...
...
Next Story

సూరత్ నుంచి చెన్నైకి కేవలం 17 గంటలే! 19,142 కోట్ల హైవే ప్రాజెక్టుకు కేంద్రం ఓకే

సూరత్ - చెన్నై ప్రయాణ సమయాన్ని 31 గంటల నుంచి 17 గంటలకు తగ్గించేలా ₹19,142 కోట్ల హైవే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. నాశిక్ - సోలాపూర్ - అక్కల్‌కోట్ కారిడార్‌తో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

Published on: Jan 2, 2026, 15:33:50 IST
Advertisement

ఇకపై సూరత్ నుంచి చెన్నైకి రోడ్డు మార్గంలో వెళ్లడం మరింత సులభం కానుంది. గంటల కొద్దీ సాగే సుదీర్ఘ ప్రయాణ భారానికి చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నేషనల్ హైవే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా 19,142 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త కారిడార్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ప్రస్తుతం పడుతున్న 31 గంటల ప్రయాణ సమయం ఏకంగా 14 గంటలు తగ్గి, కేవలం 17 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

సూరత్ నుంచి చెన్నైకి కేవలం 17 గంటలే! 19,142 కోట్ల హైవే ప్రాజెక్టుకు కేంద్రం ఓకే (@narendramodi)
సూరత్ నుంచి చెన్నైకి కేవలం 17 గంటలే! 19,142 కోట్ల హైవే ప్రాజెక్టుకు కేంద్రం ఓకే (@narendramodi)

మహారాష్ట్రలో నిర్మించే 374 కిలోమీటర్ల పొడవైన 'గ్రీన్‌ఫీల్డ్ నాశిక్-సోలాపూర్-అక్కల్‌కోట్' హైవే నిర్మాణానికి డిసెంబర్ 31, 2025న జరిగిన క్యాబినెట్ సమావేశంలో పచ్చజెండా ఊపారు. ఇది సూరత్-చెన్నై హైస్పీడ్ కారిడార్‌లో కీలక భాగంగా ఉంటుంది.

నాశిక్-సోలాపూర్-అక్కల్‌కోట్ హైవే ప్రత్యేకతలు:

దేశంలోని హైస్పీడ్ జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల్లో ఇదొక మైలురాయి అని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రధాన ఫీచర్లు ఇవే:

వేగవంతమైన ప్రయాణం: ప్రస్తుతం వాహనాల సగటు వేగం గంటకు 60 కిమీ ఉంటే, ఈ కొత్త రహదారి వల్ల అది 100 కిలోమీటర్లకు పెరుగుతుంది.

దూరం తగ్గింపు: నాశిక్ - సోలాపూర్ మధ్య దూరం 432 కిమీ నుంచి 374 కిమీకి (సుమారు 14 శాతం) తగ్గుతుంది.

ప్రత్యామ్నాయ మార్గం: ప్రస్తుతం ఉన్న ముంబై-చెన్నై కారిడార్‌కు ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది.

నిర్మాణ శైలి: దేశ హైవేల చరిత్రలోనే 'బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్' (BOT) పద్ధతిలో చేపడుతున్న అతిపెద్ద విలువైన ప్రాజెక్టు ఇదేనని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

రెండు ప్యాకేజీలు: ఈ 374 కిమీ రహదారిని నాశిక్ నుంచి అహల్యనగర్ (152 కిమీ), అహల్యనగర్ నుంచి అక్కల్‌కోట్ (222 కిమీ) అనే రెండు భాగాలుగా నిర్మించనున్నారు.

ఒడిశాలోనూ రహదారుల విస్తరణ

ఈ సమావేశంలోనే ఒడిశాలోని NH-326 రహదారి విస్తరణకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొహనా నుంచి కోరాపుట్ వరకు 206 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రెండు వరుసలుగా విస్తరిస్తారు. దీనివల్ల ప్రయాణ సమయం 3 గంటలు తగ్గనుంది.

ముఖ్యంగా గజపతి, రాయగడ, కోరాపుట్ వంటి గిరిజన జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'కోరాపుట్ కాఫీ' రవాణాకు ఇది ఎంతో తోడ్పడుతుందని అశ్విని వైష్ణవ్ వివరించారు. ఈ పనులు రెండేళ్లలో పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe