Anthropic : టెక్ ప్రపంచంలో సంచలనం- ఆంథ్రోపిక్ AIపై ట్రంప్ నిషేధం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ సాంకేతికతను వాడవద్దని అన్ని ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశించారు. దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తూ పెంటగాన్ ఈ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. దీనికి గల కారణాలు, దీనివల్ల ప్రభావితమయ్యే అంశాలపై ప్రత్యేక కథనం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రభుత్వంలోని అన్ని ఫెడరల్ ఏజెన్సీలు తక్షణమే 'ఆంథ్రోపిక్' సంస్థకు చెందిన ఏఐ టూవ్స్ని వాడటం నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. 79 ఏళ్ల ట్రంప్ ఈ ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పందిస్తూ.. ఆంథ్రోపిక్ స్టార్టప్ను దేశపు 'సరఫరా గొలుసు ముప్పు' (సప్లై- చెయిన్ రిస్క్)గా ముద్ర వేశారు. యుద్ధ రంగంలో కృత్రిమ మేధను (ఏఐ) ఎలా ఉపయోగించాలనే అంశంపై గత కొన్ని వారాలుగా పెంటగాన్, ఆంథ్రోపిక్ మధ్య జరుగుతున్న ఘర్షణ ఈ నిర్ణయంతో పరాకాష్టకు చేరింది.
ట్రంప్ వర్సెస్ ఆంథ్రోపిక్- ‘మమ్మల్ని శాసించలేరు’
ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఆంథ్రోపిక్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
"యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వంలోని ప్రతి ఫెడరల్ ఏజెన్సీని నేను ఆదేశిస్తున్నాను.. ఆంథ్రోపిక్ టెక్నాలజీ వినియోగాన్ని తక్షణమే నిలిపివేయండి. అది మాకు అవసరం లేదు, వద్దు కూడా! వారితో మేము మళ్లీ ఎన్నడూ వ్యాపారం చేయము!" అని ఆయన స్పష్టం చేశారు.
అయితే, రక్షణ శాఖ, ఇతర ఏజెన్సీలు ఆ సంస్థ ఉత్పత్తుల నుంచి బయటకు రావడానికి ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ట్రంప్ వర్సెస్ ఆంథ్రోపిక్- అసలు వివాదం ఏంటి?
ఈ వివాదం కేవలం ఒక కంపెనీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న సమస్య కాదు. ఇది "టెక్నాలజీపై నియంత్రణ ఎవరిది?" అనే మౌలిక ప్రశ్నకు సంబంధించిన పోరాటం. దీనిలోని ప్రధాన అంశాలు ఇవే:
1. సైనిక వినియోగం - నైతిక నిబంధనలు (ది రెడ్ లైన్స్)
పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ) తమ సైనిక అవసరాల కోసం ఏఐని ఎటువంటి ఆంక్షలు లేకుండా వాడాలని కోరుకుంటోంది. కానీ ఆంథ్రోపిక్ సంస్థ కొన్ని 'రెడ్ లైన్స్' (దాటకూడని గీతలు) విధించింది:
సామూహిక నిఘా: జనాన్ని ట్రాక్ చేయడానికి ఏఐని వాడకూడదు.
స్వయంప్రతిపత్తి ఆయుధాలు: మనుషుల ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకునే ఆయుధ వ్యవస్థల్లో తమ ఏఐని ఉపయోగించకూడదు.
ఆంథ్రోపిక్ దీనిని 'నైతికత' అంటుంటే, ట్రంప్ ప్రభుత్వం దీనిని అమెరికా రక్షణను దెబ్బతీసే "లెఫ్టిస్ట్ ఐడియాలజీ" లేదా "వోక్ సంస్కృతి" అని పిలుస్తోంది.
2. 'సప్లై చైన్ రిస్క్' - ఒక వ్యూహాత్మక దెబ్బ
రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆంథ్రోపిక్ని 'సప్లై చైన్ రిస్క్' (సరఫరా గొలుసు ముప్పు) గా ప్రకటించడం అతిపెద్ద మలుపు.
సాధారణంగా చైనా లేదా రష్యా వంటి శత్రు దేశాల కంపెనీలకు మాత్రమే ఈ ముద్ర వేస్తారు.
దీనివల్ల అమెరికా సైన్యంతో పనిచేసే వేల సంఖ్యలోని ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఎవరూ కూడా ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ను వాడటానికి వీల్లేదు. ఇది ఆ కంపెనీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే నిర్ణయం.
