున, జూన్లో ఒకటి, సెప్టెంబర్, డిసెంబర్లో ఒక్కొక్కటి, అక్టోబర్, నవంబర్లో రెండేసి చొప్పున సెలవులు రానున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో మాత్రం ఎటువంటి ట్రేడింగ్ సెలవులు లేవు.
సోమవారం మార్కెట్ పతనానికి కారణాలేంటి?
ప్రస్తుతం భారత మార్కెట్లు అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఘర్షణలు, ఇరాన్ సుప్రీం లీడర్, ఇతర సైనిక అధికారుల మరణం యుద్ధ మేఘాలను కమ్మేలా చేశాయి.
ముడి చమురు సెగ:
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ గుండా రవాణా నిలిచిపోయింది. ప్రపంచ చమురు అవసరాల్లో ఐదో వంతు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. దీనివల్ల ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, పెయింట్స్, టైర్ల వంటి రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
ఈ పరిణామాల మధ్య సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1048 పాయింట్లు పడి 80,239 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 313పాయింట్లు కోల్పోయి 24,870 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 689 పాయింట్లు పడి 59,840 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,295.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,593.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన..
మార్కెట్ పడిపోతోందని కంగారు పడి షేర్లను విక్రయించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ, "సంక్షోభ సమయాల్లో భయపడి అమ్మేయడం సరైన వ్యూహం కాదు. గత కొన్ని దశాబ్దాల డేటాను పరిశీలిస్తే, ఇలాంటి సంక్షోభాల ప్రభావం ఆరు నెలల తర్వాత మార్కెట్పై ఉండదు," అని పేర్కొన్నారు.
గతంలో కోవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా ఘర్షణల సమయంలో కూడా మార్కెట్లు ఇలాగే కుప్పకూలినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ రికార్డు స్థాయిలకు చేరుకున్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.
ఈ 2026లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా..
| Sr. No | తేదీ | రోజు | కారణం |
|---|---|---|---|
| 1 | 15-Jan-2026 | Thursday | Municipal Corporation Election - Maharashtra |
| 2 | 26-Jan-2026 | Monday | Republic Day |
| 3 | 03-Mar-2026 | Tuesday | Holi |
| 4 | 26-Mar-2026 | Thursday | Shri Ram Navami |
| 5 | 31-Mar-2026 | Tuesday | Shri Mahavir Jayanti |
| 6 | 03-Apr-2026 | Friday | Good Friday |
| 7 | 14-Apr-2026 | Tuesday | Dr. Baba Saheb Ambedkar Jayanti |
| 8 | 01-May-2026 | Friday | Maharashtra Day |
| 9 | 28-May-2026 | Thursday | Bakri Id |
| 10 | 26-Jun-2026 | Friday | Muharram |
| 11 | 14-Sep-2026 | Monday | Ganesh Chaturthi |
| 12 | 02-Oct-2026 | Friday | Mahatma Gandhi Jayanti |
| 13 | 20-Oct-2026 | Tuesday | Dussehra |
| 14 | 10-Nov-2026 | Tuesday | Diwali-Balipratipada |
| 15 | 24-Nov-2026 | Tuesday | Prakash Gurpurb Sri Guru Nanak Dev |
| 16 | 25-Dec-2026 | Friday | Christmas |
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


