...
...
Next Story

అమెరికాలో 51వ రాష్ట్రంగా కలిసిపోయేందుకు సిద్ధమేనా? వెనిజులాపై ట్రంప్ వ్యాఖ్యలు

వరల్డ్ బేస్‌బాల్ క్లాసిక్‌లో వెనిజులా విజయం సాధించిన వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో కెనడా, గ్రీన్లాండ్ విషయంలోనూ ఇలాంటి ప్రతిపాదనలే చేసిన ట్రంప్, వెనిజులాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలిసిపోవాలని వ్యాఖ్యానించారు.

Published on: Mar 17, 2026 10:34 AM IST
Advertisement

దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్ చేశారు. సుమారు ఏడేళ్ల విరామం తర్వాత వాషింగ్టన్, కరాకస్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరణకు నోచుకున్న కొద్ది రోజులకే ట్రంప్ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం గమనార్హం.

బేస్‌బాల్ విజయం.. ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అమెరికా అధ్యక్షుడుు ట్రంప్ (Bloomberg)
అమెరికా అధ్యక్షుడుు ట్రంప్ (Bloomberg)

వరల్డ్ బేస్‌బాల్ క్లాసిక్ (WBC) సెమీఫైనల్లో ఇటలీపై వెనిజులా 4-2 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంపై స్పందిస్తూ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ప్రశంసలు కురిపించారు.

"వావ్! బేస్‌బాల్ సెమీఫైనల్లో ఇటలీని వెనిజులా 4-2తో ఓడించింది. వారు అద్భుతంగా ఆడుతున్నారు. ఈ మధ్య కాలంలో వెనిజులాకు అన్నీ మంచి రోజులే నడుస్తున్నాయి! అసలు ఈ మ్యాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర హోదా (STATEHOOD).. #51.. ఎవరైనా సిద్ధమేనా?" అని ట్రంప్ ప్రశ్నించారు.

గతంలో కెనడాను అమెరికాలో కలవాలని కోరిన ట్రంప్, గ్రీన్లాండ్‌ను కూడా కొనుగోలు చేస్తామని ప్రకటించి అప్పట్లో దుమారం రేపారు. అయితే, వెనిజులా విషయంలో ఆయన నేరుగా 'స్టేట్‌హుడ్' (రాష్ట్ర హోదా) అనే పదాన్ని వాడటం ఇదే మొదటిసారి.

మారిన రాజకీయ ముఖచిత్రం

ట్రంప్ వ్యాఖ్యల వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సరిగ్గా రెండు నెలల క్రితం, జనవరి 3న అమెరికా 'ఆపరేషన్ అబ్సొల్యూట్ రిజాల్వ్' పేరుతో ఒక భారీ సైనిక చర్య చేపట్టింది. కరాకస్‌లో జరిగిన ఈ మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అమెరికా ప్రత్యేక దళాలు బంధించాయి. వారిని నేరుగా న్యూయార్క్ తరలించి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం వంటి తీవ్రమైన ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు.

ప్రస్తుతం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్ హయాంలో అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఏడేళ్ల తర్వాత కరాకస్‌లో అమెరికా రాయబార కార్యాలయం మళ్లీ తెరుచుకుంది. మొదట్లో మదురో బంధీని 'కిడ్నాప్' అని విమర్శించిన రోడ్రిగ్జ్, ఆ తర్వాత ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మెత్తబడ్డారు.

ఇటీవలే అమెరికాకు 5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా చేసేందుకు ఆమె ఒప్పందంపై సంతకం చేశారు. అలాగే, ప్రైవేటు చమురు కంపెనీలకు అనుమతినిస్తూ కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ప్రపంచంలోని మొత్తం చమురు నిల్వల్లో 18 శాతం (సుమారు 304 బిలియన్ బ్యారెళ్లు) వెనిజులాలోనే ఉండటం గమనార్హం.

ముందున్న అసలు పోరు

మంగళవారం రాత్రి మయామిలో జరగనున్న వరల్డ్ బేస్‌బాల్ క్లాసిక్ ఫైనల్‌లో అమెరికా, వెనిజులా జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ట్రంప్ చేసిన '51వ రాష్ట్రం' వ్యాఖ్యలు అటు క్రీడా రంగంలో, ఇటు రాజకీయ వర్గాల్లో సెగలు పుట్టిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe