Toyota Land Cruiser FJ : అదిరే రెట్రో లుక్​తో టయోటా ల్యాండ్​ క్రూయిజర్​ ఎఫ్​జే- ధర తెలిస్తే షాక్..​

బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షో 2026 వేదికగా టయోటా తన సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్​జేని లాంచ్​ చేసింది. లాడర్-ఫ్రేమ్ ఛాసిస్, 4డబ్ల్యూడీ పవర్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది.

Published on: Mar 25, 2026, 09:40:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టయోటా సంస్థ తన మోస్ట్ ఎవైటెడ్ ఎస్‌యూవీ ‘ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్​జే’ ను ఎట్టకేలకు లాంచ్​ చేసింది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 47వ బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షో 2026లో ఈ వాహనాన్ని అధికారికంగా ప్రదర్శించారు. గతేడాది అక్టోబర్‌లోనే దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా ఇప్పుడు మోడల్​ని అధికారికంగా రివీల్​ చేసింది. అంతేకాదు, ఈ నెలాఖరు నుంచే థాయ్‌లాండ్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అక్కడ ఈ మోడల్ కేవలం 4డబ్ల్యూడీ 2.7 వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది. దీని ప్రారంభ ధరను 1.269 మిలియన్ బాట్ (భారత కరెన్సీలో సుమారు రూ. 36.40 లక్షలు) గా నిర్ణయించారు.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్​జే..
టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్​జే..

టయోటా ల్యాండ్​ క్రూయిజర్​ ఎఫ్​జే విశేషాలు..

ప్రస్తుత కాలంలో వస్తున్న చాలా కాంపాక్ట్ ఎస్‌యూవీలు కార్ల ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడి తయారవుతున్నాయి. కానీ, ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్​జే మాత్రం పాత పద్ధతినే అనుసరించింది. ఇది టయోటాకు చెందిన అత్యంత నమ్మకమైన 'IMV0 లాడర్-ఫ్రేమ్' ఆర్కిటెక్చర్‌పై నిర్మితమైంది. థాయ్‌లాండ్‌లో ఈ బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణం వల్ల దీనిని ట్యాక్సేషన్ ప్రయోజనాల కోసం 'ట్రక్-బేస్డ్ ఎస్‌యూవీ'గా వర్గీకరించారు.

డైమెన్షన్స్​ విషయానికి వస్తే.. ఇది 4,610 ఎంఎం పొడవు, 1,855 ఎంఎం వెడల్పు, 1,890 ఎంఎం ఎత్తును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 2,580 ఎంఎంగా ఉంది.

ఈ కొత్త ఎఫ్​జే మోడల్ రెట్రో లుక్​ని తలపిస్తోంది. ఇది బాక్సీ, నిటారుగా ఉండే బాడీతో చూడగానే పాత తరం 'ఎఫ్​జే క్రూయిజర్'ను గుర్తుకు తెస్తుంది. ముందు భాగంలో గ్రిల్ పైన స్పష్టంగా కనిపించే 'TOYOTA' లోగో, దానికి ఇరువైపులా సీ-షేప్డ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక ఆప్షనల్ కింద రెట్రో స్టైల్ రౌండ్ ల్యాంప్స్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. సైడ్ ప్రొఫైల్‌లో స్టెప్డ్ గ్లాస్‌హౌస్, మందపాటి సీ-పిల్లర్ దీనికి కరుడుగట్టిన ఆఫ్-రోడర్ లుక్‌ను ఇస్తున్నాయి. వెనుక భాగంలో ఆక్టాగోనల్ ఆకారంలో ఉండే సైడ్-హింజ్డ్ టెయిల్‌గేట్‌తో పాటు బయటి వైపు అమర్చిన స్పేర్ వీల్ దీని ప్రత్యేకత.

టయోటా ల్యాండ్​ క్రూయిజర్​ ఎఫ్​జే- టెక్నాలజీ..

కారు లోపలి భాగంలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు:

డిస్‌ప్లే: 7- ఇంచ్​ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేతో పాటు 12.3- ఇంచ్ భారీ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్.

కనెక్టివిటీ: యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సదుపాయం.

ఆడియో అండ్ క్లైమేట్: ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టమ్, పీఎం2.5 ఫిల్ట్రేషన్ సెటప్‌తో కూడిన డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్.

సీటింగ్: బ్లాక్ సింథటిక్ లెదర్ అప్హోల్స్టరీ, 8-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 4-వే మాన్యువల్ ప్యాసింజర్ సీట్.

చార్జింగ్: మూడు యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి.

సామాగ్రిని ఉంచే కార్గో ఏరియాలో మిలిటరీ తరహా 'MOLLE' మౌంటింగ్ ప్యానెల్స్‌ను ఇచ్చారు. దీనివల్ల అవుట్‌డోర్ గేర్ లేదా ఇతర వస్తువులను సురక్షితంగా కట్టుకోవడానికి వీలవుతుంది.

Dhurandhar 2 : ఆదిత్య ధర్​ పీక్​ డీటైలింగ్​! ధురంధర్​ 2లో వాడిన క్రేజీ కార్లు ఇవే..

టయోటా ల్యాండ్​ క్రూయిజర్​ ఎఫ్​జే- ఇంజిన్, పర్ఫార్మెన్స్​..

థాయ్-స్పెక్ మోడల్‌లో ఫార్చ్యూనర్‌లో కనిపించే 2TR-FE 2.7-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఫోర్-సిలిండర్ ఇంజిన్ 5,200 ఆర్పఎం వద్ద 166 పీఎస్​ పవర్‌ను, 4,000 ఆర్పీఎం వద్ద 245 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సీక్వెన్షియల్ షిఫ్ట్ ఫంక్షన్‌తో కూడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

సాధారణ మిడ్‌సైజ్ ఎస్‌యూవీలతో పోలిస్తే ఇది మెకానికల్ పరంగా ఎంతో భిన్నమైనది. ఇందులో పార్ట్-టైమ్ ఫోర్-వీల్-డ్రైవ్ సెటప్‌తో పాటు హీలక్స్ నుంచి తీసుకున్న లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేస్ హార్డ్‌వేర్‌ను అమర్చారు.

భారత మార్కెట్​లోకి ఎప్పుడు?

టయోటా ఈ ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్​జేని మరో రెండేళ్లలోపు భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం భారత మార్కెట్లో కాంపాక్ట్ సైజులో ఉంటూ, అసలైన లాడర్-ఫ్రేమ్ ఛాసిస్, లో-రేంజ్ ఫోర్-వీల్-డ్రైవ్ హార్డ్‌వేర్ కలిగిన వాహనాలు చాలా తక్కువ. ఆ లోటును భర్తీ చేస్తూ ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్​జే ఇక్కడ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More