...
...
Next Story

గృహిణులు దేశ నిర్మాతలు: పరిహారం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఇళ్లల్లో మహిళలు చేసే శ్రమకు వెలకట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక గృహిణి కేసు విచారణ సందర్భంగా.. ఆమె సేవలను నెలకు కనీసం రూ.30,000 ఆదాయంతో సమానంగా పరిగణించాలని అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

Published on: Jun 11, 2026, 17:26:15 IST
Advertisement

ఇంట్లో గృహిణి (హోమ్‌మేకర్) రోజంతా చేసే పనులకు ఎనలేని విలువ ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గృహిణులు కేవలం కుటుంబాలనే కాదు, దేశాన్ని నిర్మిస్తారని కొనియాడింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక మహిళకు సంబంధించిన పరిహారం కేసును విచారిస్తూ, గృహిణి అందించే గృహ సంరక్షణ సేవలను నెలకు కనీసం రూ. 30,000 ఆదాయంగా లెక్కించాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్‌కే సింగ్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

అసలు కేసేంటి?

గృహిణులు దేశ నిర్మాతలు: పరిహారం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
గృహిణులు దేశ నిర్మాతలు: పరిహారం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యం పంజాబ్‌ రాష్ట్రంలో జరిగింది. 2001 నవంబర్ 25న జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె భర్త, ముగ్గురు పిల్లలు పరిహారం కోసం 'మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్'ను ఆశ్రయించారు. అప్పట్లో ఆ ట్రిబ్యునల్ వారికి రూ. 2.42 లక్షల పరిహారాన్ని మంజూరు చేసింది. అయితే ఈ పరిహారంతో సంతృప్తి చెందని బాధితులు హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆ మొత్తాన్ని 7.5 శాతం వడ్డీతో కలిపి రూ. 8.43 లక్షలకు పెంచింది. అయినప్పటికీ తగిన న్యాయం జరగలేదని భావించిన కుటుంబ సభ్యులు చివరకు సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఈ అప్పీలును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, బాధితులకు అదనపు పరిహారం మంజూరు చేస్తూ గృహిణుల ప్రాధాన్యతను నొక్కి చెప్పింది. మోటారు వాహనాల ప్రమాద కేసుల్లో గృహిణిని కోల్పోవడాన్ని ఒక ప్రత్యేకమైన, పరిహారం చెల్లించదగిన నష్టంగా పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది.

"కుటుంబ పోషణ కోసం ప్రత్యక్షంగా సంపాదించే వ్యక్తి ఎంత ముఖ్యమో, ఇంట్లో ఉంటూ సేవలు అందించే గృహిణి పాత్ర కూడా అంతే ముఖ్యం" అని బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం కోర్టు వ్యాఖ్యానించింది.

"మేం కొన్ని ప్రాథమిక సూత్రాలను రూపొందించాం. గృహిణి అందించే గృహ సంరక్షణ నష్టాన్ని ఏ పరిస్థితిలోనైనా నెలకు కనీసం రూ. 30,000 ఆదాయంగా నిర్ధారించాం" అని ధర్మాసనం పేర్కొంది.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 'ప్రణయ్ సేథి' తీర్పులో పేర్కొన్న నష్టపరిహార నిబంధనలకు అదనంగా, ఈ 'గృహ సంరక్షణ నష్టం' (Loss of domestic care) అనే అంశాన్ని కూడా చేర్చాలని జస్టిస్ కరోల్ స్పష్టం చేశారు.

ఆధారపడేది ఎవరు?

గృహిణుల శ్రమను సమాజం తక్కువగా అంచనా వేయడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. సంపాదించే కుటుంబ సభ్యులపై గృహిణులు ఆధారపడతారని అనడం నిజానికి ఒక విచిత్రమైన వాదన అని, వాస్తవానికి గృహిణిపైనే ఇల్లు గడుస్తుందని కోర్టు అభిప్రాయపడింది.

"ఆర్థికంగా సంపాదించే వారే నిజానికి గృహిణిపై పూర్తిగా ఆధారపడతారు, కానీ దురదృష్టవశాత్తు ఈ వాస్తవానికి దక్కాల్సిన గుర్తింపు లభించడం లేదు. వివిధ రంగాల్లో ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఇంకా ప్రయాణించాల్సిన దూరం ఎంతో ఉంది" అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.

ఇకపై 'హోమ్‌మేకర్' అనే పదానికి 'దేశ నిర్మాత' (Nation Builder) అనే గుర్తింపు లభిస్తుందని తాము ఆశిస్తున్నట్లు జస్టిస్ కరోల్ వ్యాఖ్యానించారు.

ఏడాదిలోనే క్లెయిమ్‌లు తేల్చాలి

మోటారు ప్రమాదాల నష్టపరిహార కేసుల్లో జరుగుతున్న తీవ్ర ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదాల బారిన పడిన కుటుంబాలకు సకాలంలో న్యాయం అందడం లేదని పేర్కొంది. ఇలాంటి సున్నితమైన కేసులను గరిష్టంగా ఏడాది (ఒక సంవత్సరం) లోపే పరిష్కరించాలని, బాధితులకు త్వరగా ఉపశమనం కలిగించాలని అధికారులను, న్యాయస్థానాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe