'సమయాన్ని వృథా చేయకండి': విద్యార్థుల నిరసనపై విచారణకు సుప్రీంకోర్టు నో
ఢిల్లీలో విద్యార్థుల 'ఛలో సంసద్' ఆందోళనపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వీడియో ఆధారాలు చూసే సమయం కోర్టుకు లేదని, చట్టపరమైన మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్పై అసహనం వ్యక్తం చేశారు.
ఢిల్లీ వేదికగా విద్యార్థి సంఘాలు చేపట్టిన 'ఛలో సంసద్' నిరసనలపై పోలీసులు జరిపిన బలప్రయోగంపై సుమోటోగా అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఉండబోదని స్పష్టం చేస్తూ, సరైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. "మా సమయాన్ని వృథా చేయకండి, మీ సమయాన్ని కూడా వృథా చేసుకోవద్దు" అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

వీడియోలు చూసే సమయం మాకు లేదు: అత్యున్నత న్యాయస్థానం
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంస్కరణలు, నీట్ (NEET) పరీక్షల్లో అక్రమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు జూలై 20న 'ఛలో సంసద్' నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు జరిపిన దౌర్జన్యాన్ని సుమోటోగా స్వీకరించాలని కోరుతూ బుధవారం బెంచ్ ఎదుట ఒక న్యాయవాది విజ్ఞప్తి చేశారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం దీనిపై స్పందించింది.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, నిరసనకారులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని న్యాయవాది వాదించేందుకు యత్నించారు. పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలను కోర్టుకు సమర్పిస్తానని తెలిపినప్పటికీ ధర్మాసనం వినడానికి నిరాకరించింది. "వీడియోలపై మాకు ఆసక్తి లేదు, వాటిని చూసేంత సమయం మాకు లేదు" అని సీజేఐ స్పష్టం చేశారు.
అంతకుముందు రోజు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.కె. ఉపాధ్యాయ కూడా ఇలాంటి విజ్ఞప్తినే తోసిపుచ్చారు. "ఈ వ్యవహారాల్లోకి కోర్టులను లాగకండి" అని ఢిల్లీ హైకోర్టు సీజే వ్యాఖ్యానించారు.
అసలేం జరిగింది?
జంతర్ మంతర్ వద్ద గత మూడు వారాలకు పైగా సాగుతున్న నిరాహార దీక్షకు కొనసాగింపుగా జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే 'ఛలో పార్లమెంట్' ప్రదర్శన జరిగింది. వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. మధ్యాహ్న సమయంలో నిరసనకారులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లడంతో పోలీసులు కన్నీటి వాయుగోళాలు ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు.
ఈ దాడిలో నిరసనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం 100 మందికి పైగా గాయపడగా, పోలీసులు మాత్రం గాయపడిన వారి సంఖ్య 60 అని తెలిపారు. గాయపడిన 22 ఏళ్ల విద్యార్థిని ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా (RML) ఆసుపత్రి ఐసీయూలో తీవ్ర పరిస్థితిలో చికిత్స పొందుతోంది.
రాజుకున్న రాజకీయం
ఢిల్లీ పోలీసుల చర్యపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు తెలపడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, విద్యార్థులపై దాడికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కోరారు.
మరోవైపు 32వ రోజుకు చేరిన నిరసనల్లో CJP తమ డిమాండ్ల జాబితాను పొడిగించింది. సొనామ్ వాంగ్చుక్ విడుదల, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారంతో పాటు జూలై 20 నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