3. సిద్ధాంతాల ఘర్షణ
ప్రభుత్వ కోణం ప్రకారం.. ఒక ప్రైవేట్ కంపెనీ దేశ రక్షణ విధానాలను శాసించకూడదు.
ప్రభుత్వ వాదన: "యుద్ధం ఎలా చేయాలో మేము నిర్ణయిస్తాం, సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు కాదు."
ట్రంప్ ఆగ్రహం: ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ పట్ల ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. రక్షణ కంటే తమ సొంత సిద్ధాంతాలకే ఆంథ్రోపిక్ ప్రాధాన్యత ఇస్తోందని, ఇది "అహంకారం" అని ప్రభుత్వం భావిస్తోంది.
4. ఓపెన్ ఏఐ వైఖరితో పోలిక
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఓపెన్ ఏఐ కూడా ఇంచుమించు ఇలాంటి భద్రతా నియమాలనే కలిగి ఉంది. కానీ, ఆ సంస్థ ప్రభుత్వంతో చర్చలు జరిపి, మధ్యేమార్గంగా కొన్ని రాయితీలకు అంగీకరించింది. ఆంథ్రోపిక్ మాత్రం తన పద్ధతులకు కట్టుబడి ఉండటంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
"మా దేశ భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటాం.. వాస్తవ ప్రపంచం గురించి అవగాహన లేని, నియంత్రణ లేని రాడికల్ లెఫ్ట్ ఏఐ సంస్థలు కాదు," అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదం వెనుక ఉన్న రాజకీయ కోణాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ట్రంప్ వర్సెస్ ఆంథ్రోపిక్- సరఫరా గొలుసు ముప్పు!
రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీపై మండిపడ్డారు. "అమెరికా ప్రభుత్వం లేదా పెంటగాన్తో వ్యాపారం ఎలా చేయకూడదో ఆంథ్రోపిక్ ఈ వారం నిరూపించింది. ఇది అహంకారం, ద్రోహానికి పరాకాష్ట," అని ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా రాశారు.
"రిపబ్లిక్ రక్షణ కోసం ప్రతి చట్టబద్ధమైన ప్రయోజనానికి ఆంథ్రోపిక్ మోడల్స్ అందుబాటులో ఉండాలనేది మా స్థిరమైన నిర్ణయం. కానీ ఆంథ్రోపిక్, దాని సీఈఓ మోసపూరిత మార్గాన్ని ఎంచుకున్నారు. 'ఎఫెక్టివ్ ఆల్ట్రుయిజం' (మంచి చేసే ఉద్దేశం) అనే మాటల చాటున అమెరికా మిలిటరీని లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. ఇది సిలికాన్ వ్యాలీ సిద్ధాంతాలను అమెరికన్ల ప్రాణాల కంటే ఎక్కువగా చూసే పిరికిపంద చర్య," అని హెగ్సెత్ ఆరోపించారు.
గత ఏడాది ఆంథ్రోపిక్ పెంటగాన్ నుంచి ఏకంగా 200 మిలియన్ డాలర్ల భారీ కాంట్రాక్టును దక్కించుకోవడం ఇక్కడ గమనార్హం.
రంగంలోకి ఓపెన్ ఏఐ..
ఆంథ్రోపిక్ సంస్థను దూరం పెట్టిన పెంటగాన్, మరో ఏఐ దిగ్గజం 'ఓపెన్ ఏఐ' నిబంధనలకు మాత్రం పచ్చజెండా ఊపింది. క్లాసిఫైడ్ పనుల్లో తమ టెక్నాలజీని సురక్షితంగా వాడటానికి ఓపెన్ ఏఐ పెట్టిన నిబంధనలకు పెంటగాన్ అంగీకరించినట్లు సమాచారం. ఆంథ్రోపిక్ కూడా సామూహిక నిఘా, స్వయంప్రతిపత్తి కలిగిన ఆయుధాల విషయంలో అవే పరిమితులు పెట్టినప్పటికీ, అధికారులు ఆ కంపెనీని 'వోక్' (అతివాద వామపక్ష భావాలు) సంస్థగా ముద్ర వేయడం గమనార్హం.
వివాదం వల్ల అమెరికాలోని ఇతర ఏఐ కంపెనీలు కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి. ప్రభుత్వంతో కలిసి పనిచేయాలంటే తమ 'నైతిక నిబంధనలను' వదులుకోవాలా? లేక ప్రభుత్వ కాంట్రాక్టులను వదులుకోవాలా? అనేదే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


